ఫిల్మ్నగర్ గణనాథునికి 500 కిలోల లడ్డూ
Published Thursday, 13 September 2018* తాపేశ్వరం నుండి తరలివెళ్లిన భారీ ప్రసాదం
మండపేట, సెప్టెంబర్ 12: ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూ తయారీ సంస్థ తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ వినాయక చవితిని పురస్కరించుకుని తయారుచేసిన 580 కిలోల భారీ లడ్డూ హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో నెలకొల్పిన భారీ గణనాథునికి ప్రసాదంగా సమర్పించడానికి బుధవారం తరలించారు. మంగళవారం ఉదయం ప్రారంభించిన ఈ లడ్డూ తయారీ సాయంత్రానికి పూర్తికాగా, బుధవారం సూక్ష్మకళాకారులచే తుది మెరుగులు దిద్దుకుంది. అనంతరం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు దంపతుల పూజల అనంతరం మేళతాళాలతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలివెళ్లింది. గురువారం ఉదయం చవితి రోజున ఈ లడ్డూను గణనాథుని చేతిలో నైవేద్యంగా ఉంచుతారని, వారం రోజులపాటు గణేష్ సన్నిధిలో ఉంచిన అనంతరం లడ్డూను ప్రసాదంగా అక్కడి ప్రజలకు పంచుతారని మల్లిబాబు తెలిపారు. అక్కడ ఏర్పాట్లు సురుచి పీఆర్వో వర్మ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.