కల్యాణ లక్ష్మి లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు
Published Sunday, 19 June 2016హైదరాబాద్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వమే పథకాల విధివిధానాలు రూపొందించాలని, వీటిని అధికారులు అమలు చేయాలని సూచించారు. రెండింట్లోనూ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమై పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదోళ్లంతా టిఆర్ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.