ఎమ్మెల్యే రాజ్గోపాల్రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసు
Published Thursday, 20 June 2019హైదరాబాద్, జూన్ 19: తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని నడిపించడంలో విఫలమయ్యారంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులను తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం జారీ చేసింది. పదిరోజుల్లోపల నోటీసులు పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం పేర్కొంది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎం కోదండరెడ్డి, కో చైర్మన్ ఏ శ్యాంమోహన్, కన్వీనర్ బీ కమలాకరరావు, సభ్యులు సీజే శ్రీనివాసరావు ఈ నోటీసులపై సంతకాలు చేశారు. ఎఐసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జీని కించపరిచే విధంగా రాజ్గోపాల్ రెడ్డి ప్రకటనలు చేశారని క్రమశిక్షణ సంఘం పేర్కొంది. ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అర్థమవుతోందని పేర్కొన్నారు. నిర్ణీత కాలపరిమితి లోపల వివరణ ఇవ్వని పక్షంలో ఎఐసీసీ మార్గదర్శకాలకు లోబడి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.