S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మ భాషకు వందనం

మహోన్నత భాషకు మన్నన
*
ప్రపంచ తెలుగు మహాసభలపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
*
తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు భాష కీర్తి పొందింది. నికోలస్‌కోంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను ‘సుందర తెలుంగు’ అని కీర్తించినాడు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం.
చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో 2వేల సంవత్సరాల పూర్వం నుండే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన హాలుని ‘గాథాసప్తశతి’లో మన తెలుగుకు సంబంధించిన వౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మగుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాల్లో ఉండటం విశేషం. దీనినిబట్టి క్రీ.శ.947 నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెప్తున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయమైన ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గద్య పద్యోక్తుల కన్న సరసమై పరగిన జానుతెలుగులో కావ్యసృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి, అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి.
తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన ‘బసవ పురాణం’. తొలి శతకం ‘వృషాధిప శతకం’, తొలి ఉదాహరణ కావ్యం ‘బసవోదాహరణం’ పాల్కురికి సోమన వెలువరించిన ‘అనర్ఘ కావ్యరత్నాలు.’ తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తరవాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనినిబట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం.
తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోనబుద్ధారెడ్డి వెలువరించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి ‘ద్విపద కావ్యం’. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు నివాసి అయిన పొన్నిగంటి తెలగన రచించిన ‘యయాతి చరిత్రం’ తొలి అచ్చ తెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతి శాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథా సంకలన కావ్యం ‘సింహాసన ద్వాత్రింశిక’ను రచించిన కొఱవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ నివాసి. చాటుపద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. ‘వాణి నా రాణి’ అని ప్రకటించిన ‘జైమినీ భారత’ కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండ నేలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా.
తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మెర పోతన రచించిన ‘శ్రీమద్భాగవతం’ మధురభక్తికి, మంజు పద విన్యాసానికి, మనోహరమైన ఆలంకారిక శైలికి ఆలవాలమై అజరామర కీర్తిని పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్య్రర్థి, చతురర్థి కావ్యాలు, చిత్ర, బంధ, అవధాన పద్య విద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతోపాటు జానపద జీవధారకు తెలంగాణ పుట్టినిల్లు. నిరక్షరాస్యులైన శ్రామిక జనుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటు పాటలు, రాటు పాలు, మోట పాటలు, కల్లాల దగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటలలో పల్లెజనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమ పాటలు, అసోయి ధూల అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘ జీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒక తరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుత రామాయణం, హరికథ, యక్ష గానాలు, ఒగ్గు కథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాలలో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తే మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రనే చరిత్రగా చెలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయినయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒక దశలో అయితే తెలంగాణలో కవులే లేరనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి, పండితుడు సురవరం ప్రతాపరెడ్డిగారు తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకోర్చి, తెలంగాణ నాలుగు చెరగులా తిరిగి, 354 మంది కవుల రచనతో ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించారు. అది మన తెలంగాణ స్వాభిమాన పత్రీక, సాహిత్య జయపతాక.
జలపాత సదృశ్యమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢిమితో ‘అగ్నిధార’ ‘రుద్రవీణ’ వంటి పద్య కావ్యాలను సృష్టించిన మహాకవి దాశరథి. ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’ అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించాడు.
‘్భగర్భమున గనులు, పొంగి పారే నదులు నా తల్లి తెలంగాణరా! వెలలేని నందనోద్యానమ్మురా!’ అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకట రామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు.
ప్రజాకవి కాళోజి తన కవితలలో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించిన వారికి దీటైన సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో, తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృతనిశ్చయంతో కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశే్లషణ, ప్రచురణ, ప్రచారం జరగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడెమీని ఏర్పాటు చేసింది. అకాడెమీ అధ్యక్షునిగా ప్రసిద్ధ తెలంగాణ కవి నందిని సిధారెడ్డిని నియమించి, సారథ్య బాధ్యతలు అప్పగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవలనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణ సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. లాల్‌బహదూర్ స్టేడియం ప్రధాన వేదికగా రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, ఆడిటోరియం ఇతర వేదికలుగా ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. సభ సందర్భంగా తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు, ద్వారాలు, హోర్డింగ్‌లు నగరం నిండా ఏర్పాటు చేయబోతున్నాం.
ఈ సభలలో పాల్గొనడం కోసం రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతోపాటు, ఇతర రాష్ట్రాలలో, దేశాలలో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ సాదరంగా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియ లన్నింటిపైన కూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలంచుకుంటూనే వర్తమానాన్ని విశే్లషిస్తాయి. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. ఈ సభలలో ఏర్పాటు చేసే కళా ప్రదర్శనను తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్యరస హృదయులందరూ ఒకచోటకు చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతోపాటు వారిలో నూతన ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తాయి.
సభల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సన్నాహక సమావేశాల కోసం ప్రతి జిల్లాకు ఐదు లక్షల రూపాయలు కేటాయించింది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు తెలంగాణ సాహిత్య విశేషాలపై వ్యాసరచన, వక్తృత్వం, పద్య పఠనం, కవితా రచన తదితర అంశాలలో పోటీ నిర్వహణ ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహ సమావేశాలు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరాలలో జరిగాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలుగువారు నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. సభల ప్రారంభం, ముగింపు వేడుకలో పాల్గొనడానికి జాతీయ స్థాయి ప్రముఖులు విచ్చేయబోతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చేవారందరికీ నివాసం, భోజనం, స్థానిక రవాణా సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నది. అతిథి మర్యాదల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటేవిధంగా చక్కని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నది.
సభలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవారు రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
గౌరవ శాసనసభ్యులకు నేను ప్రత్యేకంగా మనవి చేయదలచుకున్నాను. మీ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం మీద మీరు దృష్టి సారించండి. అంతేకాకుండా, మీ ప్రాంత సాహిత్యానికి ఉన్న ప్రత్యేకతలను, అజ్ఞాతంగా ఉన్న విశేష రచనలను తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి గారి దృష్టికి తీసుకురండి. ఇందుకోసం మీరు రవీంద్రభారతిలో ఉన్న వారి కార్యాలయం తలుపును ఏ నిమిషమైనా తట్టవచ్చు. వారు సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానించడమే కాక మీ ప్రాంత సాహిత్య విశేషాల్ని వెలుగులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు.
శాసనసభ్యులతోపాటు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలని కోరుతున్నాను. సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, భాషా ప్రేమికులు గుండె నిండుగా జరుపుకునే ఈ తెలుగు పండుకలో అందరూ ఉత్సాంగా పాల్గొని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు.