S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ శాఖకు రూ. 56 కోట్లు ఆదా

అమరావతి, ఏప్రిల్ 13: సంక్షోభ కాలంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ తెలిపింది. మార్చి నెలలో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలు చేసి 56కోట్ల రూపాయల మేర మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చిలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ సోమవారం సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖరరెడ్డి సోమవారం విలేఖరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు తగ్గడాన్ని గుర్తించి మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌ను కొనుగోలు చేశారు. మార్చిలో 357.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారు.

రాష్ట్రంలో 439 కరోనా కేసులు

విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 93, కడప జిల్లాలో 31, కృష్ణా జిల్లాలో 36, కర్నూలు జిల్లాలో 84, నెల్లూరు జిల్లాలో 56, ప్రకాశం జిల్లాలో 41, విశాఖ జిల్లాలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. వీరిలో 12మంది డిశ్చార్జి కాగా, ఏడుగురు మరణించారు. 420 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

విధుల్లో మంత్రులు బిజీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సోమవారం నుండి విధులకు హాజరౌతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా గత 21 రోజుల నుండి ఇంటి నుండి పని చేస్తున్న మంత్రులు సోమవారం ఉదయం పది గంటలకే తమ, తమ కార్యాలయాలకు చేరుకోవటం గమనార్హం. వీరితోపాటు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా తమ విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ రవాణా సౌకర్యం ఉన్న సంయుక్త కార్యదర్శి స్థాయి, అంతకు మించిన స్థాయి అధికారులంతా నుండి విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటం తెలిసిందే. మిగతా అధికారులు, మూడో తరగతి, నాలుగో తరగతి సిబ్బంది హాజరీని దశల వారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

రెడ్‌జోన్ ప్రాంతాల్లో హోమియో మాత్రలు

మచిలీపట్నం, ఏప్రిల్ 13: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు రెడ్‌జోన్ ప్రాంతాల్లో పెద్దఎత్తున కోవిడ్-19 (కరోనా) నివారణకు ముందస్తుగా హోమియో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని సీనియర్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ పి ఉషాకుమారి తెలిపారు.
సోమవారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన ఆమె స్థానిక రెడ్‌జోన్ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు హోమియో మాత్రలను బందరు ఆర్డీవో ఖాజావలీ, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణకు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి కోటి డోసుల హోమియో మాత్రలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా అందినట్టు తెలిపారు.

క్షుద్ర రాజకీయాలు మానుకో!

గుంటూరు, ఏప్రిల్ 13: పనీపాటా లేని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను అనుచితంగా విమర్శిస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దేవినేని క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుండి, ఆ నేతల నుండి నిర్మాణాత్మకంగా కనీసం ఒక్క సూచన, ఒక్క సలహా కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నిరకాల చర్యలు తీసుకున్నారన్నారు.

గుత్తి క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత

గుత్తి, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడువు ముగిసినందున తమను ఇళ్లకు పంపాలంటూ క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వలస కూలీలు పోలీసులపై తిరగబడి రాళ్లురువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్‌కు చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన వలస కూలీలు సుమారు 200 మందిని అధికారులు తరలించారు. ప్రారంభంలో జిల్లాకు చెందిన కొంతమందిని ఇళ్లకు తరలించి స్వీయ నియంత్రణలో ఉండాలని ఆదేశించారు. మిగిలిన వారు అక్కడే ఉన్నారు.

కరోనాపై సీఎం చర్యలు భేష్

గుంటూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, మరో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రతి నియోజకవర్గంలో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా, వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాల్లో మాట్లాడారు.

అందుబాటులోకి వైఎస్సార్ టెలిమెడిసిన్

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ టెలీమెడిసిన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ - 14410ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 11 నాటికి 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. టెలీమెడిసిన్ ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ మూడు షిప్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు. టెలీమెడిసిన్ ఉద్దేశం.. కోవిడ్-19 కేసులను గుర్తించడం, ఐసోలేట్ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం.

ఎంపీ జీవీఎల్ కృషితో 20 బస్సుల్లో వారణాసి నుంచి వస్తున్న తెలుగువారు

విజయవాడ, ఏప్రిల్ 13: కరోనా ప్రభావంతో గత 20రోజులుగా వారణాసి పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులు ఎట్టకేలకు దాదాపు 20 బస్సుల్లో సోమవారం బయలుదేరి వస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 బస్సులు, సోమవారం ఉదయం మరో 8 బస్సులలో వారు స్వరాష్ట్రాలకు బయలుదేరినట్లు సమాచారం. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతితో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక కృషి చేసి యూపీ ప్రభుత్వ సమన్వయంతో ప్రత్యేక అనుమతులు పొందారు. ఈమేరకు అక్కడి నుంచి తెలుగువారిని పంపించడం సాధ్యమైందని తెలిసింది.

మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వానికి చిన్నచూపు

గుంటూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మైనార్టీలపై అక్కసు వెళ్లగక్కుతూ అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. సోమవారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీలను కించపరిచేలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముస్లింలు ప్రభుత్వానికి సహకరించడం లేదనడం దుర్మార్గమన్నారు.

Pages