పుంజుకున్న రూపాయి
Published Tuesday, 13 November 2018ముంబయి, నవంబర్ 13: రూపాయి మంగళవారం బలపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని, 72.67 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, స్థూలార్థిక గణాంకాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండటం వంటి అంశాలు రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక పీపాకు 70 డాలర్ల కన్నా దిగువకు పడిపోయింది. ఫలితంగా దేశ కరెంటు ఖాతాలోటు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు అంశాలు సానుకూలంగా ఉండటం రూపాయి సెంటిమెంట్ను బలోపేతం చేసింది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో 13 నెలల కనిష్ట స్థాయికి తగ్గడం కూడా రూపాయి బలపడటానికి దోహదపడింది. భారత క్యాపిటల్ మార్కెట్లలోకి తాజాగా విదేశీ పెట్టుబడులు తరలిరావడం, కొన్ని విదేశాల కరెన్సీలతో మారకం విలువలో అమెరికన్ డాలర్ విలువ పడిపోవడం కూడా మంగళవారం రూపాయి బలపడటానికి తోడ్పడింది. ఇంటర్బ్యాంక్ ఫోరెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్తో రూపాయి మారకం విలువ 72.81 వద్ద ప్రారంభమయింది. తరువాత మరింత బలపడుతూ ఇంట్రా-డేలో 72.51కి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 22 పైసల (0.30 శాతం) ఎగువన 72.67 వద్ద ముగిసింది.