నియోజకవర్గంలో రసమయి చేసింది శూన్యం
Published Saturday, 22 September 2018శంకరపట్నం, సెప్టెంబర్ 21: మానకొండూర్ మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఆట, పాటలతో నాలుగు సంవత్సరాల మూడు నెలలు కాలం గడిపాడే తప్పా.. మానకొండూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు శూన్యమేనని కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అద్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం ఎన్నికల సంఘానికి విరుద్ధమని తెలిసినప్పటికీ మానకొండూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో రసమయి హామీలు ఇస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలతో ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు చేయని పనులు, ఇవ్వని హామీలు ఇప్పుడెందుకు ఇస్తున్నారని? అవగాహన లేకనా? లేదా ఓటమి భయమా? రసమయికి తట్టుకుందని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శిస్తున్నారని, అందులో భాగంగానే మానకొండూర్లో ప్రజల నుంచి ఆదరణ రోజు రోజు తమ పార్టీకి లభిస్తుందని, ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్కు మంచి దెబ్బ తగిలించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని, ఇప్పటికైనా రసమయి బాలకిషన్ కనువిప్పు చేసుకొని మాయ మాటలు, మోసపూరితమైన ప్రకటనలు చేయకుండా నియోజకవర్గంలో మెదులుకుంటే బాగుంటుందని మోహన్ హెచ్చరించారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చౌడమల్ల వీరస్వామి, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, నాయకులు గుగ్గిళ్ల కుమార స్వామి, బొజ్జ రవి, గుర్రం సదానందం, డిష్ సది, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.