వణికిస్తున్న వార్ధా
Published Monday, 12 December 2016నెల్లూరు, డిసెంబర్ 11: బంగాళాఖాతంలో ఈనెల 8న అల్పపీడనంగా ఏర్పడి చివరకు పెను తుఫాన్గా మారిన వార్ధా తుఫాన్ సోమవారం జిల్లాలోని శ్రీహరికోట, చెన్నై నగరాల మధ్య తీరం దాటనుందనే సమాచారం నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరం వెంబడి ఆదివారం రాత్రి నుంచే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గంటకు 50-60 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటోంది. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారుల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించి, వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.