జాతీయ వార్తలు

ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పరిపాలనా విధానంలో విప్లవాత్మకమైన మార్పుగా భావించే ‘ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు’ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సేవల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, మేరేజ్ రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్‌లు వంటి సేవలు ఇక ఇంటివద్దే లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద 30 కంటే ఎక్కువ సేవలు అందిస్తామని, వచ్చే నెలనుంచి వీటి సంఖ్యను వందకు పెంచుతామని, తర్వాత రెండు మూడు నెలల్లో రెండు వందలు, మూడు వందలు ఇలా పెంచుకుని పోతామని ఆయన చెప్పారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసే 1076 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌కు ప్రజలు ఫోన్ చేసి తమ ఇంటివద్దకు ఏ సేవ కావాలో తెలియజేయాలని కోరారు.
అంతేకాకుండా ఈ సేవలు అందాయో లేదో పర్యవేక్షించడానికి ఈ కాల్‌సెంటర్ 24 గంటలూ పనిచేస్తుందని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ప్రజల ముంగిటకు సేవలందించే పథకంలో ఢిల్లీ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కులధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, నీటి కనెక్షన్ ఇలా ఎన్నో సేవలు ఢిల్లీవాసుల వద్దకే వస్తాయని, వారు వాటికోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఈ సేవల నిమిత్తం అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తారని చెప్పారు. ఇది పరిపాలనా విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు గంటలు గంటలు వీటి కోసం లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. దీనివల్ల ప్రజల సమయం ఎంతో ఆదా అవుతుందని, దళారులకు ఎలాంటి సొమ్ములు లంచంగా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం కేజ్రీవాల్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ పథకంలోని లోటుపాట్లు, ఇబ్బందులు మీడియా తమకు తెలియజేస్తే వచ్చే 10-15 రోజుల్లో వాటిని సరిచేసుకుంటామని అన్నారు. ఈ పథకం కింద తమ ప్రభుత్వం 12 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. అలాగే ప్రజల వద్దకే రేషన్‌ను సరఫరా చేసే పథకం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని ఆయన చెప్పారు. దీనిపై తమకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులను త్వరలోనే అధిగమించి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల ముంగిటకే సేవలు పథకం అమలు బాధ్యతను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించినట్టు ఆయన చెప్పారు. ఇలావుండగా ఈ పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లోనే ప్రవేశపెట్టాలని చూసినా, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాజ్ దానిని నిలుపుదల చేశారు.

చిత్రం..‘ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు’ ప్రారంభ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్