ఉత్తర తెలంగాణ
సృజనశీలురకే పురస్కారాలు దక్కాలి! (అంతరంగం)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వివిధ సంస్థలే కాక.. ప్రభుత్వం కూడా
సాహితీ పురస్కారాలను ప్రతిభావంతులను
పక్కన పెట్టి.. ఆశ్రీత జనులకే అందివ్వడం
జరుగుతోందని.. భజన పరులకు గాక..
సృజనకారులకు పురస్కారాలు దక్కాలని
ప్రముఖ కవి, సినీగేయ రచయిత, దర్శకులు
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అభిప్రాయపడ్డారు. తన
16వ యేటనే అంటే 1965లో రచనలు
ప్రారంభించారు. తాను పుట్టినట్టి సిరిసిల్ల
వాతావరణం.. మానేరు తీరం ఆయనలో
కవితా శ్వాసను నింపింది. 1968లోనే
‘స్రవంతి’ మాస పత్రికలో ఆయన మొదట
కవితాగేయం ప్రచురింపబడటం విశేషం!
తొలితరం కథా రచయిత గూడూరి సీతారాం
గారి స్ఫూర్తితో.. డాక్టర్ సి.నారాయణ రెడ్డి
గారి ప్రేరణతో పాటల వైపు, ఆయన
విద్యాగురువు అనంతరాజు శర్మగారి
ప్రోత్సాహంతో మాత్రా ఛందస్సుతో
పద్య-గేయ రచనలవైపు దృష్టి మళ్లించిన
ఆయన ఇంతవరకు 21 గ్రంథాలను వివిధ
ప్రక్రియల్లో ప్రకటించారు. మరో ఆరు గ్రంథాలు
ప్రచురణలో ఉన్నాయి. దాదాపు 60
సినిమాల వరకు 200 సినీగీతాలను రాశారు.
56 ఆడియో ఆల్బంలు వెలువరించారు. 50
టివి ధారావాహికలకు, 15 డాక్యుమెంటరీలకు
దర్శకత్వం వహించారు. రేడియో, టివి లలిత
సంగీతానికి వేయి వరకు లలిత గీతాలను
రాశారు.
‘ఆటా’, ‘తానా’లాంటి అమెరికా తెలుగు
సంస్థలకు అనేకసార్లు ‘స్వాగత గీత’ సంగీత
నృత్యరూపకాలు రచించి అంతర్జాతీయ
స్థాయి గుర్తింపును పొందారు. ఇటీవల
న్యూజెర్సీ (అమెరికా) ప్రభుత్వం లండన్
పార్లమెంటు కూడా కృష్ణగారి సేవలను
గుర్తించి సత్కరించింది. వృత్తిరీత్యా తపాల
శాఖలో ఉన్నతాధికారిగా రిటైరైన ఆయన
పుట్టిన మట్టిమీది మమకారంతో ‘కాంతి
జనితం మన కరీంనగరం - క్రాంతి భరితం
మన కరీంనగరం’ అనే గీతాన్ని రచించి
అందరి మన్ననలు పొందారు. 2005లో
‘ఎక్కడికెళ్తుందో మనసు? ప్రేమకే తెలుసు’
అనే చలన చిత్రానికి.. ప్రస్తుతం విడుదలకు
సిద్ధమైన ‘లావణ్య విత్ లవ్ లవ్ బాయ్స్’
అనే సినిమాకు రచనతో పాటు దర్శకత్వం
వహించారు. ప్రేక్షాభిరుచికై ‘ప్రేమ’ చుట్టే
కథలు అల్లినప్పటికీ కొసమెరుపు సందేశం
సంఘటితపరచడం ఆయన ప్రత్యేకత! పద్యం
కంటే పాటే ముందు పుట్టింది కాబట్టి మొదటి
నుండి పాటవైపే మొగ్గు చూపుతున్నట్లు
ప్రకటించిన ఆయనతో ‘మెరుపు’
ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు
ఆయన మాటల్లోనే..
ఆ వచన కవిత్వానికి ఉండాల్సిన
లక్షణాలను తెలుపుతారా?
వచన కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు
ప్రథమంగా అంతర్లయ, అర్థవంతమైన పద
ప్రయోగం! ప్రస్తుతం మినీ కవితలే ‘నానీల’
నామాంతరంగా వ్యాప్తి గాంచుతున్నాయి!
కానీ నానీలకైనా.. మినీ వచన కవితలకైనా
పద్యాల మాదిరిగా అక్షర నియతి అవసరం
లేదని నా అభిప్రాయం!
ఆ మీరు రచించిన లలిత గీతాల్లో మీకు
బాగా నచ్చిన గీతం?
రేడియో, టీవీల్లో నా లలిత గీతాలు
ప్రసారమైనాయి! నా లలిత గీతం
‘మనమంతా ఒక్కటనే మంచి మనసు
పెరగాలి’ పల్లవితో ఆకాశవాణి అన్ని కేంద్రాల
ద్వారా అన్ని భాషల్లో 1995 సెప్టెంబర్
నెలంతా ప్రసారమైంది. అదే గీతం నాకు
జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.
ఆ మీకు నచ్చిన కవి? గ్రంథం?
నాకు నచ్చిన కవి పోతన.. ఆధునికంగా
నచ్చిన గ్రంథాలు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’.. సినారె
‘విశ్వంభర’.
ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై
మీ అభిప్రాయం?
ఇప్పుడొస్తున్న వచన కవిత్వం చేయి తిరిగిన
వారి చేతుల్లో హాయిగా అర్థవంతంగా
నటిస్తూ అలరిస్తుంటే, కేవలం జిజ్ఞాసతో -
తమ కవితల్ని అచ్చులో పత్రికల్లో
చూసుకోవాలన్న ఆశతో రాస్తున్న వారి
చేతుల్లో ఉడికీ.. ఉడకని అన్నంలా తోస్తూ
పెదవి విరిచేలా వుంది!
ఆ మీరు పొందిన సాహితీ పురస్కారాలు?
చాలా సంస్థలు సాహితీ పురస్కారాలను
అందించాయి. వాటిలో వచన కవితలకు
సంబంధించి ‘హాలాహలం’ (కవితా సంపుటి)
దేవులపల్లి పురస్కారం వచ్చింది. ‘వడ్డేపల్లి
కవితకు’ సాహితీ గౌతమి (కరీంనగర్) సినారె
పురస్కారం వచ్చింది.
ఆ మీరు పాటలు, కవితలు, పద్యాలతో పాటు
‘పాట వెలదులు’ సృష్టించారు కదా!
మచ్చుకు ఒకటి చెబుతారా?
నా స్వీయ ప్రతిభతో ‘పాట వెలదులు’ అనే
నవీన పద్యాలను సృష్టించాను - మచ్చుకు..
లేచు - ‘పల్లెలందు వీచు పైరగాలి/పట్నం
మందు లేచు పాడుగాలి/ప్రియముగాను
మనిషి పీల్చుగాలి/ కలుషితమ్ము ఆమె
కర్మగాలి!’
ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి
రావాలంటే ఏం చేయాలి?
బావిలో పడ్డ బొక్కెనను ‘పాతాళ గరిగె’తో
పైకి తీసినట్లు సాహితీ వ్రతులంతా మరుగున
పడ్డ తెలంగాణ సాహిత్యాన్ని పైకి తీయాలి.
వీలైనంత వరకు విజ్ఞుల ద్వారా విషయాల్ని
సేకరించాలి. ప్రామాణికంగా ప్రచురించాలి.
ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
ప్రతిభ ఉన్న వారిని ప్రక్కన పెట్టి -
ఆశ్రీతజనులకే పురస్కారాలు అందించే
పద్ధతికి స్వస్తి పలకాలి. ‘ఇజాల’తో
‘గ్రూపు’లలో భుజాలు కలిపి తిరిగే వారికే
భుక్తిని ముక్తిని ప్రసాదించే ప్రహసనం
అణగారాలి! భజనపరులకు గాక
సృజనకారులకు పురస్కారాలు దక్కాలి.
అలా దక్కాలంటే.. ఒకే వర్గానికి
సంబంధించిన వారిని గాక సమ్యక్ దృష్టిగల
నిపుణుల్ని న్యాయనిర్ణేతల్ని నియమించాలి.
ఆ కొత్త కవులు రచయితకు శిక్షణ
అవసరమా?
ఔను అవసరమే! అత్యవసరం కూడా! భాష
పట్ల అవగాహన కలిగించాలి. శిక్షణా
శిబిరాలు ఏర్పాటు చేయాలి.
ఆ కొత్త కవులు రచయితలకు మీరిచ్చే
సలహాలు? సూచనలు?
అధ్యయనం చేయాలి.. భాషాపరిజ్ఞానాన్ని
పొందాలి. వ్యాకరణాన్ని- ఛందస్సుల్ని వద్దని
శ్రీశ్రీ చెప్పాడని.. విస్మరిస్తే.. పునాది లేని
భవనంలా అచిరకాలంలోనే కుప్పకూలడం
ఖాయం.. కనుక పూర్వ కవులు, రచయితల
రచనలు బాగా చదవాలి. మెళకువలు
తెలుసుకోవాలి.
వడ్డేపల్లి కృష్ణ
1-5-62/3, చైతన్యపురి,
హైదరాబాద్ - 60
సెల్ నెం: 9246541699