దక్షిన తెలంగాణ

అవ్వకు కోపమొస్తే! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏరా మల్లయ్య యాడికి పోతున్నావ్? సంఘం కాడా పంచాయితి పెట్టినారు నీకు తెల్వదా!’ అంటూ రామయ్య అన్నాడు.
‘నాకు తెలుసులే బాయికాడ గోజలకు కుడిదోసి, మేత పెట్టి వస్తా. వచ్చేదాకా నా కొడుకుని కూసోమన్న. జర చూడరా వాన్ని. జల్దివస్తా’ అంటూ మల్లయ్య పరుగులంకించాడు.
రామయ్య అడుగు వేగం పెంచి సంఘం కాడికి చేరాడు. సంఘం నిండా జనం పోగయినారు. కుల పెద్దలు చెన్నయ్య, వీరయ్యలు గద్దెమీద కూసున్నారు. అందరు కిందకూసున్నారు. ఎన్నడు ఏ తప్పు ఎరుగని ఎల్లమ్మ దోషిలా నిల్చుంది. ఎల్లమ్మ కొడుకు రామ్మోహన్ భార్య విజయ వంక చూస్తు ఆమె కనుసన్నలలో మెదలసాగాడు.
‘చెప్పవయ్య రామ్మోహన్! నీవు మనోళ్లలో బాగా చదివి పట్నంలో ఉద్యోగం చేస్తున్నావు. ఇయాల అందరిని కూర్చోబెట్టావు కులమంతను. ఏంటి నీ బాధ’ అన్నాడు కుల పెద్ద చెన్నయ్య.
‘ఏం లేదయ్య కుల పెద్దగారు, ఏం చెప్పమంటారు గోస? అంత ఇంతా గాదు. గత నెలలో అయ్య కాలం చేశాడు. మీరందరు అవ్వను నాతో పంపారు. అవ్వను తీసుకెళ్లి తొమ్మిది రోజులైంది. రోజు ఏదో గొడవతో నవరాత్రులు జాగారం చేయించింది. మూలన కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అవ్వ ఏమైంది అంటే చెప్పదు. వూరికి వద్దామా అంటే రాదు. వృద్ధాశ్రమంలో వుండుమంటే వుండదు. మేం ఏం తిన్నా ఓరువట్లేదు. పిచ్చిదానిలా పిచ్చి పిచ్చి చేస్తుంది. అరుస్తుంది. నా పరువు తీస్తుంది. నాకు మా అవ్వ వద్దు ఎంత డబ్బైనా ఇస్తాను. ఊర్లో ఇంట్లోనే సేవలు చేయించండి. అవ్వ చచ్చాక కాల్చండి. దిన వారాలకు డబ్బు పంపుతాను’ అన్నాడు రామ్మోహన్.
కుల జనులంతా ముక్కున వేలేసుకున్నారు. అందరు ఎల్లమ్మను చూస్తూ కంటనీరు పెట్టుకున్నారు. ఎన్నడు ఎవ్వరి సాయం అడగకుండా, మంచి పేరుకు ఎల్లమ్మగా చెబుతుండే జనమంతా ఎల్లమ్మ వంక దీనంగా చూస్తున్నారు. ఎల్లమ్మను మేము సాదుతాం అనబోయిన నోళ్లన్నీ ఎల్లమ్మ కంట నీరుకి పెగలలేక పోయాయి. చదువుకున్న రామ్మోహన్ కంటే సన్నాసులైన నా బిడ్డలు నయం అన్న మాటలు వినబడసాగాయి. విజయ తాను కాసిన్ని చల్లటి నీళ్లు తాగి బాటిల్ రామ్మోహన్‌కు అందించి తలవెంట్రుకలను నిమురుకొని, విప్పుకుని అల్లుకోసాగింది.
కుల పెద్దలు చెన్నయ్య, వీరయ్యలు నెమ్మదిగా ‘ఎల్లమ్మా.. నీవు ఎన్నో కష్టాలకోర్చి బిడ్డను సాకి చదివించావు. నీకీ దుస్థితి చూడలేక పోతున్నాము. నీవే వౌనము వీడి, నీ సమాధానమే పరిష్కారం కావాలి’ అన్నారు.
ఎల్లమ్మ బరువైన తలను పైకెత్తింది. పంచాయితీ పెద్దల తీర్పుకు కట్టుబడుతానంది. ‘చూశారా, చూశారా నేను ఎన్నో చెప్పాను. అవ్వ అలా చేసింది. ఇలా చేసింది అని, నల్లిలా ఎలా నటిస్తుందో చూడండి’ అన్నాడు రామ్మోహన్.
అక్కడ వున్నవారి నరాలన్ని రామ్మోహన్ మాటలకు బిగుసుకు పోయినవి. ఎల్లమ్మ కడుపులో పేగులన్నీ తాండవమాయి. ఒక్కసారిగా ఎల్లమ్మ రామ్మోహన్ దగ్గరికి వచ్చింది. ‘ఔనురా మోహనా! నీవన్నవి నిజాలే. తొమ్మిది రోజులు నీవు నవరాత్రి జాగారాలు చేశావు. మరి తొమ్మిది మాసాలు నిన్ను ఎలా మోసానురా’ అంటూ ఎడమ చెంప ఛెళ్లుమనిపించింది. జనమంతా చప్పట్లు కొడుతూ లేచారు.
‘రాత్రనక, పగలనకా కాయకష్టం చేసి నిన్ను పట్నంలో హాస్టల్‌లో వుంచి చదివిస్తే నన్ను అనాధ వృద్ధాశ్రమంలో వేస్తావా?’ అంటూ కుడి చెంప ఛెళ్లు మనిపించింది. ‘నేను చచ్చినా నీవు రావా, మరి నిన్ను నేను పుట్టించకపోతే...’ అంటూ ఎడమ చెంప, ‘నేను బ్రతకడానికి డబ్బులు ఇస్తావా, ఐతే నేను నీకు చేసిన చాకిరికి వెలకట్టివ్వు’ అంటూ చెంపలు వాయంచసాగింది ఎల్లమ్మ.
ఎల్లమ్మ ఒక అపర కాళికలా కన్పించింది. మూగ దేవతలాగా వౌనంగా దిక్కులు చూస్తు కూలబడ్డది. రామ్మోహన్ అలాగే కూలబడి అమ్మ పాదాలకు కన్నీళ్ల అభిషేకం చేశాడు. కుల పెద్దలు, జనులంతా ఎల్లమ్మకు నమస్కరించి వెళ్లిపోయారు. రామ్మోహన్ ఎల్లమ్మను పట్నం తీసుకెళ్లి వారం వారం భార్యపిల్లలతో ఊరికి అవ్వను తీసుకొచ్చి ఆదర్శంగా నిలువసాగాడు.

- ఉండ్రాల రాజేశం సిద్ధిపేట, సెల్.నం.9966946084