S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బారిస్టర్ ప్రకాశం

ప్రకాశంగారి నిర్భీతి, మొక్కవోని ధైర్యం, కేసుల్లోని అన్ని వివరాలను, వాస్తవాలను క్షుణ్ణంగా పరీక్షించి, ఆకళింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు, వాటిని క్రమపద్ధతిలో తనదైన శైలితో న్యాయమూర్తుల ముందు వాదించగలిగే స్థైర్యం ఆయనకు ఆనాటి న్యాయమూర్తుల గౌరవాన్ని పొందడానికి తోడ్పడ్డాయి. అనితర సాధ్యమయిన కఠోర శ్రమ ఆయన విజయానికి ముఖ్య కారణాలైనాయి. ప్రాంతీయ అభిమానాలు పక్షపాతాలతో నిండి ఉన్న న్యాయవాద వృత్తిలో ద్వితీయ శ్రేణి ప్లీడరైన ఆంధ్రకేసరి ఆర్థిక సహాయంగానీ, ఆనాటి మద్రాస్ పెద్దల ఎలాంటి సహాయం లేకుండా పైగా వారి వ్యతిరేక పరిస్థితులలో హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించడమే కాకుండా అగ్రశ్రేణికి కూడా రాగలగడం, వారిని మించిపోవడం ఎలా సాధ్యపడిందో మహాతీతమైన విషయం.
ప్రకాశంగారిది నిండు గుండె. అందులో నిర్భీతి ఎంత ఉందో అంతే కృతజ్ఞతా భావం, దయ, స్నేహం అంతే పాళ్లలో నిండి ఉన్నాయి. 1894లో మద్రాస్‌లో ‘లా’ పరీక్ష రాసి సెకండ్ గ్రేడ్‌లో పాసయి ఒంగోలుకు తిరిగి వచ్చాడు. సర్ట్ఫికెట్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో యథాలాపంగా అయిదారు క్రిమినల్ కేసుల్లో వాదించి గెలిచాడు. ఆ రోజుల్లో సర్ట్ఫికెట్ లేకపోయినా క్రిమినల్ కేసులు దేశ భాషల్లో వాదించడమే కనుక పాస్ అయినట్లు దాఖలా ఉండడంతో అనుమతి చిక్కింది. ఆషామాషీగా వకాల్తా నడిపినా ప్రకాశంగారి సూక్ష్మం, తెలివితేటలతో అన్ని కేసులు గెలిచాడు. ఫలితంగా 200-300 రూపాయలు (ఆ రోజుల్లో అది పెద్ద పైకమే) కాకుండా ఆయన కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఆ దెబ్బతో ప్రకాశం బంధువులు, చిన్ననాటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఒంగోలులోనే ప్రాక్టీస్ పెట్టమని ప్రోద్బలం చేశారు. అప్పటికింకా అమ్మగారు సుబ్బమ్మగారు భోజనశాల నడుపుతూ తమ్ముడు శ్రీరాములును చదివిస్తోంది. ‘రాజమహేంద్రవరం ఊరుగాని ఊరని, పైగా అక్కడ బి.ఎల్‌లో ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్లు చాలామంది ఉన్నారని, నీవు వొఠ్ఠి సెకండ్‌గ్రేడ్ ప్లీడరువు. వాళ్ల ధాటికి తట్టుకోలే’వన్నారు. మన సొంత ఊరు ఒంగోలులో అయితే మన బంధుమిత్రులందరు ఉంటారని కూడా బలవంతం చేశారు. ప్రకాశంగారి స్వతంత్ర నైజం, కృతజ్ఞతా నైజం ఇక్కడ కన్పిస్తుంది మనకు. మనిషి తనకు చేసిన మేలు ఎన్నడూ మరువకూడదు. అలా జరిగితే వాడు మనిషి అనిపించుకోడు. ఇది వేదాలు, ఉపనిషత్తులు, ధర్మనీతి శాస్త్రాల ఉవాచ. ప్రకాశంగారు దీర్ఘంగా ఆలోచించారు. నిజమే ఒంగోలు సొంత ఊరు, అమ్మగారు ఇంకా కష్టపడుతున్నారు. కానీ తను చదువుకున్నది, నాటకాలు వేసి పేరు, పలుకుబడి సంపాదించింది రాజమహేంద్రవరంలో. ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్లు, బి.ఎల్.లను ఎదిరించి నిలబడగలిగే దమ్ము, ధీమా, ధైర్యం, వృత్తి మీద నమ్మకం కావలసినంత ఉంది మన దగ్గర. ‘్భయపడడము, జంకడము, వెనుతిరగడము మన జీవితంలోనే లేదు’ అన్నాడు. ఈ కారణాలు ఆంధ్రకేసరికి అంత ముఖ్యమైనవిగా తోచలేదు. వీటన్నింటికీ మించి, అత్యంత ముఖ్యమైన కారణం తన ఆత్మబంధువు, గురువు, నిరంతర శ్రేయోభిలాషి, అన్నదాత, విద్యాబుద్ధులు నేర్పిన తండ్రి సమానులు అయిన హనుమంతరావు ఇక్కడే ఉండటం. నేను నాయుడు గారి దగ్గరే ఉంటాను. సంపాదిస్తాను. శ్రమవంచన లేకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల సహాయం చేస్తానని నిశ్చయించుకొన్నాడు. దేవతలు పై నుంచి తథాస్తు అన్నారు. వ్యతిరేక పరిస్థితులలో రాజమండ్రి, రాజమహేంద్రవరం చేరాడు.
1894 సం.లో రాజమహేంద్రవరంలో తన 22వ ఏట అంత చిన్న వయసులో (ప్లీడర్‌గిరీ ఆ రోజులలో తక్కువే అని పంతులుగారే రాసుకున్నారు) ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రకాశంగారు ఆనాటి రాజమహేంద్రవరం శోభ, ప్లీడర్ల దర్జా, దర్పం, సరంజామా, మందీమార్బలం, సంపాదన గురించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దాటిన తరువాత కూడా జ్ఞాపకం తెచ్చుకొని చాలా విపులంగా రాసుకున్నారు. ఏమని వివరించారంటే.. ప్రాక్టీస్‌కు కావలసిన పరికరాలు, కర్ర పెట్టెలు, జంబుఖానాలు, కుర్చీలు, బల్లలు మొదలైన ఆర్భాటాలు అన్నీ సుబ్బారావు పంతులుగారి వంటి పెద్ద ప్లీడర్లకే ఉండేవి.. న్యాయవాదులంతా 1.బిఎల్ ప్లీడర్లు, 2.్ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్లు 3.సెకండ్ గ్రేడ్ ప్లీడర్లు 4.వాలస్ పట్టాదార్లు అని నాలుగు విధాలుగా ఉండేవాళ్లు. ప్రముఖులు సుబ్బారావు పంతులుగారు, మాదిరెడ్డి వెంటరత్నం నాయుడుగారు, మాకర్ల సుబ్బారావు నాయుడుగారు, చిత్రపు వెంకటాచలంగారు మొదలైనవారు. ఫస్ట్‌గ్రేడ్, సెకండ్‌గ్రేడ్ ప్లీడర్లలో నిడమర్తి దుర్గయ్యగారు, నేతి సోమయాజులు గారు, కనపర్తి శ్రీరాములు, ఏలూరు వెంకట్రామయ్య, గంజాం వెంకటరత్నం, కత్తికంటి పేర్రాజుల గారి ప్రభ జోరుగా సాగేవి. వీళ్లందరు జమీందార్ల ప్లీడర్లుగా ఉండేవారు. వాళ్ల ఫీజులు (ముల్లకుట్ల అచ్యుత రామయ్యగారికి ప్రత్యేకించి) ఏనుగుల మీద వేసుకొని తీసుకొచ్చేవారు. ఆనాటి వృత్తి స్థితి అది.
మన ప్రకాశంది గంభీరమైన రూపం. అందరినీ లోబరుచుకునే వ్యక్తిత్వం, ఆకర్షణీయమైన ప్రవర్తన. అన్నీ ఆ రోజుల్లో అందరినీ ఆకర్షించాయి. రాజమహేంద్ర వరానికి రావడం రావడం మద్రాస్ టచ్‌తో వచ్చారు. ‘చూశాను వచ్చాను గెల్చాను’ అన్న విధంగా కొద్ది రోజలలోనే మంచి ఫైలు, ఫీజు, పేరు సంపాదించగలిగారు. సరంజామా, ఆర్భాటం అన్నీ సమకూర్చుకున్నారు. తరువాత కాలంలో గుర్రం బండీ కొన్నాడు. క్రమేణా తన బీదతనం లేమి అంతా మాయమయ్యాయి. ఆదాయం పెరిగింది. బంధువర్గం పెరిగింది. మిత్రబృందం పెరిగింది. అమ్మను తన దగ్గరకు పిలుచుకున్నాడు. క్లయింట్ల విషయంలో మంచి పట్టుదల, కేసు విషయంలో పటిష్ట శోధన, మేజిస్ట్రేట్ల ధాటిని తట్టుకోగల తెగువ, తెగింపు, తెలివిగల ప్లీడరని పేరు పొందాడు. పెద్దపెద్ద ప్లీడర్లు కేసుకు 25 రూపాయలు తీసుకుంటే తాను నాల్గింతలు ఎక్కువ చార్జ్ చేసేవారు. ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్లు ‘లాభం లేదు’ అన్న కేసులు పంతులుగారి పరం అయ్యేవి. కానీ నిజంగా ఎవరైనా బీద కుటుంబాలు వస్తే చాలా తక్కువ ఫీజు తీసుకునేవారు. అవసరమైతే అసలు డబ్బులు తీసుకోకుండా తన ఖర్చుతో కేసులు గెలిపించేవారు. నాయుడుగారి కుటుంబాన్ని ఏనాడు, ఏ స్థితిలోనూ మరచిపోలేదు. నాయుడుగారి కుటుంబాన్ని శక్తివంచన లేకుండా సహాయం చేయగలిగే స్థాయికి చేరుకున్నందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి అని సంతోషించారు ప్రకాశంగారు.
తన వద్ద నౌకరీ చేసే సామాన్యుడి కొడుకు ఒక కేసులో ఇరుక్కున్నాడు. పైగా నేరం ఒప్పుకున్నాడు. నిజంగా ఆ దొంగతనం ఆ పిల్లవాడు చేయలేదు. ఈ కేసులో ఇంకో పిల్లవాడున్నాడు. వాడు నేరం ఒప్పుకోలేదు. చోరీ అయిన సామాను చూపించినందుకు ఒప్పుకున్నవాడికి సంవత్సరం, ఒప్పుకోని వాడికి 5 సం. శిక్ష పడింది. ఈ కేసు ప్రకాశంగారి దగ్గరికి వచ్చింది. ముద్దాయి తండ్రి తన దగ్గర నౌకరీ చేస్తున్న మూలాన అభిమానంతో డబ్బు తీసుకోకుండా పట్టుబట్టి హైకోర్టు దాకా తనే తీసుకెళ్లి ‘చోరీ జరిగిన సామాను చూపించినంత మాత్రాన, నేరం ఒప్పుకున్నంత మాత్రాన నేరం రుజువు కాదు’ అన్న పాయింట్ ప్రకాశంగారిది. దానికోసం ఇతర రిపోర్ట్ కాని కేసుల కోసం పుస్తకాలన్నీ తిరగవేసి శోధించి, ఒక కేసు సాధించాడు. ఆ కేసు తీర్పు చూపించడంతో వారిద్దరినీ విడుదల చేయడమైనది. దాంతో పంతులుగారి ప్రతిన నలుదిశలా వ్యాపించింది. ఆ ముద్దాయి తండ్రి ప్రకాశంగారు చూపించిన వాత్సల్యానికి ఆనంద బాష్పాలతో కాళ్ల మీద పడ్డాడు. పంతులుగారికి డబ్బే ప్రధానం కాదు. జీవితంలో దయ, త్యాగం, దానం, స్నేహం అనేవి ముఖ్యం అని చెప్పకనే చెప్పాడు. ఆచరించాడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం.
ఇలాగా రెండు చేతులా సంపాదిస్తూ నాలుగు చేతులా ఖర్చు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండగా రాజమహేంద్ర వరం మునిసిపల్ రాజకీయాలలో పడ్డారు ప్రకాశంగారు. ఆ రోజుల్లోనే మాగంటి లక్ష్మణదాసు కేసు. అది ‘అర్ధణా కేసు’గా ప్రాచుర్యం పొందింది. లక్ష్మణదాసు మంచి పలుకుబడి కలవాడు. ఒకసారి అతను టోల్‌గేటు ఫీజు ‘అర్ధణా’ ఇవ్వకుండా పోయి కాంట్రాక్టర్ మీద జబర్దస్తీ చేశాడని కేసు. ముందు బెంచ్ కోర్టులో కేసు పెట్టారు. పట్టుదలతో లక్ష్మణదాసుగారు వాదించడం చూసి పోలీసులు దానిని పెద్ద సమస్యగా మార్చి ఏలూరు సబ్‌కలెక్టర్ దగ్గర పెట్టారు. ఆ కలెక్టర్ కేర్షాప్ అనే పార్సీ. ఐఎఎస్. మొదటి నుంచి ముద్దాయిని వ్యతిరేక రిమార్కులు చేస్తుండడం వలన, అతను కేసు విచారించకూడదని హైకోర్టుకు అప్పీలు చేశారు ప్రకాశంగారు. కానీ 500 రూ. జరిమానా, ఇంకా శిక్ష కూడా వేసేటట్టు గ్రహించి పంతులుగారు అడుగడుగునా పిటిషన్లు పెట్టి విసిగించారు. అందునా రాజమహేంద్ర వరం జిల్లా కోర్టుకు కేసు వచ్చింది. ఎవరో సీనియర్ లాయర్‌తో కేసు నడిపిస్తే కింది కోర్టు శిక్ష ఖాయం అయింది. అలా కేసు వదలకుండా హైకోర్టుకు అప్పీలు చేయించి తానే స్వయంగా కృషిచేసి కేసు గెలిపించాడు. ‘..దాంతో నా పేరు అటు వైపు బాగా పాకింది. ప్లీడరీలో మొదటి నుంచి కూడా స్వతంత్రత చూపిస్తూ, సీనియర్లనే వాళ్లనట్టే లక్ష్య పెట్టకుండా తొందరగా ప్రాక్టీస్ సంపాదించడం వల్ల, తోటి ప్లీడర్ల అసహనానికి పాత్రుణ్ణి అయ్యాను. తత్ఫలితంగా కొందరు ప్లీడర్లు నా మీద కక్ష కట్టారు. కానీ దానికి కారణమేమీ లేదని నా నమ్మకం. అందులో ముఖ్యులు నేతి సోమయాజులు, ముల్లకుట్ల అచ్యుత రామయ్యగార్లు... కక్ష సాధించడానికి ఏ పని చేయడానికైనా సందేహించలేదు.
సమం దొరికిందని నేతి సోమయాజిగారు, ఆయన గవర్నమెంట్ ప్లీడరు అయినందున ఒక కేసులో ముద్దాయి తరఫున వాదిస్తున్న ప్రకాశం గారిని తన వింత పద్ధతిని అవలంబించి, ప్రభుత్వ పలుకుబడిని దుర్వినియోగం చేసి ప్రకాశాన్ని సాక్షిగా కోర్టులో పిలిచాడు. సాక్ష్యం చెప్పించుకొని అది అబద్ధ సాక్ష్యం అని వాదించి ప్రకాశంగారి మీద ప్రాసిక్యూషన్ కోసం పిటిషన్ పెట్టాడు. రాజమహేంద్ర వరం కేసుల చరిత్రలో ఒక ప్లీడర్ ఇంకొక సాటి ప్లీడర్‌ని ఇలాగ బోనులో నిలబెట్టి కక్ష సాధించడం మునుపెన్నడూ జరగలేదని, అది ఒక అపూర్వ విషయంగా రాసుకున్నారు పంతులుగారు -తన స్వీయ చరిత్ర ‘నా జీవిత యాత్రలో’. గవర్నమెంట్ ప్లీడర్‌గా తన పలుకుబడి, పరువు ప్రతిష్టలు ఉపయోగించి మేజిస్ట్రేట్‌ని స్వాధీనపరచుకున్నాడు. లోగడ లక్ష్మణదాస్ కేసులో ప్రకాశంగారు తికమక పెట్టిన కేర్షాఫ్‌గారు రాజమహేంద్ర వరానికి సబ్‌కలెక్టర్. ఇంక ఏముంది? అందరూ ప్రకాశంగారికి శిక్ష తప్పదని. కానీ ప్రకాశంగారు తను తప్పు సాక్ష్యం చెప్పలేదని, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ఎదుర్కోగలనని అనుకున్నారు. అదీ ప్రకాశం అంటే.
..ప్రకాశంగారిని చూడగానే కేర్షాఫ్‌గారు ముందుగా అడిగిన ప్రశ్న ‘ఏమండీ ఈ కేసు విచారించడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఏలూరు సమాచారం వల్ల మీకు నా మీద ఏమైనా అనుమానం ఉందా?’ ప్రకాశంగారు చూపిన ఉత్కృష్టత. ‘నాకు అలాంటి సంకోచం ఏమీ లేదు. కేసులో విచారణ న్యాయంగా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది’. ప్రసన్నుడైన కలెక్టర్‌గారు ప్రకాశంగారిని మనస్సులోనే ధన్యవాదాలు తెలుపుకొని నిజంగానే విచారణ న్యాయపరంగా జరిపి పంతులుగారు నిర్దోషి అని తీర్పునిచ్చారు. పైగా ఇలాంటి అభూత కల్పనాయుతమైన కేసు ఎన్నడూ జరగలేదని, గవర్నమెంట్ ప్లీడర్ తన పలుకుబడి దుర్వినియోగం చేశాడని’ రాశాడు.
ఇలాంటి ఎన్నో పన్నాగాలను ధ్వంసం చేస్తూ, ప్రతిపక్ష ప్లీడర్లను బోల్తా కొట్టిస్తూ, కేసుల విషయంలో వారిని చీల్చి చెండాడేవారు ప్రకాశంగారు. అయితే తను చేస్తున్నది న్యాయపరమేనని, ఒక నమ్మకం ఆజన్మాంతము ఆయనకుండేది. అచిరకాలంలోనే రాజమహేంద్రవరం నగరంలో ప్రముఖులలో అగ్రతాంబూలం అందుకున్నారు. ఇకనే మునిసిపాలిటీ రాజకీయాలు, ఆనాటి స్థితిగతులు, నగర పాలనా విషయాలలో జరుగుతున్నటువంటి అవకతవకలూ పంతులుగారిని ఆకర్షించాయి. అనేకానేక ఒడిదుడుకుల తరువాత ఎత్తులకు పైఎత్తుల తరువాత ఎదుటి వారి తంత్రాలు మంత్రాలు, కుతంత్రాలను ఛేదించి రాజమహేంద్రవరం మునిసిపల్ చైర్మన్‌గా గెలిచారు. తరువాత ఒకానొక అనూహ్యమైన సంఘటనతో బారిస్టర్ ప్రకాశం అయినారు.

-టంగుటూరి శ్రీరాం 9951417344