‘లోధా’ సిఫార్సుల అమలు అసాధ్యం
Published Friday, 4 March 2016న్యూఢిల్లీ: లోధా కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని పేర్కొంటూ బిసిసిఐ సుప్రీం కోర్టులో గురువారం దాఖలు చేసిన కౌంటర్లో స్పష్టం చేసింది. బోర్డు, దాని సభ్య సంఘాల కార్యవర్గాల్లో మంత్రులకు స్థానం ఉండకూడదని, అంతేగాక, కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయోపరిమితిని విధించాలని లోధా కమిటీ చేసిన సిఫార్సులపై బిసిసిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాలు ఆచరణకు
అసాధ్యమని పేర్కొంది. లోధా కమిటీ సిఫార్సులు ఇప్పటికే బహిర్గతమైనందువల్ల వాటిని అమలు చేయడంలో చాలా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక సంఘానికి ఒకే ఓటు వంటి సిఫార్సులను కూడా బోర్డు వ్యతిరేకించింది. బెట్టింగ్కు చట్టబద్ధత కల్పించాలన్న సిఫార్సు కూడా ఆమోదయోగ్యంగా లేదని తెలిపింది. లోధా కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలను ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేయడం కుదరదని చెప్పింది. సిఫార్సులపై కూలంకషంగా చర్చించిన తర్వాత, వాటి అమలులో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ను దాఖలు చేస్తున్నట్టు పేర్కొంది.
ఎందుకు సాధ్యం కాదు: కోర్టు
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం ఎందుకు సాధ్యంకాదో వివరించాలని బిసిసిఐని సుప్రీం కోర్టు సూచించింది. బోర్డుతోపాటు సభ్య సంఘాల కార్యవర్గాల్లో కూడా మంత్రులకు ఎలాంటి పదవి ఉండకూడదన్న నిబంధనను అమలు చేయడంలో సమస్య ఏమిటని నిలదీసింది. కోట్లాది రూపాయల లావాదేవీలపై ఎవరి పర్యవేక్షణ ఉంటుందని ప్రశ్నించింది. బోర్డు పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం లేదా అని అడిగింది. ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఇది వరకే వ్యాఖ్యానించింది.