చెరకు రైతులకు సలహా ధర పునరుద్ధరించాలి
Published Friday, 16 November 2018విజయవాడ, నవంబర్ 16: చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సలహా ధరను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, చెరకు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వెలగపూడి ఆజాద్ డిమాడ్ చేశారు. విజయవాడ దాసరిభవన్లో శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యాన చెరకు రైతు సంఘాల నేతలు విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మద్దతు ధరను రూ. 4వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. చెరకు ఎగుమతులను ప్రోత్సహించి పరిశ్రమలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించేలా ఆయా పరిశ్రమల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. చెరకు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వెలగపూడి ఆజాద్ మాట్లాడుతూ చెరకు నరికివేత, రవాణా బాధ్యతల్ని పరిశ్రమలే తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.