సూర్యాపేటకు చేరిన కోదాడ అసమ్మతి!
Published Monday, 19 November 2018సూర్యాపేట, నవంబర్ 18: అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అన్నిపార్టీల్లోనూ అసంతృప్తిని రగిలిస్తోంది. మహాకూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్తోపాటు అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ టికెట్ల కేటాయింపు వ్యవహారం అసమ్మతిని బహిర్గతం చేస్తోంది. టీఆర్ఎస్లో చివరి వరకు ఉత్కంఠత రేకెత్తించిన కోదాడ సీటును టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్కు కేటాయించడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో అసంతృప్తి భగ్గుమంది. ఈనే్నళ్లు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండాను రెపరెపలాడించిన నియోజకవర్గ ఇంచార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డికి టికెట్ కేటాయించక పోవడంతో ఆగ్రహించిన పార్టీ నాయకులు, అనుచరులు ఆదివారం జిల్లాకేంద్రంలోని మంత్రి జగదీశ్రెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు. శశిధర్రెడ్డికి అన్యాయం చేశారంటూ ఆయనకే టికెట్ కేటాయించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. మంత్రి నివాసం ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కోదాడకు చెందిన ఓ మహిళా నాయకురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత పదేళ్లుగా నియోజవకర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యన్నతి కోసం పాటుపడిన శశిధర్రెడ్డికి టికెట్ ఇవ్వకుండా నిన్నటి వరకు ఇతర పార్టీలో ఉన్న వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని పరిరక్షించిన శశిధర్రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్చేశారు. ఆందోళన చేస్తున్న వారితో పలువురు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు మాట్లాడి వారిని శాంతింపజేశారు.