మనలో మనం (ఎడిటర్తో ముఖాముఖి)
Published Tuesday, 4 July 2017ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
బి.జె.పి. ప్రభంజనంలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ వారు ప్రతిపక్షాలను కలుపుకుని రాష్టప్రతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలపాలని తహతహలాడుతున్నారు. బి.జె.పి. వారికి స్వంతంగా గెలిచే తాహతు వున్నా, వీరెందుకు ఉబలాటపడుతున్నారు?
ఊరకుంటే ఊరా పేరా?
ఈ మధ్య రాహుల్ గాంధి ఆంధ్రకు వచ్చి తమ ప్రభుత్వం వస్తే మొదటి సంతకం ‘ప్రత్యేక హోదా’పై చేస్తామన్నారు. ఇది జరిగే పనేనా? తాము అధికారంలో ఉండగా ఇవ్వలేదు?
పోనీండి! ఆ కుర్రాడికి బుద్ధిమాంద్యం.
వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.
ఈ మధ్య కాంగ్రెస్ వాళ్లు పెట్టిన ప్రత్యేక హోదాపై సభకు నేత రాహుల్ గాంధీ రాగా, ‘హోదా హక్కు’ అని హుంకరిస్తున్నా, జనసేన నేత పవన్కళ్యాణ్ ఆ సభకు వెళ్లకపోవడం వెనుక ఆంతర్యమేమి?
ఎవరి దుకాణం వారిది.
యశ్వంతరావు, ధవళేశ్వరం
వ్యాపార వస్తువులు అన్నింటి మీదా టాక్స్ వేశారు కదా! మరి ఈ దేశంలో అన్నిటికన్నా పెద్ద వ్యాపారం ఓట్లు కొనడం కదా! అన్ని పార్టీలు ఓట్ల కొనుగోలు వ్యాపారం చేస్తాయన్నది పూర్తిగా నిజం కదా! ఈ ఓట్ల కొనుగోలు పొలిటికల్ వ్యాపారం మీద జిఎస్టి పన్ను వేయలేదేం?
రాజకీయ పార్టీలు పన్నులకు, లెక్కలకు అతీతం. అది అన్ని పార్టీలు ఎప్పుడో చేసుకున్న లోపాయకారి ఏర్పాటు.
శరగడం స్వప్నసుందరి, ప్రకాష్నగర్
గత నెల 20కే బాహుబలి-2 రూ.1500 కోట్లు గ్రాస్ కలెక్షన్లతో అన్ని రికార్డుల్ని అధిగమించింది అని అన్ని పత్రికలు రాసాయి. రీసెంట్గా ఓ ప్రముఖ వారపత్రికలో నేటి ఈ భారీ వసూళ్లతో ఆ సినిమాకి పెట్టుబడులపై 30 శాతం లాభం కళ్లజూశారు అని రాశారు. ఏమిటీ సినీ లెక్కలు?
ఎక్కడైనా అసలు లెక్కలు వేరు. ఇన్కంటాక్స్ లెక్కలు వేరు.
సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
మక్కా - జెరూసలేంలకు ఉచిత కుటుంబ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల దేవాలయాలకు, బద్రీనాథ్ లాంటి పవిత్ర దేవాలయ దర్శనాలకు హిందువులకు ఎందుకు ఈ సదుపాయం కల్పించుటలేదు?
ప్రపంచంలో కనీవినీ ఎరుగని మన సోకాల్డ్ సెక్యులర్ రాజ్యంలో హిందువులు రెండో తరగతి పౌరులు కనుక.
తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి, మల్కాపురం
గత ఏడాది వరకూ తిరుపతికి ఒకరోజు భక్తుల తాకిడి లక్ష లోపు వున్నా హుండీ ఆదాయం రూ.3 కోట్లుగా ఎన్నోసార్లు చూశాం. ఇప్పుడు భక్తులు లక్షకు పైగా దర్శించుకుంటున్నా రెండు కోట్ల 20 లక్షలు దాటడం లేదు. కారణం ఏమయి ఉంటుంది?
నగదు సరఫరాను ప్రభుత్వం బిగదీయటం వల్లేమో.
ముక్కంటి, వక్కలంక
కార్లపై ఎర్రబుగ్గలు తొలగించినందున సామాన్య ప్రజలకు ఒరిగిందేమిటి?
అదో రకం ఆత్మానందం.
అభివృద్ధి చెందిన దేశాలలో పెట్రో ధరలు రోజూ మారుతాయని, అభివృద్ధి ఇంకా చెందుతూనే వున్న మన దేశంలో అమలు పర్చడం తగునా? దీనివల్ల వినియోగదారులు నష్టపోయే అవకాశాలే ఎక్కువేమో!
ఇప్పుడే చెప్పలేం.
ఎస్.దీపిక, పుంగనూరు
సర్! మీరు కథల పోటీకి పంపిన కథలను సీనియారిటీ ప్రకారం ఎన్నుకుంటారా? లేక కథలు నచ్చితే కొత్తగా రాసేవారికి కూడా మొదటి బహుమతి ఇస్తారా? మా స్నేహితురాలు పక్షపాతం చూపిస్తారంటోంది. నిజమేనా?
ఈసారి బహుమతులు పొందిన వారిలో కొత్త రచయితలూ ఉన్నారు. కావలసింది సృజనాత్మకత. సీనియారిటీ కాదు. *
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net