దక్షిన తెలంగాణ

పురుషాధిక్యం నశించాలంటే.. మనోభావాల్లో మార్పు రావాలి! (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు పురుషాధిక్యం నుండి బయటపడాలంటే ముందుగా పురుషుల మనోభావాల్లో మార్పు రావాలని కాంక్షించే ప్రముఖ కవయిత్రి శ్రీమతి భండారు విజయ వరంగల్లుకు చెందినవారు. రచయిత్రిగా, కవయిత్రిగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా, సామాజిక కార్యకర్తగా పరిచయం వున్న ఆమె వృత్తిరీత్యా గ్రంథాలయ అధికారి. 1984లో ‘దీపిక’ గ్రంథాన్ని వెలువరించిన ఆమె 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత 2016లో రెండో కవితా సంపుటిని ‘తడి ఆరని దుఃఖం’ పేరుతో ప్రకటించారు. ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్త కార్యదర్శిగా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణకు కార్యదర్శిగా ‘ఉద్యోగ క్రాంతి’ పత్రికకు సంపాదకీయ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. రుద్రమ ప్రచురణలు వరంగల్ సంపాదకవర్గ సభ్యురాలిగా ఉన్న ఆమెతో మెరుపు ముచ్చటించింది. ముఖా ముఖి వివరాలు ఆమె మాటల్లోనే..

ఆ మీ మొట్టమొదటి రచన ఎప్పుడు చేశారు?
మా నాన్నగారు శివభక్తులు.. ఆయన శివపదులు, కీర్తనలు పాడుతూ ఉండేవారు! ప్రతి రోజు వాటిని వింటూ పెరగటం వలన ఒక రోజు నేను శివుడి మీద ఒక పద్యం రాసి మా నాన్నకు వినిపించాను. అది విని మానాన్న చాలా సంతోషపడి ప్రోత్సహించారు. అలా 9 సంవత్సరాల వయసులోనే నా రచనా ప్రస్థానం మొదలైంది!

ఆ రచనా వ్యాసంగం వైపు మీరు దృష్టి సారించడానికి
మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు?
మా తల్లిదండ్రులు భండారు ప్రసాదరావు గారు, వరలక్ష్మిగారు. ఆ తర్వాత మా కజిన్ సిస్టర్ ప్రేరణ బాగా లభించింది.

ఆ మీ దృష్టిలో వచన కవిత్వం అంటే ఏమిటి?
వచనం అంటేనే సరళం అని కదా అర్థం! వచన కవిత్వం ఎప్పుడు సాగే నదిలా స్వచ్ఛంగా ప్రవహించాలి. చదివిన వెంటనే అర్థమై హృదయాన్ని స్పందింపజేయగలగాలి. గాఢంగా హత్తుకునే పదలాలిత్యం కలిగి ఉండాలి.

ఆ ఇప్పుడు వస్తున్న వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
ఇప్పుడు చాలామంది కవిత్వం రాస్తున్నారు. చెప్పాల్సిన భావాన్ని వ్యక్తీకరించటంలో కొన్ని మెలకువలు పాటిస్తున్నప్పటికీ ఎక్కువ ఉపమానాలను ఉపయోగిస్తున్నారు. ఉపమానాలు ఎక్కువైనప్పుడు భావ స్పష్టత లోపిస్తోంది. చెప్పదలచుకున్న విషయం మరుగున పడి చదువరులు తికమకకు లోనుకావలసి వస్తోంది. భాషమీద కన్నా వస్తువు మీద ఎక్కువ పెట్టడం జరుగుతోంది.

ఆ ప్రతిఘటించే ధిక్కార స్వరం మీ కవిత్వానికి ఆభరణమవ్వటానికి కారణం?
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రశ్నించే తత్వం అలవడింది. నాకు ఇద్దరు అన్నలు.. ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. అందరి మధ్య ఒక్క ఆడపిల్లను కావడం వల్ల..నాన్నగారి గారాబం కొంచెం వుండేది. నా కన్నా ఇద్దరు పెద్దక్కయ్యలున్నప్పటికీ వారు వివాహమై అత్తారింటికి వెళ్లారు. నా కన్నా చిన్నగా వున్న ముగ్గురు తమ్ముళ్లపై ధిక్కారం కన్నా పెత్తందారీతనం ఎక్కువగా ఉండేది. బహుశా నాలో అప్పటి నుండే ఇష్టం లేని, అనుకూలంగా లేని విషయాల్లో ప్రతిఘటించే తత్వం ధిక్కారమై రూపుదిద్దుకొని నాకొక ఆభరణం అయిపోయిందని అనుకుంటాను.

ఆ మహిళలు పురుషాధిక్యం నుండి బయటపడాలంటే ఇంకా
ఎలాంటి రచనలు కావాలి?
పురుషాధిక్యం నశించాలంటే ముందుగా పురుషుల మనోభావాల్లో మార్పు రావాలి. ఆ మార్పుకోసం గత కొన్ని దశాబ్దాలుగా ఎందరో రచయితలు, కవయిత్రులు తమ రచనలు చేస్తున్నారు. పురుషాధిపత్యంపై తమ ధిక్కారస్వరాన్ని ఇప్పటికీ ఎలుగెత్తుతూనే ఉన్నారు. స్ర్తిలను తమతో సమానంగా గౌరవించగలిగిన మానసిక మార్పును పురుషులు అంగీకరించలేని స్థితి ఇప్పటికీ ఉంది. అలా వాళ్లను వారు సంస్కరించుకునే వీలుగా జండర్ సెన్సివిటి మీద రచనలు ఇంకా రావల్సివుంది.

ఆ పురుషులను ద్వేషించడం ద్వారానే
స్ర్తివాద కవిత్వం ఆవిర్భవిస్తుందని
భావిస్తున్నారా?
పురుషుల పెత్తనం వద్దంటున్నామంటే ఇక్కడ స్ర్తిల పెత్తనం కావాలని కాదు. స్ర్తిలు పురుషులతో పాటు సమానమనే సన్నిహిత స్పృహగా మాత్రమే అర్థం చేసుకొని పురుషులు సమన్వయం పాటించాలని కోరుకుంటున్నాం.

ఆ ఏకత్వంలోని అద్వితీయమే అని భావించే మీరు దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ప్రేమ అజరామరంగా ఉండాలంటే మీరిచ్చే సలహా?
ఏకత్వంలో అద్వితీయం సాధించాలంటే ముందు స్ర్తి పురుషుల మధ్య సమానత్వం ఉండాలి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో సహృదయత ఉండాలి. ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉండాలి. వీటన్నింటినీ మించి.. ఇద్దరి మధ్యలో అపహాస్యం, అబద్ధం, అవహేళన ఉండరాదు! ఇద్దరు ఒకరికొకరు తమ వ్యక్తిత్వాలను గౌరవించుకుంటూ, పొరపాట్లను సరిచేసుకుంటూ పోతే దంపతుల మధ్య ప్రేమికుల మధ్య ప్రేమ అజరామరంగా ఉంటుంది.

ఆ మీకు బాగా నచ్చిన కవి? కవయిత్రి?
నాకు బాగా నచ్చిన కవి మహాకవి కాళిదాసు. తక్కువ ఉపమానాలతో ఆచితూచి కవిత్వీకరించటం ఆయన గొప్పతనం. అలాగే ‘ఖలిజ్ జిబ్రాన్’ కవిత్వాన్ని కూడా చాలా ఇష్టపడతాను. ఇప్పటి కవయిత్రులలో మందరపు హైమవతి గారి కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం.

ఆ మీకు బాగా నచ్చిన గ్రంథం?
చలం మైదానం నుంచి..రంగనాయకమ్మ గారి జానకి విముక్తి, వాసిరెడ్డి సీతాదేవీ మరీచిక నుండి ఓల్గా గారి సహజ వరకూ..గ్రంథాలన్నీ నాకిష్టమైనవే!

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
తెలంగాణ భాష, యాస ఒకప్పుడు వివక్షకు గురికాబడింది. సాహిత్యంలోను, సాంస్కృతిక పరంగాను కూడా అనేక రూపాలలో అపహాస్యం చేయబడింది. అట్టడుగు వర్గాల వౌఖిక సాహిత్యం తెలంగాణ ప్రాంతంలో తవ్విన కొద్దీ దొరుకుతుంది. దానిని ఆయా ప్రాంత రచయితలు వెలుగులోకి తీసుకరావాల్సి ఉంది.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
ఇప్పుడొస్తున్న కవులు, రచయితలకు వస్తులోపం లేదు.. శ్రీశ్రీ గారన్నట్లు.. అగ్గిపుల్లే కాదు గుండుసూది, ఆవగింజ కూడా కవితా వస్తువు, కథా వస్తువు అయిపోయిందిప్పుడు.. అనేక వాదాలు ముందుకొస్తున్నాయి! ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా రచనల్లో సంయమనం పాటించాలి!

భండారు విజయ
హెచ్‌ఇడి, బ్లాకు-1,
ఫ్లాట్-10, బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్-500044.
సెల్.నం.8801910908

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544