‘గానసభ’కు ప్రణామం
Published Saturday, 11 August 2018**శ్రీ త్యాగరాయ గానసభలో ఎన్నో అత్యాధునిక హంగులతో కూడిన వేదికలు, అత్యంత రమణీయంగా కనిపించే చిత్రపటాలు, నిరంతర సన్మానాలు, సత్కారాలు, గానామృతాలు, సప్తాహాలు, మహానుభావుల జయంతులు, వర్థంతులు, గ్రంథావిష్కరణలు, దీపాలంకారాలు.. నిత్యం ఉత్సవమే ఇక్కడ. వీటన్నిటికీ తోడు తలపై మణిమయ కిరీటంలా ‘్భరతరత్న’ల తైలవర్ణ చిత్రాలు.
త్యాగరాయ గానసభలో ఐదు వేదికలు, ఒక ప్రధాన వేదికతోపాటు నాలుగు ఉచిత వేదికలున్నాయి. సంవత్సరంలో దాదాపు 1,500 కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేశంలోనే ఏకైక సంస్థ ఇది.
=================================
గొప్ప కళా ప్రదర్శనలు:
ఈ సభలో ఎందరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళి, హేమమాలిని, నూకల చినసత్యం, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎం.ఎస్.రామారావు వంటి ఎంతోమంది ప్రాతఃస్మరణీయ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలిచ్చారు. ఈ వేదికపై గత ఐదు దశాబ్దాలుగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తులు, సినీ నటులు, ఎంతోమంది రాజకీయవేత్తలు వచ్చి దీని దర్శనంతో పునీతులయ్యారు.
ఆలయం:
ఇక్కడ అడుగు పెట్టగానే 32 అడుగుల ఆంజనేయ స్వామి అభయమిస్తాడు. అక్కడే దేవాలయంలో సీతారాములు, లక్ష్మణస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి.
దశాబ్దాల కళాసేవ:
గత 52 ఏళ్లుగా త్యాగరాయ గానసభ కళాసేవకే అంకితమైనది. 52 ఏళ్లుగా ప్రభుత్వం నగదు, అవార్డు ఏమీ ఇవ్వలేదు త్యాగరాయ గానసభకు. ఏ ప్రోత్సాహం, ఆలంబన ఇవ్వలేదు. అయినా అలుపెరుగని కార్యకర్తలా, అలసిపోని గడియారం ముల్లులా ఎండలో వానలో కళాసేవ చేస్తూనే ఉంది. కేవలం మెయిన్ హాలుకు మాత్రం వీరు ఫీజు తీసుకుంటున్నారు. మిగిలిన నాలుగు వేదికలు కూడా సంవత్సరం పొడుగునా ఉచితంగా కళాకారులకు, కళాసేవకూ అంకితమైనాయి. 1967లో కళాసుబ్బారావుగారు, గుండవరపు హనుమంతరావుగారు, చెరువు పార్థసారథిగారు, దయానందరావుగారు తదితర పెద్దలు దీనిని నిర్మించ తలపెట్టారు.
ఉత్సవాలు:
త్యాగరాయ గానసభ స్వర్ణోత్సవాల సందర్భంగా మన భాష, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన భారతరత్నలు, వాగ్గేయకారుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉగాది ఉత్సవాలు, వసంత నవరాత్రి, దసరా ఉత్సవాలు, సాహితీ సభలు, గ్రంథావిష్కరణలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి.
కళకే అంకితం:
శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్.జనార్దనమూర్తిగారు. ఇంతకు ముందు వీరి తండ్రి కళాసుబ్బారావుగారు, అన్న కళాదీక్షితులు కూడా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సభకు సెక్రటరీ కళాదీక్షితులు గారి సతీమణి శ్రీమతి కళా శారద. వీరందరికీ కళాకారులు ఎంతో రుణపడి ఉన్నారు.
*