ప్రజల మనోభావాలు పట్టవా?
Published Wednesday, 20 February 2019కోల్కతా, ఫిబ్రవరి 19: ప్రభుత్వం ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకునేముందు ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మణిపూర్ మానవహక్కుల కార్యకర్త ఐరోమ్ చాను షర్మిల విమర్శించారు. దేశంలో మార్పు కోసం ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకునేందుకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మణిపూర్ సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలిచ్చే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 16 ఏళ్లుపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన షర్మిల మంగళవారం ఇక్కడ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. ‘నాయకులు ప్రజలకు సేవకుల్లా ఉండాలి తప్ప వారిని నియంత్రించలేరు. ఏ విధాన నిర్ణయం తీసుకునే ముందైనా తప్పనిసరిగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి’ అని పౌరహక్కు సవరణ బిల్లును ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. పౌరహక్కు సవరణ బిల్లు అత్యంత సమస్యాత్మకమైనదని, కనుక ప్రభుత్వం మెజారిటీ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ తనదైన ముద్రతో కూడిన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తమ స్వంత నిర్ణయాలను అమలు చేయడం వల్ల ఈశాన్య భారతంలోని వెనుకబడిన ప్రజలకు అన్యాయం జరుగుతోంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా బిల్లును రూపొందించేటపుడు మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు వారి సెంటిమెంట్ను సైతం గుర్తించాలని ఆమె సూచించారు.