పోలీస్ కస్టడీకి మోసగాడు
Published Monday, 12 December 2016హైదరాబాద్, డిసెంబర్ 11: ఎక్స్లెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆర్బిట్ సొల్యూషన్స్ సంస్థల పేరుతో మోసానికి పాల్పడి కోర్టుకు లొంగిపోయిన ఘరానా మోసగాడిని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే రెండు నెలల్లోనే 30 నుంచి 35 శాతం లాభాలు ఇస్తానంటూ రూ. 20 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. లాభాల పేరుతో భారీ మొత్తంలో అమాయక ప్రజలను మోసం చేసిన ఇతని నుంచి సిసిఎస్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇతని దగ్గర మోసపోయిన వారిలో ప్రవాస భారతీయులు కూడా ఉన్నారని డిసిపి అవినాష్ మహంతి ఆదివారం వెల్లడించారు.