హడలెత్తిస్తున్న ఏనుగుల గుంపు
Published Thursday, 13 September 2018గరుగుబిల్లి, సెప్టెంబర్ 12: కొద్దిరోజుల నుంచి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలాన్ని హడలెత్తించిన ఏనుగుల గుంపుబుధవారం ఉదయం గరుగుబిల్లి మండలం గిజబ సమీపానికి చేరాయి. గ్రామానికి అతి సమీపంలోని పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరటితోటలో తిష్టవేశాయి. దీంతో ఉదయం కొంత సమయం ఈ రహదారిపై ప్రయాణికులు, వాహనాలను అటవీశాఖ అధికారులు నిలిపివేశారు. రక్షణ చర్యలు చేపట్టిన అనంతరం వాహనాల రాకపోకలు కొనసాగాయి. ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి బొమ్మిక, ఇటిక, పెదకొదమ వరకు వచ్చి బుధవారం ఉదయానికి గిజబకు చేరాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న ఫారెస్టు, రెవెన్యూ, పోలీస్శాఖాధికారులు హుటాహుటిన గిజబకు వచ్చారు. పార్వతీపురం ఆర్డీవో బి. సుదర్శనదొర గిజబ గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అరటితోటలోకి వెళ్లకముందు ఏనుగుల గుంపు ఎడమ మట్టికట్టవైపు వెళ్లినప్పటికీ అక్కడ జనాలు ఉండటంతో తిరిగి అరటితోటలోకి వచ్చి తిష్టవేశాయి. అంతకుముందు గ్రామ సమీపంలోని వరి పంటలను నాశనం చేశాయి. మధ్యాహ్నం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా, జిల్లా అటవీశాఖాధికారి, ఆర్డీవోలు పరిస్థితిని సమీక్షించారు. తహశీల్దార్ డి ఎల్లారావు, ఫారెస్టు, పోలీస్శాఖాధికారులు ఏనుగుల గుంపు ఉండే అరటితోటవైపు వెళ్లవద్దని సూచించారు. సమీప గ్రామ ప్రజలు పంట పొలాలవైపు వెళ్లవద్దని మైక్ ద్వారా ప్రచారం చేశారు. మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఏనుగుల గుంపు బాసంగి వైపు తరలివెళ్లాయి. అటవీప్రాంతంలోని ఏనుగులు మైదాన ప్రాంతానికి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చిత్రాలు.. గిజబ గ్రామ సమీపంలోకి వస్తున్న గజరాజులు
*రహదారిపై ప్రజలు సంచరించ వద్దంటూ ప్రచారం చేస్తున్న అటవీశాఖ సిబ్బంది