నిందితులకు 100 మొక్కల శిక్ష!
Published Saturday, 22 September 2018న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఓ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు అసాధారణమై తీర్పును ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇరువురు వ్యక్తులు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే కోర్టు జోక్యం చేసుకుని ఇద్దరూ నగరంలో వంద మొక్కలు నాటాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ పనిచేస్తే సమాజానికో మంచి సందేశం ఇచ్చినవారవుతారని ఇద్దర్నీ ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.ఆ ఇరువురు వ్యక్తులపై నమోదైన నేరారోపణలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన న్యాయమూర్తి నజ్మీ వజీర్ ‘కేసులు ఉపసంహరించుకోవాలని పరస్పరం ఓ అంగీకారానికి వచ్చారు. కేసులు ఉపసంహరించుకుంటామని తెలిపినందున ఎఫ్ఐఆర్ రద్దవుతుందని సమస్య పరిష్కారమైపోయినట్టేనని న్యాయమూర్తి అన్నారు. ఢిల్లీలో చెరో 50 మొక్కలు నాటాలని కోర్టు సూచించింది. ఉద్యానవన శాఖ డైరెక్టర్ దీనికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వికాస్పురిలోని డిస్ట్రిక్ పార్క్ వద్ద 50 మొక్కలు నాటాలని, దీనికి సంబంధించి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని జడ్జి ఆదేశించారు. ఈనెల 26 ఉదయం 11 వారిద్దరికి మొక్కలునాటే పని అప్పగించాలని నజ్మీ తెలిపారు.