కండరాల బలహీనతకి ఉపవాస వైద్యం
Published Saturday, 28 July 2018
ఫ్రశ్న: కండరాలు చచ్చుబడిపోతున్నాయి. నరాలు దెబ్బతిన్నాయని, మల్టిపుల్ స్క్లీరోసిస్ వ్యాధి అని చెప్పారు. మందులు లేవని చెప్పారు. ఏదైనా ఉపాయం ఉందా?
జవాబు: పోలీసుల లాఠీచార్జ్ జరిగినప్పుడు గాయపడ్డవాళ్లలో అసలు దుండగులు ఉండకపోవచ్చు. దారినపోయేవాళ్లు, ఆ సంఘటనతో సంబంధం లేనివాళ్లకు ఎక్కువ దెబ్బలు తగులుతుంటాయి. ఇది లోకసహజం. మన శరీరంలోనూ ఇలాంటి పోలీసు తరహా వ్యవహారమే నడుస్తుంటుంది. మన శరీరానికి సరిపడని పదార్థాన్ని తీసుకున్నప్పుడు శరీరంలోని రక్షణ వ్యవస్థ పోలీస్ తరహాలోనే శత్రువుపైన దాడికి సిద్ధపడుతుంది. శరీరానికీ, శత్రువుకూ మధ్య యుద్ధం కారణంగా శరీరంపైన అనేక వ్యాధి లక్షణాలు కలుగుతాయి. అవి ఎలర్జీ లక్షణాలు కలగటానికి కారణం అవుతాయి. ఇది ఒక అంశం. రెండో అంశం ఇంకొకటి ఉంది. పోలీసు దెబ్బలు దారినపోయేవారికి తగిలినట్టు, శరీర రక్షణ యంత్రాంగం దెబ్బలు నరాలకు, ఇతర కణాలకు తగిలే ప్రమాదం ఉంది. అలా దెబ్బతిన్న నరాల వ్యాధినే మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే వ్యాధిగా చెప్తారు. పరోక్షంగా ఇది ఎలర్జీ వ్యాధిలాంటిదేనన్నమాట.
కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన నరాలపైన ఉండే మయలిన్ పొర దీనివలన గాయపడుతుంది. గాయం మానినప్పుడు అక్కడ మచ్చ (స్కార్) పడుతుంది కదా. గాయపడ్డ ఈ మయలిన్ పొరమీద క్రమేణా మచ్చలు ఏర్పడతాయి. సమాచార వ్యవస్థ కొనసాగింపునకు ఈ పొర అవసరం చాలా ఉంది. మచ్చ ఏర్పడినప్పుడు మెదడు నుండి శరీరానికి, శరీరం నుండి మెదడుకు సమాచార మార్పిడి సక్రమంగా జరగదు, దానివలన శరీరంలో కొంత భాగం మొద్దుబారటం నుండి పక్షవాతం వరకూ అనేక లక్షణాలు కలగవచ్చు. నరాల్లో అనేకచోట్ల ఇలా మచ్చలు ఏర్పడతాయి. ‘స్కార్ టిష్యూ ఇన్ మల్టిపుల్ ఏరియాస్’. కాబట్టి దీన్ని ‘మల్టిపుల్ స్క్లీరోసిస్’ అంటారు. అనేక మచ్చల వ్యాధి అని దీని భావం. కండరాలకు నాడీ సమాచారం అందక పోవటం వల్ల కండరాల బలహీనత ఏర్పడటం దీనిలో ముఖ్య లక్షణం.
మల్టిపుల్ స్ల్కీరోసిస్ వ్యాధిలో ఆహారవైద్యం ప్రయోజనాల గురించి ఇటీవల వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వైద్య విభాగం సెయింట్ లూరుూస్ మరియు జాక్సన్ లేబొరేటరీ వారు పరిశోధన చేసి ఒక నివేదికనందించారు. ఆహార నియమాల ద్వారా మల్టిపుల్ స్ల్కీరోసిస్ వ్యాధిపైన ప్రభావం ఉంటుందని ఈ నివేదికను రూపొందించిన డా. పిస్సియో, డా. యాంజియోజోహ్ అనే శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఆహార జాగ్రత్తలంటే పెద్ద విషయాలేమీ కావని, మధ్యమధ్య ఉపావాసాలు ఉండటం వలన కండరాల బలహీనత వ్యాధిలో మెరుగుదల గమనించామని వీరు ప్రకటిస్తున్నారు. ఆహార విధానం(డైట్ స్టైల్)లో మార్పు కావాలని వారు చెప్తున్నారు. పరిమిత ఉపవాస విధానం (లిమిటెడ్ ఫాస్టింగ్ రెజిమెన్) అవసరం అంటున్నారు. శరీరానికి సరిపడని ఆహారంతో మొదలైన ఈ కథని ఆహారంలో శరీరానికి సరిపడేవాటిని మాత్రమే తీసుకోవటం ద్వారా ముగించాలన్నమాట.
ప్రతీరోజూ కూర, పప్పు, పులుసు, పచ్చడి ఇంకా అనేక రకాల ఆహార పదార్థాలను మనం తీసుకుంటూ ఉంటాం. వీటిలో శరీరానికి సరిపడేవి, సరిపడనివీ గుర్తించటం తేలికైన విషయం ఏమీ కాదు. షెర్లాక్ హోమ్స్ తరహాలో పరిశోధించి ఆ దొంగని పట్టుకోగలగాలి. అయినా సరిపడనివి ఏవో తేలకపోవచ్చు.
నరాలలో ఏర్పడిన ఈ లోపాన్ని, దానివల్ల కలిగిన కండరాల బలహీనత, పక్షవాతం, కదలలేని స్థితిలాంటి లక్షణాలని అదుపు చేయటానికి తరచూ కనీసం ఒకపూట ఏమీ తినకుండా ఉపవాసం చేయటం మంచిది. ఆ మేరకు పడని పదార్థాలను ఆపటం సాధ్యమవుతుంది కదా! గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వరస్వామి.. ఇలా దేవుడు పేరు చెప్పి రాత్రి పూట ఉపవాసాలుంటే మంచిదే! ఇతర ఎలర్జీ వ్యాధులున్న వారికి కూడా మంచిది. కానీ ఆ పూట అన్నానికి బదులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీల్లాంటివి తినటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సరిపడని పదార్థాలు మన టిఫిన్లలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే పండ్లు కూడా కొన్ని సరిపడకపోవచ్చు. అందుకని వారంలో ఒకటి లేదా రెండుసార్లు రాత్రి పూట పూర్తి నిరాహారంగా ఉండగలిగితే మంచిది.