బురద రోడ్లపైనే జగన్ పాదయాత్ర
Published Sunday, 23 September 2018విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో మరో రోజు మాత్రమే కొనసాగనుంది. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో కొనసాగుతున్న పాదయాత్ర శనివారం ఉదయం కోలవానిపాలెం నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర భీమన్నదొరపాలెం, ఎర్రవానిపాలెం, రామవరం మీదుగా గండిగుండం జంక్షన్కు చేరుకుంది. దారిపొడవునా జగన్ స్థానికులను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. పూర్తి పల్లె వాతావరణంలో మట్టి రోడ్ల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జగన్ పాదయాత్ర చేసిన గ్రామాల్లో మట్టిరోడ్లు బురదమయమయ్యాయి. అయినప్పటికీ జగన్ ఇదే మార్గంలో పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర సందర్భంగా స్థానికులు చెప్పే సమస్యలను సావధానంగా విన్నారు. శనివారం నాటి పాదయాత్ర పూర్తిగా భీమిలి నియోజకవర్గంలో కొనసాగింది. విశాఖ జిల్లాకు సంబంధించి చివరి రోజు ఆదివారం పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ జంక్షన్, పాత్రులపాలెం, రాయవరపువాని పాలెం, సరిపల్లి కాలనీ మీదుగా చింతలపాలెం వద్ద విజయనగరం జిల్లాలో యాత్ర ప్రవేశిస్తుంది.
చిత్రం..పాదయాత్రలో మహిళ నుంచి వినతిపత్రం అందుకుంటున్న జగన్