ఉత్తర తెలంగాణ
మానవత్వం! (కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘ఏమండీ బయటికి వెడుతున్నారా? ఆ
పిచ్చిదాన్ని చూడండి... ఎలా ఉందో ఏమో!’
అంటూ సుధీర్తో అన్నది రజిత. ‘సరేలే
నేను చూస్తాను. నీవు విశ్రాంతి తీసుకో’
అంటూ సుధీర్ తలుపు దగ్గరగా వేసి
బయటకు వెళ్లాడు.
సుధీర్, రజిత భార్యాభర్తలు. వారికి ఈ
మధ్యనే ట్రాన్స్ఫర్ అయింది. సుధీర్
ఉపాధ్యాయుడు. అదే వూళ్లో పని చేస్తాడు.
వారిది మేనరిక వివాహం. పాపం రజితకు
ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. ఈ
మధ్యనే గర్భసంచి కూడా తీసేశారు. ఇక
పిల్లలను కనే అవకాశమే లేదు. ఈ
విషయంలో చాలా బాధ పడుతున్నారు.
గర్భసంచి తీసేసి పదిహేను రోజులు
అవుతోంది. తోడుగా వాళ్లమ్మగారు వచ్చారు.
‘అమ్మా కాసిని మంచినీళ్లియమ్మా’ అంటూ
వాళ్లమ్మగారిని పిలిచింది రజిత. నీళ్లిచ్చిన
వాళ్లమ్మతో ‘అమ్మా ఆ పిచ్చిది ఎలా ఉందో
ఏమో?’ అంటున్న రజితతో ‘నేను చూస్తాను.
ఊరికే ఆలోచించకు దాని గురించి. నీ
ఆరోగ్యం బాగాలేదు’ అంటూ లోపలికి వెళ్లింది
వాళ్ల అమ్మగారు. కానీ, రజిత మనస్సు
మాత్రం ఆ పిచ్చిదాని చుట్టూ తిరుగుతోంది.
పాపం ఇరవై సంవత్సరాలు ఉంటాయేమో!
ఎక్కడి నుండి వచ్చిందో ఏమో! జుట్టు
విరబోసుకొని బట్టలు సరిగా లేకుండా
తిరుగుతోంది. దానికదే గొణుక్కుంటుంది.
దగ్గరికి వచ్చిన వాళ్లను రాళ్లతో కొడుతుంది.
పైగా గర్భవతి, ఆ పిచ్చిదానికి ఎవడు
పుణ్యం కట్టుకున్నాడో పాపం దాన్ని చూస్తే
జాలేస్తుంది. ఇంటి దగ్గర పాడుబడ్డ గోడల
మధ్య ఉంటోంది. తనకు పదిహేను రోజుల
క్రితం కనబడింది. తను రోజు దానికి అన్నం
పెట్టి వచ్చేసి తనను చూడగానే ఏమీ
అనకుండా వెకిలి నవ్వు నవ్వేది. పెట్టిన
అన్నం తినేది! తను హాస్పిటల్ నుంచి
నిన్ననే వచ్చింది. ‘అమ్మా, చుట్టు పక్కల
వాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదా’ అంది.
ఇంతలో సుధీర్ వచ్చాడు. ‘రజితా ఈ పండ్లు
తీసుకో’ అంటూ ‘ఆ పిచ్చిది అక్కడే ఉంది
రజితా. చాలా మూల్గుతోంది పాపం’ అంటూ
లోపలికి వెళ్లాడు. రజిత చాలా బాధపడింది.
‘రేపు ఎలాగైనా దాన్ని హాస్పిటల్లో చేర్చాలి’
అంది రజిత బాధపడుతూ. రాత్రంతా వర్షం
పడుతోంది. ఉరుములు, మెరుపులతో వాన
పడుతోంది. కాని రజిత మాత్రం ఎప్పుడు
తెల్లవారుతుందా.. దాన్ని హాస్పిటల్లో
చేర్పిద్దాం అంటూ మేల్కొనే వుంది.
తెల్లవారింది. రజిత మెల్లగా తలుపు
తీసుకొని బయటకు వచ్చింది. ‘ఏమండి
ఓసారి ఇలా రండి’ అంటూ సుధీర్ను
గాభరాగా పిలిచింది. ‘ఏమైంది రజితా’
అంటూ సుధీర్ నిద్రమత్తులో పరిగెత్తుకొని
వచ్చాడు. ‘అటు చూడండి. ఆ పిచ్చిది ఉన్న
ఇంటి ముందు గోల వినబడుతోంది’ అంది.
ఇంతలో పనిమనిషి రంగమ్మ వచ్చింది.
‘అమ్మా ఆ పిచ్చిది రాత్రంతా వానలో
తడుస్తూ ఉందమ్మా. ఎప్పుడు కనిందో
ఏమోనమ్మా బాబు పుట్టినట్టున్నాడు. ఆ
పిచ్చిది మాత్రం తెలివి లేకుండా పడి
ఉందమ్మా.. అందరూ చూస్తున్నారు కానీ
ఎవ్వరు ఆ బాబుని తీసుకోవడం లేదమ్మా.
ఒంటిమీద బట్టల్లేకుండా పడి ఉంది. రెండు
చీరలియ్యండమ్మా నేను కప్పి వస్తాను’
అంటున్న పని మనిషితో ‘నేనూ వస్తాను
పద’ అంటూ లోపలి నుండి రెండు చీరలు
తీసుకొని వచ్చింది.
ఇంతలో పనిమనిషి ‘పదండమ్మా’ అంటూ
రజిత చేయి పట్టుకుంది. ‘్ఫరవాలేదులే
నేను నడవగలను’ అంటూ సుధీర్
వారిస్తున్నా వినకుండా నడిచింది.
పనిమనిషి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు వెనక్కి
తిరిగి చెవిలో ఏదో చెప్పింది. తిరిగి రజిత
లోపలికి వెళ్లి చేతిలో ఏదో సామానుతో
బయటకు వచ్చి పద అంటూ వెళ్లారు.
అందరూ ఇండ్లలో నుండి చూస్తున్నారు.
సన్నగా చినుకులు పడుతున్నాయి!
ఎవ్వరూ బయటకు రాలేదు. ఇంతలో గాలి
బాగా వీచింది! అక్కడ ఈ మధ్యనే గాంధీ
గారి విగ్రహం పెట్టారు. అది నాలుగు దిక్కుల
రహదారి. గాంధీగారి విగ్రహం ఇంకా
ప్రారంభం చేయలేదు. దానిపై వేసిన
ముసుగు గాలికి లేచి అది నేరుగా ఆ
పిచ్చిదానిపై పడింది. దూరం నుండి
చూస్తున్న రజిత ‘మహాత్మా-చూశావా! ఇదీ
మన దేశంలో ఉన్న స్ర్తి పరిస్థితి. నీవు
చూడలేక దానిపై బట్ట కప్పావా మహాత్మా’
అంటూ తొందరగా అక్కడికి చేరుకొని తాను
తెచ్చిన సామానుతో ఆ బాబును తల్లి నుండి
వేరు చేసింది. చలికి వణుకుతూ బాబు
గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. తాను తెచ్చిన
బట్టలతో బాబుని చుట్టి ఆ పిచ్చిదాని వంక
చూసింది. చలనం లేకుండా రక్తం
మడుగులో పడిఉంది. పిచ్చిదాని ప్రాణం
ఎప్పుడో పోయినట్టుంది. నొప్పులతో అవస్థపడి
ఆ బాబుని భూమిపై పడేసి చనిపోయింది!
ఇంతలో ఇండ్లలోని వారు బయటకు వచ్చి
‘నీకెందుకమ్మా లేనిపోని తలనొప్పి. బాబుని
అక్కడ పడుకోబెట్టు’ అనసాగారు. రజిత
వారివంక కోపంగా చూస్తూ ‘మీరు
మనుషులేనా! మీకు మానవత్వం ఉందా!
పసిగుడ్డు చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటే
వదిలేయాలంటారా? ఛీ! ఏం మనుషులు’
అంటూ ఆ బాబుని హృదయానికి
హత్తుకుంది. సుధీర్ ఎప్పుడు వచ్చాడో,
చూస్తూ నిలబడ్డాడు. ‘చూశారా, పాపం
పిచ్చిది ఈ బాబుని కని ఈ లోకం వదిలి
వెళ్లిపోయింది’ అంటూ వెక్కి వెక్కి
ఏడవసాగింది రజిత! ‘పద రజితా.. నేను
నిన్ను ఇంటి దగ్గర దింపి మళ్లీ వస్తాను. ఈ
పిచ్చిదానికి దహన సంస్కారానికి ఏర్పాట్లు
చేయిస్తాను’ అని చెప్పిన సుధీర్
పనిమనిషితో ‘రంగమ్మా, నేను వచ్చేదాక
ఇక్కడే ఉండు.. అమ్మగారిని బాబుని ఇంటి
దగ్గర దింపి వస్తాను’ అని గొడుగు తెరిచి
దానికిందికి రజితను, బాబుని
తీసుకున్నాడు. సరే అయ్యగారు అంటూ
రంగమ్మ అక్కడే కూర్చుంది. బాబుని,
రజితను తీసుకొని సుధీర్ మెల్లిగా
నడవసాగాడు. రజిత భుజం చుట్టూ
చేయివేసి దగ్గరగా హత్తుకొని బాబుని
మురిపెంగా చూస్తూ ‘దేవుడిచ్చిన వరం
మనకు’ అంటూ ఆకాశం వంక చూశాడు!
అపుడే చినుకులు తగ్గుతున్నాయి.
ఆకాశంలో బాలభానుడు కొంచెంగా
బయటకు వస్తున్నాడు. లేలేత
సూర్యకిరణాలతో బాబు మొహం
వెలిగిపోతోంది! తన భార్య పెద్ద మనసుకు
జోహార్లు అర్పించాడు సుధీర్. ఆకాశంలో
వాన వెలియగానే ఇంద్రధనస్సు
సప్తవర్ణాలతో కనువిందు చేయసాగింది!