మనిషి, పక్షి, చెట్టూ..
Published Sunday, 24 June 2018జీవితంలో విజయాలూ వుంటాయి. వైఫల్యాలూ వుంటాయి. అవి రెండింటికి పొంగిపోకూడదు. కృంగిపోకూడదు. పొంగిపోయినా పర్వాలేదు కానీ కృంగిపోకూడదు. కానీ చాలామంది వైఫల్యాలు రాగానే కృంగిపోతారు.
ఈ విధంగా వైఫల్యాలు, అనారోగ్యం ఎదురైనా ఓ వ్యక్తి చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో ఆ వ్యక్తికి ఓ మిత్రుడు తారసపడ్డాడు.
మిత్రుడికి అదే విషయం చెప్పాడు. ఆ వ్యక్తి పరిస్థితిని అతని మిత్రుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు.
అతనితో ఇలా చెప్పాడు-
‘మిత్రమా! ఈ చెట్టుని చూడు. అది కదలదు. ఒకేచోట వుంటుంది. దానికి జీవం వుంది. మరణం వుంది. అది ఎప్పుడూ మరణించాలని అనుకోదు. సహజసిద్ధంగా మరణం వచ్చినప్పుడే అది మరణిస్తుంది.
ఆ పక్షిని చూడు. హాయిగా ఎగురుతుంది. ఆహారం కోసం ప్రయాణం చేస్తుంది. అది కూడా ఎప్పుడూ మరణించాలని అనుకోదు. జీవన పోరాటం చచ్చేవరకు కొనసాగిస్తుంది.
ఒక విషయం నువ్వు గమనించాలి. అవి మనలా మాట్లాడవు. మనలా వాటికి మెదడు లేదు. మనలా అవి ఆలోచించవు. మనతో పోలిస్తే వాటి స్థాయి మనకన్నా తక్కువ. అవి మనలని ఉపయోగించుకోవు. మనం వాటిని ఉపయోగించుకోగలం. మనం వాటికన్నా అధికులమని, వాటికన్నా మనకు జ్ఞానం ఎక్కువ వుందని భావిస్తాం. ఇప్పుడు చెప్పు. మనకన్నా అవి గొప్పవా కావా?’
ఆ వ్యక్తికి జ్ఞానోదయం అయ్యింది.
‘అవును. నువ్వు చెప్పింది నిజమే! జ్ఞానం ఉన్న మనమే అజ్ఞానులం. ఆత్మహత్యల గురించి ఆలోచిస్తాం. వైఫల్యం రాగానే నిరుత్సాహపడతాం. నా ఆలోచన తప్పు’ అన్నాడు ఆ వ్యక్తి.
ఈ సృష్టిలో మనిషి అన్ని జీవరాసులకన్నా తెలివి కలవాడు. జ్ఞాన సంపన్నుడు.
అన్నింటిని ఉపయోగించుకునే తెలివితేటలు కల వ్యక్తి. అలాంటి వ్యక్తికే ఇలాంటి ఆత్మహత్యలు లాంటి ఆలోచనలు వస్తాయి.
ఈ ఆలోచనలని దూరంగా వుంచే తెలివితేటలు అతనికి వున్నాయి.
ఈ విషయం ప్రతి వ్యక్తీ గుర్తుంచుకోవాలి.