నదుల పరిరక్షణ బాధ్యత అందరిదీ
Published Monday, 19 November 2018ధర్మపురి, నవంబర్ 18: భారతీయ ప్రాచీన నాగరికతకు మూలాధారాలైన జీవనదుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలకు ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్రావు అన్నారు. ఆదివారం రాత్రి ధర్మపురి క్షేత్ర గోదావరి తీరాన నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో వేదికనుండి ఆయన మాట్లాడుతూ, గోదావరి రానున్న రోజులలో జీవనరేఖగా నిలువాలన్నదే తమ లక్ష్యమన్నారు.
గోదావరి మహా హారతి కొత్త పరంపరకు తెర లేపిందని, నదీ తీరాలలోనే నాగరికతలు విలసిల్లిన విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. హారతిలో సంకల్పం, పవిత్రలు ఉన్నాయని, తద్వారా భవిష్యత్తులో అభివృద్ధి జరగగలదన్నారు. పీఠాధిపతుల ఆశీస్సులతో, భక్తుల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో కాలుష్య రహిత గోదావరి పరిరక్షణకై అంకితం కాగలమన్నారు. ధర్మపురితో ప్రారంభించి 50 తీర్థాలలో హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నదిని పూజించాలని, భక్తి భావాలను పెంపొందించు కోవాలని కోరారు. రాబోయే రోజులలో అన్ని ప్రాంతాలలో ఏడాది పొడవునా హారతి ఇవ్వాలనేదే తమ సంకల్పమన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా కార్యక్రమాన్ని కుదించామన్నారు.