‘టీడీపీ వెంటే బీసీలు’
Published Friday, 21 September 2018రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో బీసీవర్గాలెప్పుడూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు.
వచ్చే నెలలో నిర్వహించనున్న బీసీ మహాసభకు సభాస్థలి ఎంపిక గురించి శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. బలహీనవర్గాల కోసం ప్రభుత్వం వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అవి వారికి చేరేలా చూస్తోంధన్నారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే వేదికగా రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న బీసీ మహాసభ ఉపయోగపడుతుందన్నారు. మంత్రుల వెంట రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.