S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగువారి పది రోజుల పండగ

హిందువులకు అత్యంత ముఖ్యమైన శక్తి ఆరాధనకు ప్రాధాన్యతు ఇచ్చే పండగ దసరా. శరదృతువు ఆరంభంలో జరుపుకుంటుంన్నందున శరన్నవరాత్రులుగా చండీ ఉత్సవాలు నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయ దశమిని కలిపి దసరా అంటారు. దైత్య వంశంలో జన్మించిన ‘‘మహిషాసురుడు’’ మరణం లేని జీవితం కోసం మేరు పర్వత శిఖరం చేరి, బ్రహ్మ గురించి ఘోర తపస్సుచేయగా, సృష్టికర్త ప్రత్యక్షమై, వరం కోరుకొమ్మన్నపుడు, తనకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని కోరగా, జనన మరణాలు ప్రతి ప్రాణికి సహజ ధర్మాలని, ఇది ప్రకృతి విరుద్ధం కనుక మృత్యువుకు ఒక మార్గం వదిలిపెట్టి, మరే వరమైనా కోరుకొమ్మనగా, అందుకు మహిషాసురుడు ఆడది అబలయైనందున, పురుషుని చేతిలో మరణం సంభవించకుండా వరం అనుగ్రహించమని ప్రార్థించి, అనుగ్రహం పొందాడు. బ్రహ్మవరంతో బలగర్వితుడై, దేవతలను యుద్దంలో ఓడించి, ఇంద్ర పదవి చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా, మహిషునిపై వారికి కలగిన క్రోధాగ్ని ప్రకాశవంత తేజంగా మారి, కేంద్రీకృతమై, ఒక స్ర్తిరూపు దాల్చింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా అవతరించినది 18బాహువుల మంగళమూర్తి. ఆమెకు శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, బ్రహ్మ అక్షరమాల, కమండలమును, హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమకూర్చారు. సర్వదేవాతాయుధాలతో దేవి మహిషునితో భీకర పోరు సల్పి, మహిషుని పక్షాన గల ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని హతమార్చి, అనంతరం మహిషి రూప అసురుని తొమ్మిది రోజులు పోరు సల్పి పదవరోజు సంహరించినది. అప్పటి నుండి మహిషుని సంహరించిన దినం దసరా పర్వంగా జరుపబడుతున్నది. మహాలయ పక్షం యుద్ధ పక్షం కాగా, దేవాసుర యుద్దంలో దేవతలు (ఆర్యులు) ఓడి తొమ్మిది దినాలు తమ ఇష్టదైవాలను ప్రార్థించారు. నవరాత్రుల పూజల వల్ల ఆర్యులందరికీ విజయ దశమి నాటికి గొప్ప ఆవేశం వచ్చి, వారంతా తిరిగి ఏకమై, ఉత్తరాషాఢ - శ్రవణా నక్షత్రాల మద్య భాగాన అభిజిత్తున రాక్షసులపై దాడి చేసి పూర్తిగా ఓడించి, విజయం పొందిన దశమియే విజయ దశమి అయింది. ప్రాచీన కాలం నుండీ ఆర్యులు విజయ దశమిని పండువగా జరుపుకున్నారు. ప్రధానంగా రాజులు విజయ యాత్రకోసం ‘‘అగ్నిపూజ, గుర్రాలు, ఏనుగులు’’ మొదలైన వాటికి పూజలు చేయడాన్ని ఆచరించారు. సంబంధిత కొన్ని విశేషాలను కాళిదాసు రఘువంశ కావ్యంలో సూచించారు. ‘‘శ్రౌతాగ్నిని మధించుటకై , జమ్మికొమ్మ అవసరమైంది. అరణులలో అడుగు కర్ర జమ్మికర్ర. పై కర్ర రావికర్ర వాడారు. జమ్మిని స్ర్తిలింగంగా, రావిని పుంలింగంగా ఆర్యులు పేర్కొన్నారు. అగ్ని శమీ గర్భాన కలదని (శమీగర్భాదగ్నింమన్థతి) అని శ్రుతి వచనం. కనుకనే శమీ పూజకు ప్రాధాన్యత ఏర్పడింది. విజయ దశమి నాడు శమీవృక్ష దర్శన సమయాన ‘‘శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ’’ అనడాన్ని బట్టి రామార్జున గాధల సంబంధం స్పష్టం అవుతున్నది. రాముడు, రావణునిపై విజయ సాధించిన దినంగా, పాండవులు వనవాసం వెళుతూ, శమీవృక్షం పైనుండి తమ ఆయుధాలను తిరిగి పొందిన దినంగా విజయ దశమికి ప్రత్యేకత ఉంది. కృత యుగాన సుకేతుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్య భ్రష్టుడై, భార్యతో కూడి అడవులలో సంచరిస్తుండగా, అంగీరస రుషి, ఆయనకు నవరాత్రి పూజా విధులను ఉపదేశించగా, మహర్షి ఉపదేశించిన విధంగా పూజలు చేసి, సుకేతడుడు తిరిగి ఐశ్వర్యాలు పొందినట్లు ఐతిహాసికాధారం. దుర్గ, లక్ష్మి, సరస్వతిలలో ఒక్కొక్కొ దేవిని మూడేసి దినాలు పూజించే ఆచారం ఉంది. తొమ్మిది రోజులు పూజించడానికి వీలు కాకుంటే మహా నవమి అని, సరస్వతి పూజా దినం అని, ఆయుధ పూజా దినమని, మరునాడు విజయ దశమి జరుపుకోవడం సంప్రదాయ సిద్దంగా వస్తున్నది.

-రామకిష్టయ్య