విజయవాడ
అపచారం (కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సమయం తెల్లవారుజాము 5 గంటలు
అవుతోంది. అలారం మోత వినిపించింది.
గబాలున లేచి అలారం ఆఫ్ చేసి మళ్లీ
పడుకున్నాను. మళ్లీ రెండు గంటల
తరువాత ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి ‘హలో!
ఎవరూ?’ అని అడిగాను. ‘నేను గోపాల్రావు
మావయ్యనురా! మనవడి పెళ్లికార్డు
ఇద్దామని మీ ఊరు వచ్చాను. మీరు
ఎవరూ లేరు. ఇంటికి తాళాలు వేసి
ఉన్నాయి. కార్డు ఇంటిపక్క వాళ్లకి ఇచ్చి
వచ్చేశాను. మీరంతా తప్పకుండా రావాలి
మరి’ చెప్పుకుపోయాడు ఆయన. ‘సరే
మావయ్యా! తప్పకుండా వస్తాము’ అని
చెప్పి ఫోన్ పెట్టేశాను.
పెళ్లికి వెళదామని రెండ్రోజులు లీవుకు అప్లై
చేశాను. సూపర్వైజర్ ఒప్పుకోలేదు. కనీసం
ఒకరోజు అయినా ఇవ్వమని అడిగాను.
‘అర్జంట్ వర్క్ వుంది. సాధ్యం కాదు’ అని
తేల్చి చెప్పాడాయన. చాలా బాధనిపించింది.
ఏంచేయాలో అర్థం కాలేదు.
ఒకరోజు డ్యూటీ దిగి ఇంటికి వచ్చాను.
మధ్యాహ్నం 3గంటల సమయం కావస్తోంది.
ఫోన్లో మిస్డ్కాల్స్ ఉన్నాయి. ‘ఎవరా?’..
అనుకుంటూ ఫోన్ చేశాను. ‘బావా! నేను
గోపాల్రావు గారి అబ్బాయిని’ అన్నాడు.
‘ఏంటి బావా? ఉదయం ఫోన్ చేశావా?’ అని
అడిగాను. ‘అవును బావా! ఒక విషాద వార్త.
నాన్నగారు నిన్న రాత్రి అకస్మాత్తుగా
చనిపోయారు. మీకు ఫోన్ చేశాము. ఎవరూ
ఎత్తలేదు. ఈరోజు మధ్యాహ్నమే
అంత్యక్రియలు జరిపించాము’ అని చెప్పాడు.
ఆ మాట వినగానే షాకయ్యాను. ఎక్కడలేని
నీరసమంతా శరీరాన్ని ఆవహించింది.
చెమటతో ఒళ్లంతా తడిచిపోయింది.
కాసేపటికి తేరుకున్నాను. ‘ఇంత సడెన్లీ
ఎలా జరిగింది?’ అని అడిగాను. ‘సైకిల్ మీద
బజారుకు వెళుతూ కళ్లు తిరిగి రోడ్డుపై
పడిపోయాడట. తలకి తీవ్రమైన గాయం
కావటంతో వాంతులయ్యాయి. తరువాత
హాస్పటల్లో చేర్చాము. కోమాలోకి
వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే చనిపోయాడు’
అని వివరించాడు. మనవడి పెళ్లికి అందరూ
తప్పకుండా రావాలని ఆయన నాతో
మాట్లాడిన చివరి మాటలు పదేపదే నా
చెవిలో మార్మోగుతున్నాయి. నేను ఆరోజు
డ్యూటీలో ఉండటంతో ఆఖరి చూపుకి వెళ్లే
అవకాశం కూడా లేకపోయింది.
తరువాత మూడ్రోజులకు దినం చేస్తున్నట్లు
కబురొచ్చింది. దూర ప్రయాణం కావటంతో
ఆరోజు ఉదయం 5 గంటలకే ఇంటి నుంచి
బయలుదేరాను. 9 గంటల కల్లా మావయ్య
ఊరు చేరుకున్నాను. ఇంటికి చేరే రోడ్డు
మలుపులో ఆయన జ్ఞాపకాలు
నెమరువేసుకుంటూ ముందుకు సాగాను.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
ప్రార్థించాను. కుటుంబ సభ్యులు అందరి
పేర్లతో మామయ్య ఫొటోతో ఫ్లెక్సీ
తయారుచేయించి పూలమాలలతో
అలంకరించి పెట్టారు.
ఇంట్లోకి వెళ్లి అత్తయ్యను పలకరించాను.
ఆమె నన్ను చూడగానే బావురుమంది.
ఆమెను చూడగానే నాకు దుఃఖం ఆగలేదు.
కాసేపటికి బంధువులంతా వచ్చారు.
అందరూ మిఠాయి ప్యాకెట్లు తెచ్చి ఆమె
చేతిలో పెడుతున్నారు. నన్ను అడిగారు
‘నువ్వు స్వీట్ ఇచ్చావా?’ అని. నేను ఏమీ
మాట్లాడలేదు. ‘ఆమె స్వీటు తినే పరిస్థితిలో
ఉందా ఇప్పుడు? ఏంటో ఈ ఆచారాలు?’
అనుకున్నాను మనసులోనే.
అత్తయ్యను పందిట్లో కూర్చోబెట్టారు. ముఖం
నిండా పసుపు రాసి బొట్టు పెట్టారు.
అందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చి
చూసి వెళుతున్నారు. కొందరైతే ‘మాకు
ఇంటికి వచ్చి చెప్పొద్దా.. ముఖం
చూడటానికి రమ్మని’ అని పోట్లాడి మరీ
వెళుతున్నారు. అత్తయ్య రోదిస్తోంది.
మహిళలంతా తమ తాళిబొట్టుకు పసుపు
కొమ్ము కట్టుకొని ఆమె ముఖం చూసి
వెళుతున్నారు. అత్తయ్య ఏకధాటిగా
ఏడుస్తూనే ఉంది. ఆ రోదనలో అవమాన
భారం మారుమోగుతోంది. కానీ అక్కడున్న
వారికి అదేమీ వినిపించటం లేదు. ఏదో ఒక
సంప్రదాయం, ఆచారం గానే కనిపిస్తోంది.
ఒకప్పుడు సతీ సహగమనం దురాచారం
అమలులో ఉండేది. అప్పుడు భర్త చనిపోతే
భార్యను కూడా నిలువునా మంటల్లో తోసి
చంపేసేవారు. అది అప్పటి ఆచారం. కానీ
ఇప్పుడు మనిషిని శారీరకంగా బతకనిచ్చినా
మానసికంగా ఇలా చంపేస్తున్నారని
అనిపిస్తోంది. తోటి మనిషి కష్టంలో
ఉన్నప్పుడు ‘మేమున్నాము. నువ్వే
దిగులుపడకు. నీకు మరెలాంటి కష్టం
రాకుండా మేము ఆదుకుంటాము’ అని
ఓదార్చి, మానసిక ధైర్యాన్నిచ్చి బతుకు
మీద ఆశ కలిగేలా అండగా నిలవాలే కాని,
ఆచారాల ముసుగు వేసి
అవమానించకూడదు కదా!’ అనిపించింది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు
రకరకాలుగా అమలులో ఉన్నాయి.
మనందరం ఏది ఆచరిస్తామో అది తోటి
మనిషిని ఆదుకునేలా ఉండి అండదండగా
నిలవాలి. సాంఘికంగా గౌరవప్రదంగా
ఉండాలి. మానవతా విలువలను కాపాడే
ఆచారాలను అవలంబిద్దాం. దురాచారాలను
రూపుమాపుదాం’ అని గట్టిగా అరిచి
చెప్పాలనిపించింది. కానీ ఆ శవయాత్రలో,
ఘోషలో నా మనసు మాట వినేదెవరు?!