పుట్టిన రోజే.. తాళి కట్టిన రోజు..!
Published Saturday, 13 April 2019భారతావని ప్రసవించిన మహా పురుషులలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు అత్యంత ప్రాచీన చారిత్రక పురుష నాయకుడు. శ్రీరామచంద్రుని చారిత్రక పురుషునిగా పాశ్చాత్య పరిశోధకులు కూడా నిర్ధారించారు. భారతీయ కాలమాన ప్రకారం రాముడు జన్మించినది వైవస్వత మన్వంతరమున పంచమ త్రేతాయుగ నాలుగవ భాగమున ఎనభై వేల సంవత్సరానికి సరియగు విళంబి సంవత్సర చైత్ర శుద్ధ నవమి బుధవారం అని శ్రీమాన్ కోయిల్ కందాడై వెంకట సుందరాచార్య స్వామి వచించారు. పురాణాల ఆధారంగా మహాభారత యుద్దం నాటికి శ్రీరాముడు అతి ప్రాచీనుడు. మను చక్రవర్తి వంశావళిలో రాముడు 65వ పురుషుడని, ఆయన వంశస్తుడు శ్రీకృష్ణునికి సమకాలికుడైన బృహద్బలుడు మను వంశమున 94వ వాడని సుప్రసిద్ధ పాశ్చాత్య చారిత్రిక పరిశోధకుడు పర్గిటేరు నిర్ణయించాడు. వాల్మీకి రామాయణమును అనుసరించి రాముని జనన కాలం క్రీ.పూ.2055వ సంవత్సరంగా ఎల్.డి.స్వామికన్ను పిళ్ళె నిర్ధారించగా, ఎం.ఆర్ సంపత్కుమార సమర్థించారు. పాశ్చాత్య చరిత్రకారులైన డబ్ల్యు.డబ్ల్యు.హంటర్, కానింగ్ ఆర్నాల్డ్ వంటి వారు, రామాయణ చరిత్ర క్రీ.పూ.1000 సంవత్సరాల ప్రాంతమని పేర్కొన్నారు. ప్రాచీన రుగ్వేద మంత్రమున (+.93.14) శ్రీరామ పవిత్ర నామం స్మరించ బడింది. మహా విష్ణువు ఎత్తిన 10అవతారాలలో ఏడవది రామావతారం. శ్రీరాముడు కోసలాధీశుడైన దశరథునికి, కౌసల్య గర్భమున చైత్ర శుద్ధ నవమి పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నంలో మద్యాహ్న సమయాన జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. ఇది వసంత నవరాత్రులకు చివరిదినం. రాముడు పుట్టినది నవమి కాగా, అంతకుముందు అనగా రాముడు గర్భంలో ఉన్న చివరి తొమ్మిది దినాలు చేసే మత విధులు, పూజాదికాలు గర్భ నవరాత్రులుగా ఆరాధనీయం, ఆచరణీయంగా ఉన్నాయి. ఆగస్త్య సంహితలో అష్టమి గురుపూజ, నవమి ప్రతిమా కల్పన, దశమి ప్రతిమాదానంగా మూడునాళ్ళ పండగగా చెప్పబడింది. నవమి ఉపవాసం, రాత్రి పురాణ శ్రవణం, జాగరణ, మరునాడు సంతర్పణ చేయాలని ఉంది. పునర్వసు నక్షత్ర యుక్త నవమి పుణ్యకాలమని భావిస్తారు. అష్టమితో కూడిన నవమిని రామపూజ కూడదని విష్ణ్భుక్తులకు అగస్త్య సంహిత సూచిస్తున్నది. అందుకే మిగులు నవమినాడు వైష్ణవులు రామ జయంతిని జరపడం పాటిస్తారు. శ్రీరామ నవమి నాటి కార్యకలాపాలు మద్యాహ్నం 12గంటలకు చేయాలని వ్రత గ్రంథాలు సూచిస్తున్నాయి. రామ జననం, కల్యాణం జరిపే రామ నవమి కాకుండా రామ సంబంధ పండగలలో ఒకటి రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకునే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి. రెండవది జానకీ జయంతిగా జరుపుకునే ఫాల్గుణ శుద్ద అష్టమి. జనకునికి యజ్ఞశాలకై భూమిని దున్నతుండగా నాగటి చాలుకు తగిలిన బంగారు పెట్టెలో భూజాత దొరికినది ఫాల్గుణ శుక్ల అష్టమిగా భావిస్తారు. శ్రీకృష్ణునిలా కాక, రాముని జన్మదినోత్సవం కన్నా కళ్యాణోత్సవానికి విశిష్టత ఉంది. రామజన్మకు కారణమైన రావణవధ ద్వారా లోకకళ్యాణం. సీతాదేవితో కూడిన రాముని వల్లే లోక కళ్యాణం సాధ్యమైంది. రాముని ఆంధ్రుల దౌహిత్యునిగా భావిస్తారు. కోసలాదేశ రాజు కూతురు కౌసల్య. దక్షిణ కోసల అంటే పూర్వాంధ్ర దేశ ఉత్తర భాగం. కౌసల్య ఆంధ్రుల ఆడపడచు అనీ, వనవాసాన్ని రాముడు తల్లి పుట్టింటి దేశపుటడవులలో గడిపారని వాదం ఉంది. వనవాస రాఘవునికి ఆతిథ్యమిచ్చిన తెలుగు నేలపై ఆయన జన్మదినమైన శ్రీరామనవమి, కళ్యాణ దినంగా ఘనంగా జరుపుకోవడం సనాతన సాంప్రదాయంగా వస్తున్నది.