దుష్టపాలనకు ఇక చరమగీతం
Published Friday, 21 September 2018గుంటూరు, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో సాగుతున్న దుష్టపాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసగించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే తెలంగాణలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తుపెట్టుకోవడం ఆయన ఆశయాలకు తిలోదకాలివ్వడమేనని అన్నారు. శాసనమండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారికి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.