S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కీర్తి సంకేతాలు...భారతీయ గ్రంథాలు

అక్షరరూపం దాల్చిన ఒకేఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంతమైన ఆయుధం. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి అయుఃప్రమాణం వందేళ్లయితే, గ్రంథ ఆయుఃప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంథ పూజను పుస్తకాల (సరస్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రులలో నిర్వహించే ఆచారం కొనసాగుతున్నది. గ్రంథం పొరపాటున కాలికి తగిలితే, కళ్లకు అద్దుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది.
గ్రంథానికి వయసు అనేది లేదు. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300ఏళ్ల క్రితం కౌటిల్యుడు అర్థశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్ట్ధ్యాయి’, పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్యశాస్త్రం’, హాలుని ‘గాథా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాలలాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి.
గ్రంథానికి మృతి లేదు. అక్షర రూపం దిద్దుకున్న ఆలోచన, రాసిన వస్తువును బట్టి ఎంతకాలం మనగలుగుతుందో నిర్ణయమవుతుంది. తాళపత్ర, బూర్జపత్ర, తామ్రపత్ర, చర్మపత్ర రూపాలలో ఉన్నవి శిథిలాలైతే, తిరిగి ప్రతి లేఖనాలవుతాయి. మనిషి అజ్ఞానంతోనో, విలువ తెలియకో, స్వార్థపరుడై విధ్వంసం చేస్తే తప్ప, తామ్ర, శిలారూపాలకు చావే లేదుకదా.
భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంథాలు విదేశీయులను ఆకర్షించాయి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే తలంపులో భాగంగా, భారతదేశాన్ని జయించడానికి వచ్చిన సందర్భంగా ఆయన గురువైన అరిస్టాటిల్, మన దేశ తత్వసాహిత్యాన్ని తెరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు. బుద్ధ బోధన గ్రంథాలు, విదేశీ యాత్రికల సందర్శనలకు హేతువులైనాయి. చైనా, టిబెట్, అఫ్ఘానిస్థాన్, మంగోలు దేశీయులు భారత సందర్శనతోపాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్య మూల, అనువాద రూపాలలో తీసుకువెళ్లారు. అక్షరం కనుగొనబడడానికి ముందు వేద వాఙ్మయం శ్రుత సాహిత్యంగా ఉండేది. శ్రౌతం లిఖితం కావడం మానవ సంస్కతీ వికాస పరిణామల క్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ప్రస్తాద త్రయం, భారత భాగవత రామాయణాలు, ఉప పురాణాలు, స్మృతి గ్రంథాలు, భారతీయ కథా సాహిత్యం గ్రంథ రూపం సంతరించుకున్నాక, ప్రపంచంలో ఏ జాతీ, ఏ దేశం, భారత దేశానికి సాటి రావని సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది. భారతీయ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం.
ప్రాచీన తాళపత్ర గ్రంథాలు నలంద, తక్షశిల తదితర విశ్వవిద్యాలయాలలో భద్రపరచబడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలాసార్లు మాడి మసిబొగ్గయింది. నేపాల్ విశ్వవిద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విషాద ఘటన. ముద్రణాయంత్రాలు వచ్చాక, ప్రతుల ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథ వందలాది ప్రతులు సిద్ధమయ్యే సౌలభ్యం ఏర్పడింది. అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారు చేసే ఉద్యోగులు ఉండేవారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహుకష్టంతో కూడుకునేది. గురువుకు ప్రాధాన్యత ఉండడం వల్లే గురుఃబ్రహ్మ, గురుర్విష్ణు అన్న సూక్తి పుట్టుకొచ్చింది. దానిని ప్రస్తుతం గ్రంథానికి వర్తింప చేయవచ్చు. గ్రంథాల అందుబాటు వల్ల దూరవిద్యా విధానం కూడా అమలు లోనికి వచ్చింది. ముద్రణా యంత్రాల ఆధునీకరణ జరిగింది. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్ వల్ల ముద్రణ నాణ్యమైన, అందమైన ముద్రణలతోపాటుగా నేడు ‘‘ఈ గ్రంథాలు’’ చాలా ఉపయోగపడుతున్నాయి. అయినా ముద్రిత గ్రంథ ఉపయోగం ఇంకా తగ్గుముఖం పట్టలేదు.
గ్రంథస్థ విషయాలు ప్రపంచవ్యాపితం అవుతున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంథాలు, సృజనాత్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మికాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటేమిటి... వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథంలోకి వెళితే, అది బాహ్యప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతున్నది. అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారాలు. ముద్రణ వల్ల గ్రంథానికి విలువ ఏర్పడింది.
బహు భాషలు, రచయితలు, గ్రంథాలు, ముద్రాపకులు, ఒక్కచోట చేరితే అదొక విజ్ఞాన విశ్వమే కదా. అందుకే చాలామందికి ప్రీతిపాత్రం గ్రంథాల జాతర. దేవుడిని జారతలో కొలిచినట్లే, గ్రంథాలను పరమపవిత్రంగా భావించే సంస్కృతి భారతీయులది. కొనేవారు, చదివేవారు, సంరంభాన్ని కన్నుల పండువుగా తిలకించే వారు, కుటుంబ, స్నేహ, ప్రేమికుల, విద్యార్థుల రచయితల, కవుల, సాహితీకారుల బృందాలు ఒక్కచోట కలిసి పండుగ చేసుకునే భాగ్యనగర పుస్తక మేళాకు వెళ్లినవారికి మరచిపోలేని అనుభూతులను మిగులుస్తుందనేది నూటికి నూరు పాళ్లు నిజం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494