సినిమా సంగీతం సేమ్ టు షేమ్
చాలా రోజుల తరువాత తెలుగు సినిమా సంగీతంలో మళ్లీ మొనాటనీ వస్తోంది. మధురమైన సంగీతానికి మొదట్నించీ పెట్టింది పేరు తెలుగు సినిమా. ఆది నుంచీ పద్యాలు, పాటలు తెలుగు సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. కేవలం పాటల కారణంగానే రిపీట్ ఆడియన్స్ వచ్చి విజయవంతమైన సినిమాలు తెలుగులో వందల్లో వున్నాయి. భక్తప్రహ్లాదలోని ‘జీవము నీవే కదా’ పాట ఇన్ని పదుల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా, తరాలు మారినా నిలిచి వుంది. ఆపై మల్లీశ్వరి, దేవదాసు దగ్గర నుంచి ఆ మొన్నటి శంకరాభరణం, సప్తపది వగైరా వరకు. చిత్రమేమిటంటే తెలుగు సినిమా ఏ పుంతలు తొక్కినా సంగీతం విషయంలో మార్పులు వస్తూనే వున్నా, మంచి పాటలకు ఎప్పుడూ కరువు లేదు. పౌరాణికాలు, జానపదాలైనా, ఆపై సాంఘికాలు రాజ్యమేలినా, స్టంట్ సినిమాలు, డిటెక్టివ్ కథలు తెరకెక్కినా, ప్రేమకథలు పరిఢవిల్లినా, సంగీతం మాత్రం తన స్థానాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది.
యాభై నుంచి డైభైల వరకు మధురమైన సంగీతం తెలుగుసినిమాల నుంచి జాలువారింది. సుసర్ల, సబ్బరామన్, పెండ్యాల, ఘంటసాల, రాజన్ నాగేంద్ర, రాజేశ్వరరావు, వేణు, టీవీ రాజు, ఎస్పీ కోదండపాణి, లాంటి మహానుభావులు, మల్లాది, శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, సముద్రాల వంటి హేమా హేమీలతో కలసి, ఎవరి తరహాలో వారు కాలానికి నిలిచిపోయిన ఆణిముత్యాలను అందించారు.
ఆ తరువాత తరం మారుతున్న వేళ ఎమ్మెస్ విశ్వనాధన్, కెవి మహదేవన్, ఆదినారాయణరావు, రమేష్నాయుడు, తదితరులు తామున్నామని ముందుకు వచ్చి, వారసత్వం అందుకోవడమే కాక, దాన్ని నిలబెట్టారు. ఆనాడు కూడా ఎవరి స్టయల్ వారిది. దాంతో వైవిధ్య భరితమైన గీతాలు వినిపించాయ. అంతలో యమగోల చిత్రంతో చక్రవర్తి (కొమ్మినేని అప్పారావు, దర్శకుడు శేషగిరిరావు(గిరిబాబు దేవతలారా దీవించండి ఫేమ్)సొదరుడు) యుగం ప్రారంభమైంది. మహదేవన్ మెలోడీతో కూడిన వేగంతో పాటలు అందిస్తే, చక్రవర్తి వాటికి మించిన వేగంతో కూడిన కొత్త దనాన్ని చవిచూపించాడు. నిజానికి వీటిలో చాలా వరకు కాలానికి నిలవలేకపోయినా, యువతరాన్ని అప్పట్లో పట్టి ఊపేసాయి. అదీ ఎంత ఉధృతంగా అంటే ఒక దశలో మహదేవన్ మినహా ఎవరూ చక్రవర్తి థాటిని తట్టుకుని పరిశ్రమలో నిల్చోలేనంత. ఒకే ఏడాది డెభై సినిమాల వరకు చేసిన రికార్డు అతగాడిది. ఇంతవరకు పరిశ్రమలో ఆ రికార్డును ఎవరూ అందుకోలేదనే చెప్పాలి. కానీ ఉవ్వెత్తున లేచిన కెరటం అంత వేగంతోనూ కిందకు జారిపడిన చందాన ఆ వెంటనే చక్రవర్తి హవా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. ముఖ్యంగా వివిధ దర్శకులు సంస్థలకు, పలు సంగీత దర్శకులతో వున్న అనుబంధం దృష్ట్యా మళ్లీ అందరికీ అవకాశాలు అందడం ప్రారంభమైంది. దీంతో వైవిధ్యమైన సంగీతం వినే అవకాశం సినిమా ప్రియులకు దక్కింది. ఇలాంటి సమయంలో ఇళయరాజా యుగం ప్రారంభమైంది. వేటూరి-ఇళయరాజాల కాంబినేషన్ తెలుగు సినిమాకు అద్భుతమైన పాటలను అందించింది. అవి నేటికీ రిపీట్ రికార్డులుగా అమ్మకాలు బద్ధలు కొడుతూనే వున్నాయి. ఇలాంటి సమయంలో కూడా రాజ్కోటి (టీవీ రాజు, సాలూరి వారసులు), మహదేవన్, రమేష్నాయుడు, తదితరులు తమదైన శైలిలో సంగీతం అందిస్తూనే వచ్చారు.
దానా దీనా తెలిసేమిటంటే, ఏ తరహా సినిమాలు వచ్చినా, ఎందరు సంగీత దర్శకులు వచ్చినా, తెలుగు సినిమా పాట శ్రోతలను అలరిస్తూనే వచ్చింది. శ్రోతల అభిరుచిలో మార్పు వచ్చి, యువ శ్రోతలు పెరిగాక, ప్రపంచవ్యాప్తంగా కూడా పలు రకాలైన మార్పులు అనివార్యమయ్యాక, గడచిన దశాబ్ధ కాలంలో తెలుగు సినిమా సంగీత రంగం పలు ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. ఇళయరాజా నుంచి లీడింగ్ హక్కులను రెహమాన్ తీసుకుంటున్న సమయంలో తెలుగునాట కీరవాణి సంగీత తరంగాలు వ్యాపించడం ప్రారంభించాయి. విన్న పాటలే వింటున్నట్లు వున్నా, కీరవాణి తనదైన స్టయిల్లో చాలా వరకు మంచి పాటలు అందించారు. ఇంతలో తెలుగు నాట యువ సంగీత తరంగాలు వ్యాపించడం ప్రారంభించాయి. ఆర్పీ పట్నాయక్, మణిశర్మ తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆర్పీ తనకంటూ ఓ స్టయిల్లో ముందుకు వెళ్తూ వెళ్తూ, నాలుగైదు పడవలపై కాళ్లు పెట్టి, సంగీతానికి దూరమయ్యారు. ఇక మణిశర్మ కొంత కాలం ఒక ఊపు ఊపారు. బీట్, మెలోడీ ప్రాధాన్యం వున్న కాలానికి నిలిచే పలు పాటలను అందించారు. ఇంతలో మరింత మంది సంగీత దర్శకులు వేదికపైకి వచ్చారు. దేవీశ్రీప్రసాద్, రాధాకృష్ణన్, విక్కీ జె మేయర్, చక్రి, కళ్యాణ్మాలిక్,అనూప్రూబెన్స్, శేఖర్ చంద్ర, యోగీశ్వర శర్మ, రఘు కుంచె తదితరులు ఎవరి స్టయిల్లో వాళ్లు పాటలు అందించారు. వీరిలో దేవీశ్రీప్రసాద్ మంచి పొజిషన్కు చేరుకున్నాడు. వీరు కాక పొరుగు చిత్ర రంగాల నుంచి యువన్ శంకర్రాజా, హారిష్జయ్రాజ్ తదితరులు అప్పుడప్పుడు ఇక్కడ కూడా తన సంగీతం వినిపిస్తూనే వచ్చారు. ఇంతలో వున్నట్లుండి ఎస్ ఎస్ థమన్ హవా ప్రారంభమైంది. కిక్తో మాంచి కిక్ వున్న సంగీతం అందివ్వడంతో ఇక నిర్మాతలు, హీరోలు పొలోమంటూ అతడి వెంటపడ్డారు.
దీంతో దాదాపు అరవై డెభై ఏళ్ల కాలంగా మంచి పాటలకు మొహం వాచకుండా చేస్తున్న తెలుగు సినిమా రంగానికి ఇప్పుడు గడ్డురోజులు వచ్చాయి. మంచి పాటలే కరువయ్యే పరిస్థితి వచ్చింది. అటు ట్యూన్ ఇటు, ఇటు ట్యూన్ అటు చేసినా, ఇళయారాజా ట్యూన్లను కాస్త గిల్లి, ముక్కలు కొరుక్కున్నా దేవీశ్రీప్రసాద్ వినగలిగిన సంగీతమే అందిస్తూ వచ్చాడు. ఇక రాథాకృష్ణన్ తను చేసిన ఆనంద్, గోదావరి, చందమామ సినిమాల్లో అద్భుతమైన మెలోడీలను అందించాడు. విక్కీ జే మేయర్ కూడా హ్యాపీడేస్, లీడర్ తదితర చిత్రాల్లో మంచి పాటల నిచ్చాడు. కళ్యాణ్మాలిక్ ఓ చిన్నతరహా అద్భుతం. చక్కటి ట్యూన్లు ఇస్తాడు. అష్టాచెమ్మా, అలా మొదలైంది తదితర సినిమాలే అందుకు ఉదాహరణ. శేఖర్చంద్ర కూడా నచ్చావులే, నువ్విలా సినిమాలకు మంచి సంగీతమే ఇచ్చాడు. ఇలా ఇంతమంది ఇన్ని రకాల సంగీతం అందిస్తున్నా, వున్నట్లుండి లీడింగ్ హీరోలందరికీ థమన్ మాత్రం కనిపించడం ఆశ్చర్యకరం. రాజ్కోటి, కీరవాణి, మణిశర్మల వద్ద చిరకాలం శిష్యరికం చేసిన థమన్, రెహమాన్లాగే పదమూడో ఏట నుంచే సినిమా సంగీతంతో జీవితాన్ని పెనవేసుకున్నాడు. చాలా కష్టాలు పడి పైకి వచ్చాడు. అనుకోకుండా కృషి, అదృష్టం పెనవేసుకుని అందలం అంది వచ్చింది. కానీ దానికి తగ్గట్లు అతగాడి నుంచి మంచి సంగీతం మాత్రం రావడం లేదనే విమర్శలు వినివస్తున్నాయ. లెక్కకు మిక్కిలిగా తెలుగు, తమిళ నాట అవకాశాలు వచ్చినా, అతగాడు చేసిన వినసొంపైన పాటలను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు.
దీనికి తోడు ఇటీవల కాలంలో సినిమా సంగీతం కూడా దిగజారుడు బాట పట్టింది. వేటూరి మరణించడం, సిరివెనె్నల అడపాదడపా తప్ప కలం విదిలించకపోవడంతో కాస్తో కూస్తో సాహిత్య విలువల మాట సరే, కనీసం మంచి పదాలైనా వినే అవకాశం పోతోంది. ఒకప్పుడు హీరోయిన్ ‘నీ చేయి తాకగానే ఏదో హాయి కలిగెను, ఓరుూ అని పిలవాలని ఊహకలిగెను’ అని అద్భుతంగా ఆలపిస్తే, ఇప్పుడు హీరో హీరోయిన్లు..‘పచ్చడి పచ్చడి పచ్చడి చేస్తా..నడుము తడిమేస్తా..’ ‘ఎక్కడెక్కడో చెయ్ వేయ్రా..అక్కడ ఏదేదో చేసేయ్రా’ అని పచ్చిగా పాడుకుంటున్నారు.
సరే ఈ సంగతి పక్కన పెట్టి మళ్లీ సంగీతం సంగతి చూస్తే, వేలం వెర్రిగా ఓ సంగీత దర్శకుడి వెంట పడ్డమే కానీ, వైవిధ్యమైన సంగీతం అందించిన వారిని ఆదరించి, మంచి పాటలు అదించే ప్రయత్నాలు దర్శకులు, హీరోలు చేయడం లేదు. ఇక్కడ నిర్మాత ప్రమేయం ఏమీ లేదు. అతగాడు డబ్బు పెట్టడమే తప్ప, నిర్ణయం తీసుకుని అధికారాన్ని ఎప్పుడో కోల్పోయాడు. థమన్..్థమన్ అని వెంటబడి, గత ఏడాది కాలంలో పెద్ద సినిమాలన్నీ అతగాడి చేతిలో పెట్టి, అందించిన మంచి పాటలెన్ని అని హీరోలు, దర్శకులు ఒక్కసారి ఆలోచించాలి. రాథాకృష్ణన్, విక్కీ జే మేయర్, కళ్యాణ్మాలిక్, మణిశర్మ వంటి సంగీత దర్శకులు, హీరోలకు ఎందుకు గుర్తుకురావడం లేదో తెలుసుకోవాలి.
చిత్రమేమిటంటే నందినీ రెడ్డి మొదటి సినిమా అలా మొదలైంది’కి కళ్యాణ్ మాలిక్ మంచి సంగీతం అందించి, విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆమె కూడా తన రెండో సినిమాకు అతగాడ్ని విస్మరించారు.
మంచి సంగీతం అందించే అందరికీ ఒకటో రెండో అవకాశాలు కల్పించడం ద్వారా వైవిధ్యమైన సంగీతం వినే అవకాశం కలుగుతుంది. లేకుంటే..‘సారొచ్చారొచ్చారే..రొటీన్ మ్యూజిక్కే ఇచ్చారే’ అనుకోవడం మినహా ఫలితం వుండదు.