రాష్ట్రీయం

అభివృద్ధి కోసం.. ప్రాణత్యాగానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జనవరి 21: అభివృద్ధి విషయంలో జిల్లాకు, తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చనందుకు నిరసనగా మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతిచ్చి అన్ని స్థానాలను గెలిపించిన
పశ్చిమ గోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని మెడలు వంచి నిరవధిక నిరాహారదీక్ష ద్వారా ప్రజల మద్దతుతో హామీలు సాధించుకుంటామన్నారు. హామీల అమలు కోసం పొట్టిశ్రీరాములు స్ఫూర్తితో ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. విమానాశ్రయ భూముల్లో నిర్వాసితులకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు గెలిపించారని, ఈ జిల్లాకు ఎంతో రుణపడి ఉన్నానని ఏకార్యక్రమాన్నైనా ఇక్కడి నుంచి ప్రారంభిస్తానని చెప్పిన చంద్రబాబు 4 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, హామీలు అమలు చేయలేదన్నారు. సుదూర సముద్ర తీరం ఉన్న జిల్లాకు కనీసం ఒక్క షిప్పింగ్ హార్బర్‌కానీ, ఆక్వాపార్కుకానీ, విశ్వవిద్యాలయంగానీ, యువత ఉపాధికి తోడ్పడే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయారన్నారు.
చంద్రబాబు పాలన దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వంగా మారిందని కార్యాక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు దోచుకు తింటున్నారన్నారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా రాష్ట్రానికి ఏమీ ఇవ్వడంలేదని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.రవీంద్రరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ, పోతుల అన్నవరం, యెగ్గిన నాగబాబు, గమిని సుబ్బారావు, నరిశే సోమేశ్వరరావు, మహిళా మోర్చ నేతలు ముదునూరి రామసీత, ధనలక్ష్మి రెడ్డి, విజయలక్ష్మి, బీజేపీ నాయకులు అడపా రమేష్, వీర్ల గోవింద్, యడ్లపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెండ్ డాక్టర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యబృందం ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

చిత్రం..నిరవధిక దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు