ఫేవరిట్ టీమిండియా
Published Saturday, 22 September 2018దుబాయ్, సెప్టెంబర్ 22: ఆసియా కప్లో ఫేవరిట్గా బరిలోకి దిగిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. ఇప్పటికే ఆడిన గ్రూప్ మ్యాచ్లలో మూడింట్లో విజయం సాధించిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆదివారం జరిగే మ్యాచ్లో ఫేవరిట్ ముద్రతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ను టీమిండియా అంత ఈజీగా తీసుకోవడంలేదు. ప్రత్యర్థి టీమ్ కూడా బలంగా ఉండడంతో ఆచితూచి ఆడేందుకు భారత్ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇప్పటికే మూడు జట్లతో జరిగిన మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా సూపర్ ఫోర్ మ్యాచ్లో పాక్పై ఆధిపత్యం సాధించడం ద్వారా ఫైనల్లోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది. మూడు రోజుల క్రితం పాక్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఫైనల్లో పోరు కోసం తలపడుతున్న నేపథ్యంలో జాగురూకతతో ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వవచ్చునని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల కిందట పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని లోటును భర్తీ విజయవంతంగా భర్తీ చేశాడు. ఈ మ్యాచ్ ప్రత్యర్థి తమ ముందు ఉంచిన పరిమిత లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించడమే కాకుండా 21 ఓవర్లు మిగిలి ఉండగానే ఘన విజయాన్ని భారత్ అందుకుంది. పాక్తో జరిగిన మ్యాచ్లో మంచి ఆటతీరుతో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ అదే ఉత్సాహంతో ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ 83 పరుగుల తేడాతో ఏడు వికెట్లతో ఘన విజయం సాధించడంలో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా హాంగ్కాంగ్ జట్టుతో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా జట్టును సమర్ధవంతంగా నడపడంలో కృతకృత్యుడయ్యాడు. రోహిత్ శర్మకు తోడుగా జట్టులోని మరో ఓపెనర్, స్టయిలిష్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ గడిచిన మూడు మ్యాచ్లలోనూ అద్భుతంగా రాణించడంతోపాటు హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ నమోదు చేయడం గమనార్హం. అదేవిధంగా జట్టులోని మిడిలార్డర్ ద్వయం అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ సైతం తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ఆదుకోవడంలో తమదైన పాత్రను పోషించారు. బౌలర్ కేదార్ జాదవ్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లోనూ రాణించి తానేమిటో నిరూపించుకున్నాడు. ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మళ్లీ ఫామ్లోకి రావడంతో ఆదివారం భారత్తో జరిగే మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందులు తప్పవని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియాలో పేసర్ల ద్వయం భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ల ద్వయం యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థిని కట్టడి చేయడంలో దిట్టలే. ఇక దాయాది పాకిస్తాన్ విషయానికొస్తే ఆల్రౌండర్ షోయబ్ మాలిక్పై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. భారత్తో జరిగిన గత మ్యాచ్లో షోయబ్ మాలిక్ 43 పరుగులు చేశాడు. అదేవిధంగా శుక్రవారం రాత్రి అఫ్గానిస్తాన్తో జరిగిన మరో మ్యాచ్లో జట్టును ఆదుకున్నాడు. అదేవిధంగా ఓపెనర్ ఫకార్ జమాన్ గత ఏడాది భారత్తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీ నమోదు చేయడమే కాకుండా తమ జట్టును గెలిపించే కీలక బాధ్యతలను తలకు ఎత్తుకున్నాడు. ఆదివారం భారత్తో జరిగే పోరులో ఫకార్ జమాన్తోపాటు బ్యాట్స్మెన్లు బాబర్ ఆజమ్, సర్ఫ్రాజ్, ఇమాన్-ఉల్-హక్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, స్ట్రయిక్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ భారత్, ఆఫ్గానిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్లలో నిరాశపరచడంతో పాక్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నా హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్ వంటివారు జట్టును నడిపించగలరనే విశ్వాసం, నమ్మకంతో ఉంది.