జగన్ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు
Published Monday, 24 September 2018కొత్తవలస,సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర సోమవారం జిల్లాలో ప్రారంభం కానుంది. యాత్రకు జిల్లాలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్యాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా జ్ఞాపికగా భారీ పైలాన్ను నిర్మించారు. కొత్తవలస మండలం చింతపాలెం వద్ద జగన్యాత్ర జిల్లాలోకి అడుగిడుతోంది. జగన్ యాత్రను విజయంతం చేసేందుకు వైసీపీ నేత బొత్స ఆధ్వర్యంలో కార్యవర్గం అంతా కృషి చేస్తున్నారు.
ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంకల్పయాత్ర వివరాలను జిల్లా కన్వీనర్ మజ్జిశ్రీనివాసరావు వెల్లడించారు. బొత్స, రాష్ట్ర కార్యదర్శి రఘరామ్, గుడివాడ అమరనాధ్లు ఏర్పాట్లన పరిశీలించారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు జగన్ చింతపాలెంలో అడుగుపపెడతారని తెలిపారు. అక్కడనుండి దేశపాత్రునిపాలెం వరకు పాదయాత్ర చేస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన పైలాన్ను జగన్ ప్రారంభిస్తారు. దేశపాత్రునిపాలెంలోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం మంగలపాలెం మీదుగా కొత్తవలస చేరుకొంటారు. సాయంత్రం సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కొత్తవలస జంక్షన్లో బహిరంగసభ ఉంటుందని చెప్పారు. రాత్రికి తుమ్మికాపల్లిలో బసచేస్తారని చెప్పారు. మంగళవారం తుమ్మికాపల్లి బయలుదేరి నిమ్మలపాలెం, అప్పన్నపాలెం, గంగుబూడి మీదుగా ఎల్.కోట మండలంలోకి అడుగుపెడతారని అన్నారు. లక్షల్లో కార్యకర్తలు హాజరుకావాలని, జగన్యాత్రను దిగ్విజయం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని గ్రామాలనుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. ఇది ఇలా ఉండగా అరుకు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్యాత్ర దృష్ట్యా నిఘాను పెంచారు. సమావేశంలో నియోజకవర్గ నాయకులు కడుబండి శ్రీనివాసరావు, నెక్కల, రొంగల జగన్నాధం, శివ, మేలాస్ర్తీ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.