S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

రామలక్ష్మణుల దగ్గరకు భిక్షుక
వేషంలో పోయిన హనుమంతుడు
*
కిష్కింధకాండ
*
నిజ స్వరూపంలో రామలక్ష్మణుల దగ్గరికి పోతే, పోయిన పని నెరవేర్చడం కష్టమని భావించిన హనుమంతుడు, వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గర నుండి, వారి దగ్గరికి పోయి ఏకాగ్ర చిత్తంతో, వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు.
(ఇక్కడ సన్న్యాసి రూపం ధరించిన హనుమంతుడు గృహస్థుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి ఆచారం సమంజసమని అనుకోవాలి. సన్న్యాసి గృహస్తుడికి నమస్కారం చేయడం భావ్యం కాదని కొందరంటారు కానీ, అది వాస్తవం కాదు. మనువాక్యమూ కాదు.. మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో, కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గృహస్తుడికి సన్న్యాసి నమస్కరించాలి అనేదే మనువాక్యం. హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల ఆకారాలు చూసిన వెంటనే అధికానంద పరవశుడై తాను ధరించిన సన్న్యాసి ఆకారాన్ని కూడా మరచిపోయి అవశంగా వారికి నమస్కారం చేశాడు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి అభిప్రాయం. ఇది యుక్తం కాదు. హనుమంతుడు నిపుణమతి. గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం కనుక్కొని రమ్మని సుగ్రీవుడు పంపగా వచ్చాడు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను మరచిపోతే తక్కిన కార్యం ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ముతాడు? రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కానీ పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు తాను వేసుకున్న వేషం మారువేషమనీ, తాను చారుడనీ తెలియజేయడానికి నమస్కారం చేశాడు. ఇక్కడ భిక్షువు అంటే సన్న్యాసి కాడు. బ్రహ్మచారి అని కొందరంటారు. అదీ యుక్తం కాదు. హనుమంతుడు మొదటి నుండీ బ్రహ్మచారే కానీ, ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి హనుమంతుడు సన్న్యాసి వేషం ధరించాడనీ, జ్ఞానాధికుడైన రామచంద్రుడికి, గృహస్థుడికి, నమస్కరించడం తప్పు కాదనీ చెప్పాలి.)
సుమనోజ్ఞంగా, సౌమ్యంగా, వంచన లేని మాటలు చెప్పి, రాజకుమారులను తృప్తి కావించి, సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా.
‘అయ్యలారా! మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీలాంటి వారు తిరగాల్సిన స్థలం కాదిదే? ఎందుకంటే మీరు రాజర్షులతో, దేవతలతో సమానంగా వున్నారు. అలాంటి వారికి ఇలాంటి చోట ఏమి పని? మీరు రాజర్షులని నాకెలా తెల్సిందంటారా? మీరు ధరించిన మునిరాజుల వేషాలు అది తెలియజేస్తున్నది. మీలో రాజవేషం, ముని వేషం రెండూ కలిసి వున్నాయి. అలా అయితే మీరు సంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా వున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనడానికి కారణమేంటి? మీ దేహాలు, వాటి కాంతి చూస్తుంటే అవి వ్రతాల వల్ల తపించ తగినదిగా కనబడటం లేదు. నేనింతగా మాట్లాడినా, నాతో మాట్లాడకుండా కొలను ఒడ్డున వున్న చెట్లను చూస్తున్నారు. ఇలాంటి చెట్లను మీరు ఈ అడవిలో చూడలేదా? మిమ్మల్ని చూసి ఈ అడవిలోని పక్షులు, మృగాలు భయంతో పరుగెత్తుతున్నాయి. మీ దేహకాంతి ఈ నిర్మలమైన జలాల మీద పడి దానికి మెరుగుపెట్తున్నట్లు వుంది. ఇంత ఘోరారణ్యంలో మీరిద్దరే తిరగడం అంటే మీకు భయం లేదన్న మాట. మీరు భయమెరుగని ధైర్యవంతుల్లాగా వున్నారు. మీ శరీరాలు బంగారు చాయగా వున్నాయి. మంచి వయసులో వున్నారు మీరు.’
‘సింహాల చూపుల్లాంటి చూపులు, సింహాల పరాక్రమం వంటి పరాక్రమం కలవారు మీరు. ఇంద్రచాపాల్లాంటి పెద్ద విల్లులను చేతిలో ధరించి వున్నారు. స్థిరకాంతి సంపద కలవారిలా ఉన్నారు. బలిసిన ఆబోతులలాగా నడుస్తున్నారు. మీ భుజాలు ఏనుగు తొండాల్లాగా వున్నాయి. ఇలా వున్నా చూడటానికి అందంగా, మహిమలో దేవతలకు సమానంగా వున్నారు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. ఎందుకు మీద మీద నిట్టూర్పులు విడుస్తున్నారు? నడిచిన అలసట వల్లా? మిమ్మల్ని చూసి పక్షులు భయపడుతున్నాయి. ప్రాజ్ఞులారా! మీ చిహ్నాలు చూస్తుంటే బంగారు సింహాసనాల మీద వుండతగ్గవారిలాగా కనిపిస్తున్నారు. ఇలాంటి వీరులు, మీరెందుకు నారచీరెలు కట్టి జడదారుల్లాగా జడలు ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు, మీ ఇప్పటి స్థితి, పరస్పర విరుద్ధంగా వుండటానికి కారణం ఏంటి?’
‘అసమాన కాంతితో కొండలను, అడవులను ప్రకాశించేట్లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు సమానంగా వున్నారు. విశాలమైన వక్షాలున్నాయి మీకు. పెద్ద పెద్ద బాహువులున్నాయి. దేవతా కాంతితో ప్రకాశిస్తున్నారు. ఆకాశాన్ని విడిచి ఈ లోకాన్ని చూసి పోవడానికి క్రీడ కోసం వచ్చిన సూర్య చంద్రుల్లాగా వున్నారు. నిజంగా మీరెవరు? మీ చేతులు ఇసుక పట్ల గుదియల్లాగా గట్టిగా, సుందరంగా, మోకాళ్లను అంటుతూ, గుండ్రటి ఆభరణాలు ధరించడానికి యోగ్యమైనవిగా వున్నాయి. ఎందుకు మీరు ఆభరణాలు ధరించలేదు? ఆభరణాలతో కప్పిపెట్టుకుంటే మీ అవయవాలకు దృష్టి తాకుతుందా? మీరు ఆభరణాలు ధరించినట్లయితే అవే లోకాన్ని వశపర్చుకుంటాయి. నిరావారణమైన మీ దేహ సౌందర్యం ఎందుకు కనపడాలి? ఆభరణాలు ధరించకుండా, కేవలం ఆయుధాలు ధరించడం చూస్తే మీరేదో శత్రుసంహార కార్యక్రమానికి సిద్ధమైనట్లు కనపడుతున్నది. మీరు ఆభరణాలు ధరించకపోయినా మీకు కలిగే సౌందర్య హాని ఏమీ లేదు. కానీ అవి తేజోహీనులై పడి వున్నాయి కదా? మిమ్మల్ని ఆశ్రయించిన వాటిని తేజోహీనులుగా చేయవచ్చా?’
‘అడవులతో, సముద్రాలతో, మేరు - వింధ్య శ్రేణులతో ప్రకాశించే ఈ భూమండలమంతా పరిపాలించే యోగ్యత వున్న వారైనప్పటికీ ఇలాంటి దీన దశలో ఎందుకున్నారు? మీ విల్లు బాణాలు చూడడానికి ఇంద్రుడి వజ్రాయుధానికి సమానంగా ఉన్నాయి. ఇలాంటివి లోకంలో సాధారణంగా కనపడవు. మీ అమ్ముల పొదలు పగవారి ప్రాణాలు తీయడానికి బుసకొట్టే పాముల్లాగా బాణాలతో నిండి వున్నాయి. చూడడానికి నాణాల్లాగా శుభకరంగా వున్నాయి. చాలా నిడివి, వెడల్పు కలిగి చూడడానికి భయంకరంగా అపరంజి బంగారంతో కలిసిన మీ కత్తులు కుబుసం విడిచిన పాముల్లాగా వున్నాయి.’
(హనుమంతుడు ఇన్ని ప్రశ్నలు వేసినా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు - పెంపు వింటూ ఊరకే వున్నారు తప్ప ఒక్కదానికైనా జవాబివ్వలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. ఆయన మాటల పట్ల ఆసక్తి కావచ్చు. తాము మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోల్పోవచ్చు. సన్న్యాసులు తిరగకూడని ప్రదేశంలో తిరుగుతున్న ఈ సన్న్యాసి నిజమైన సన్న్యాసా? కాదా? అన్న సందేహం కావచ్చు. భిక్ష కోసం వచ్చిన సన్న్యాసి అయితే ఆయన స్థితిగతులు చెప్పుకోవాలి కానీ తమ స్థితిగతులను గురించి ఎందుకు అడగాలి? వేగులవాడేమో? ఇక్కడ పరస్పర శత్రువులైన వాలి సుగ్రీవులలో ఇతడు ఎవరి పక్షమో? కాబట్టి ముందుగా తానెవరో చెప్పిన తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి ఉండాలి.
ఇక హనుమంతుడు వేరే విధంగా ఆలోచించసాగాడు. తానెంత మాట్లాడినా వీళ్లు బదులు చెప్పడం లేదు. తన మీద వీరికి సందేహం కలిగిందేమో? ఆ సందేహం తీరేవిధంగా తాను సంభాషిస్తేనే గానీ వాళ్లు తనను నమ్మి తనతో మాట్లాడారని అనుకుంటాడు. వీళ్లు గొప్పవారిలాగా వున్నారు కాబట్టి వీళ్ల స్నేహం తప్పక చేయాలి అని ఆలోచించి తన వృత్తాంతాన్ని కపటం లేకుండా చెప్పడం ఆరంభించాడు.)
‘ఆర్యులారా! నేనింతసేపు మాట్లాడినా మీరొక్క మాటైనా బదులు ఇవ్వలేదు. ఇక నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు, కోతిరాజు, వీరుల గౌరవానికి పాత్రుడు వున్నాడు. అతడిని ఆయన అన్న వెళ్లగొట్టితే నిలువనీడలేక, ప్రాణ భయంతో అమితంగా బాధపడ్తూ దేశంలో తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను’ అని చెప్పి హనుమంతుడు వౌనం దాల్చాడు.
(దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి సుగ్రీవుల పేర్లు, వాలి సుగ్రీవుడిని వెళ్లగొట్టడం, సుగ్రీవుడు ఋశ్యమూకం మీద వుండడం, ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన విషయమే. కాబట్టి సందేహానికి తావు లేదు. ఆ తరువాత తాను సుగ్రీవుడి మంత్రినని చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షంవాడని అర్థమయింది.)
హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు.
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు
80081 370 12
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690