S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కరోనా’తో కంగారు వద్దు!

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌లలో ‘నావల్ కరోనా వైరస్’ (ఎన్‌సీఓవీ) లేదా ‘కోవిడ్-19’ ను ప్రధానంగా పేర్కొనవచ్చు. ఈ వైరస్ అతిస్వల్ప కాలంలో ఒక రికార్డు నెలకొల్పిందంటే అతిశయోక్తికాదు. నావల్ కరోనా వైరస్ సరికొత్తదని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యుహెచ్‌ఓ హెచ్చరించింది. కోవిడ్-19 గతంలో మనుషుల్లో కాని, జంతువుల్లో కాని కనబడలేదు. నావల్ కరోనా వైరస్ (కోవిడ్-19) చైనాలోని వూహాన్‌లో మొట్టమొదట ఇటీవలే కనుగొన్నారు. అతికొద్దిరోజుల్లోనే ఇది చైనా సరిహద్దులు దాటి దాదాపు 95 దేశాలకు విస్తరించింది. 95 దేశాలకు కోవిడ్-19 విస్తరించినట్టు డబ్ల్యుహెచ్‌ఓ ధృవీకరించింది. ఆసియా, యూరప్, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కోవిడ్-19 కు గురైనవారు ఉన్నట్టు తేలింది. చైనాలోనే ఎక్కువ మంది ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారు. కోవిడ్-19 సోకిన వారిలో చైనా అగ్రభాగాన నిలుస్తోంది. చైనాలో 81 వేల మంది, ఇటలీలో 7,400 మంది, ఇరాన్‌లో 6,580 మంది, ఫ్రాన్స్‌లో 1200 మంది, జర్మనీలో 1112 మంది, స్పెయిన్‌లో 680 మంది, యుఎస్‌ఏలో 560 మంది, జపాన్‌లో 500 మంది, స్వీట్జర్లాండ్‌లో 339 మంది కోవిడ్-19 ప్రభావానికి గురయ్యారు. అలాగే బ్రిటన్, నెదర్లాండ్స్, స్వీడన్, బెల్జియం, నార్వే, సింగపూర్, హాంగ్‌కాంగ్ తదితర దేశాల్లో కూడా వందల సంఖ్యలోనే ఈ వైరస్‌కు గురయ్యారు. నావల్ కరోనావైరస్ సోకిన దేశాల్లో మలేషియా, ఆస్ట్రేలియా, బెహరిన్, గ్రీస్, కెనడా, కువైట్, ఇరాక్, ఈజిప్ట్, థాయిలాండ్, తైవాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. భారత్‌లో 43 మంది కోవిడ్-19 కు గురైనట్టు 2020 మార్చి 9 వరకు అందిన సమాచారం వల్ల తేలింది. విదేశాల నుండి భారత్‌కు వచ్చిన వారే ఈ వ్యాధికి గురైనట్టు తేలడంతో, వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రపంచం మొత్తంమీద 1,10,293 మంది ఈ వైరస్ బారినపడ్డారని అధికారికంగా వెల్లడైంది. . ‘జీవాయుధం’ (బయోవెపన్) గా నావల్ కరోనాను ఉపయోగించాలని చైనా ఏదైనా పరిశోధన చేసిందా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా తయారు చేస్తున్న జీవాయుధ ప్రయోగశాల నుండి అనుకోకుండా ఈ వైరస్ బయటపడ్డదా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇవి అనుమానాలు మాత్రమే. ధృవీకరణ కాలేదు.
ఈ అంశం ఎలా ఉన్నప్పటికీ, నావల్ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా పేరుతో మరికొన్ని వైరస్‌లు ఉన్నాయి. వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’. ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు. జంతువుల నుండి మనుషులకు వస్తుంది. పరిశోధనల్లో తేలిందేమిటంటే ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని. ‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది. ఇవి కాకుండా అనేక రకాలైన కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది.
లక్షణాలు..
నావల్ కరోనై వైరస్ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా వస్తాయి. వీటితో పాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది మరింత తీవ్రమైతే న్యుమోనియాగా మారుతుంది. ఊపిరి తిత్తుల వ్యాధులు వస్తాయి. కిడ్నీలు చెడిపోవడం, పనిచేయకపోవడం తదితరాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ చివరకు ప్రాణం పోయే అవకాశం ఉంది.
అయితే నావల్ కరోనా వైరస్ సోకిన వారి పరిస్థితి తీవ్రమైన ప్రభావం ఏమీ చూపవని పరిశోధనల్లో తేలింది. 80 శాతం మంది జలుబు, దగ్గు, జ్వరం వల్ల బాధపడి మందులు వాడటం వల్ల తిరిగి కోలుకుంటున్నారు. 17-18 శాతం మంది తీవ్రంగా అస్వస్థకు గురై, మంచి చికిత్స ద్వారా ఆరోగ్యవంతులవుతున్నారు. రెండు లేదా మూడు శాతం మంది మాత్రమే కోలుకోలేకపోతున్నారు. గుండె జబ్బులు, శ్వాససంబంధిత జబ్బులు ఉన్నవారికి కోవిడ్-19 సోకితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవంగా కోవిడ్-19 నివారణకు స్పష్టమైన మందులు ఏవీ ఇప్పటి వరకు లేవు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరానికి వాడే మందులు, యాంటిబయాటిక్స్ వాడుతున్నారు.
తెలంగాణలో
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరికి కూడా నావల్ కరోనా వైరస్ సోకలేదు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ఒకరికి మాత్రమే ఇది సోకిందని పరీక్షల్లో తేలడంతో అతడికి వైద్య చికిత్స ఇస్తున్నారు. నావల్ కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ముఖ్యంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి థర్మోస్క్రీన్ టెస్ట్‌లు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా వారిని ప్రత్యేకంగా ఉంచుతూ, ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. వారి నుండి శాంపిళ్లు సేకరించి లాబోరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గాంధీ దవాఖానాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి ధృవీకరణకోసం శాంపిల్లను పూణేలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (ఎన్‌ఐవి) కి పంపిస్తున్నారు.
హైదరాబాద్‌లో మార్చి 8 వరకు 36,419 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 703 మంది అనుమానితులు ఉన్నారు. అనుమానితులు అంటే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారు. వీరింతా విదేశాల నుండి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిలో 453 మంది ఇంటి వద్దనే ఉండాలని, బయట తిరగవద్దని వైద్యులు సలహా ఇచ్చారు. నావల్ కరోనా ఉందన్న అనుమానంతో 250 మంది శాంపిళ్లను పూణేకు పంపించి ఎన్‌ఐవీలో పరీక్ష చేయించగా 239 నెగెవిట్ వచ్చాయి. ఒకే ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. మరో 10 మంది శాంపిళ్లు పరీక్ష కోసం పూణే పంపించారు.
జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎవరికైనా కలిగితే వారు ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు తమకు తామే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటూ, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ఇళ్లలో ప్రత్యేక గదులు లేకపోతే దవాఖానాల్లో చేరి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మనిషికి నావల్ కరోనా సోకితే 14 రోజుల తర్వాతే బయటపడుతుందని తెలుస్తోంది. అందుకే 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ఉండాలి. వైద్యుల సలహా మేరకు పరీక్షలు కూడా చేయించుకోవాలి. నావల్ కరోనా వైరస్ సోకినట్టు తేలితే ఖచ్చితంగా ప్రత్యేక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 14 రోజుల తర్వాత కూడా నావల్ కరోనా వైరస్ లేదని తేలితే వారు ఇతర వైరస్‌ల వల్ల బాధపడుతున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇతర వైరస్‌లనుండి విముక్తి కోసం చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
వ్యాప్తి ఎలా?
నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులు ఆలింగనం చేసుకున్నా, కరచాలనం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా ఇతరులకు సోకవచ్చు. లిఫ్ట్‌లలో, టేబుళ్లు, మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది 12 గంటల వరకు ఉంటుంది. ఈ 12 గంటలలోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులుపెట్టినా, శరీరంలోని ఇతర భాగాలు పెట్టినా వారికి సోకవచ్చు. అందుకే కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండటం మంచిది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు, లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి.
ప్రభుత్వ చర్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సూచనల మేరకు భారత ప్రభుత్వం నావల్ కరోనా వైరస్ నివారణ, ప్రజల్లోఅవగాహనకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. భారత్‌లోకి ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తుల ద్వారా నావల్ కరోనా వైరస్ రావడంతో సదరు వ్యక్తులను గుర్తించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ కొత్తగా వెలుగులోకి రావడంతో భారత్‌లో ఈ వైరస్ ఎక్కడా లేదు. విదేశాల నుండి దిగుమతి అవుతోంది. ఈ కారణంగానే ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, అహ్మదాబాద్, భోపాల్ తదితర అన్ని నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అనుమానితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది. వైద్యపరికరాలు, మందులను అవసరమైన అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారు. టీవీలు, రేడియోల ద్వారా కరోనా వైరస్‌పై ప్రచారం చేస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో, ఐడియా తదితర అన్ని మొబైల్‌ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ ప్రభావం, వైరస్ రాకుండా చేయకూడని పనులు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రచారం వల్ల దేశంలోని 99 శాతం ప్రజలందరికీ కోవిడ్-19 పై అవగాహన ఏర్పడ్డది. 2020 ఫిబ్రవరి 15 తర్వాత దేశంలోని ఏ ఇంటిలో చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. అంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నావని చెప్పుకోవచ్చు. మీడియా కూడా తన వంతు పాత్ర బాగానే పోషిస్తోంది. దాంతో ప్రతి ఇంట్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసమ్మర్థం ఉండే ప్రాంతాలకు వెళ్లడం మానివేశారు. అన్ని రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక బహిరంగ సమావేశాలు రద్దయ్యాయి. పండగల సందర్భంగా గుమిగూడటం మానివేశారు. జనం అత్యవసరం అయితేనే ప్రయాణిస్తున్నారు. అత్యవసరం లేకపోతే వాయిదా వేసుకుంటున్నారు. దాంతో బస్సుల్లో, రైళ్లు తదితర విధాల ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గింది.
భయం వద్దు: ముఖ్యమంత్రులు
తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ధైర్యం నెలకొల్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఉద్దేశించి సందేశాలు జారీ చేశారు. నావల్ కరోనా వైరస్ తెలుగురాష్ట్రాల్లో లేదని స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారికి సకాలంలో మంచి చికిత్స అందిస్తున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ, తాను శాస్తవ్రేత్తలతో మాట్లాడానని వెల్లడించారు. నావల్ కరోనావైరస్ 22 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాల్లో ఇది జీవించజాలదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండటం వల్ల ఈ వైరస్ జీవించలేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే వంద కోట్ల రూపాయలు కేటాయించామని అవసరమైతే వెయ్యికోట్ల రూపాయలు ఖర్చుయినా ఈ వైరస్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తామన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరమైతే చికిత్స అందించేందుకు ప్రత్కేక వార్డులను ఏర్పాటు చేశామని కేసీఆర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆసుపత్రుల్లో కూడా ‘ఐసోలేషన్’ వార్డులను ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు
హైదరాబాద్‌తో సహా భారత్‌లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇదే విధమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకులు జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతున్నారా అన్న విషయం తెలుసుకునేందుకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రోజూ దాదాపు 5,500 మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికా, దుబాయి, బ్రిటన్, ఇటలీ, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా తదితర అన్ని దేశాల నుండి భారత్‌కు వస్తున్న ప్రయాణీకులకు ఈ పరీక్షలు తప్పని సరిగా చేస్తున్నారు. ఈ పరీక్షల్లో నావల్ కరోనా వైరస్ ఉన్నట్టు అనుమానం ఉంటే చాలు వెంటనే వారిని ఐసోలేట్ చేసి ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్ (సికింద్రాబాద్) లోని గాంధీ ఆసుపత్రికే తరలిస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్ తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఆర్థికంగా బాగా ఉన్న వారు వారి కోరిక మేరకు అదనపు సౌకర్యాలతో చికిత్స కావాలని కోరితే యశోద, కేర్, కామినేని, నిమ్స్ తదితర ప్రతిష్టాత్మక ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తదితర ఓడరేవుల్లో, ఎయిర్‌పోర్టుల్లో కూడా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒక్కరిని కూడా ఈ పరీక్షలు జరపకుండా పంపించడంలేదు.
ముందుకొచ్చిన ప్రపంచబ్యాంక్
అంతర్జాతీయంగా నావల్ కరోనా వైరస్ చెలరేగడంతో సభ్య దేశాలకు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేసేందుకు ప్రపపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ సమాజానికి చేయూత ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ తెలిపారు. సాంకేతికంగా సభ్యదేశాలకు (మిగతా 10వ పేజీలో)

కరోనాతో కంగారు వద్దు.. (8-9 పేజీ తరువాయ)
చేయూత ఇస్తామని ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన గ్లోబల్ డైరెక్టర్ ఫర్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ పాపులేషన్ ముహమ్మద్ పాటే తెలిపారు. ఐఎంఎఫ్ కూడా తమ ఎమర్జెన్సీ ఫండ్ నుండి సభ్య దేశాలకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. నావల్ కరోనా వైరస్ ప్రభావం ఎంత ఉందో, ప్రపంచ దేశాలు ఆర్థిక, సాంకేతిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయని ఈ ప్రకటన వల్ల స్పష్టమైంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ ప్రతినిధులు వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటికే 95 దేశాలు ఈ వైరస్ ప్రభానికి గురయ్యాయి. 1,10,500 మందికి నావల్ కరోనా సోకగా, వీరిలో 3,850 మంది మరణించారు. ప్రపంచ దేశాలన్నీ హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నాయి. ఈ కారణంగానే ప్రపపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
వ్యాక్సిన్‌కోసం పరిశోధన
నావల్ కరోనా వైరస్ (కోవిడ్-19) రాకుండా ఉండేందుకు అల్లోపతి వైద్య విధానంలో వ్యాక్సిన్ ఇంకా రాలేదు. భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు పరిశోధన సాగిస్తున్నాయి. కోవిడ్-19 సరికొత్త వైరస్ కావడంతో ఇప్పటి వరకు దీని నివారణ కోసం ప్రయత్నాలు జరగలేదు. చైనాలో 2019 డిసెంబర్‌లో కనుగొన్న కోవిడ్-19 వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంటున్నందు వల్ల అంతర్జాతీయంగా శాస్తవ్రేత్తలు వ్యాక్సిన్ తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోని ఎస్. ఫాసి వ్యాక్సిన్ తయారీపై స్పందిస్తూ, కోవిడ్-19 పై ప్రాథమికంగా క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకే మూడు నెలల నుండి ఆరు నెలల సమయం పడుతుందని వెల్లడించారు. సురక్షితమైన, సమర్థవంతమైన వాక్సిన్ రూపొందించేందుకు విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని వెల్లడించారు. మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ వచ్చేందుకు ఎంత కాలం పడుతుందనేది జరిగే పరిశోధనలు, వచ్చే ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 2003 లో సార్స్ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం) విస్తరించిన సమయంలో దీనికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఏడాదిన్నర పట్టిందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ వ్యాక్సిన్ అవసరం రాలేదు. అలాగే 2015 లో జీకా చెలరేగిన సమయంలో కేవలం ఆరు నెలల్లోనే శాస్తవ్రేత్తలు వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ప్రస్తుతం నావల్ కరోనా వైరస్‌ను నివారించేందుకు వీలుగా వ్యాక్సిన్ తయారు చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (యూఎస్) తో పాటు ఇతర సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.
సమన్వయంతో ముందుకు
నావల్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇప్పుడు సమన్వయంతో ముందుకు సాగుతోంది. కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో పాజిటివ్‌కేసు ఒకటి నమోదుకావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు ఏమీ నమోదు కాలేదు. ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కరోనా నివారణకు గట్టిగా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తోంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అత్యంత వేగంగా పనిచేస్తున్నారు. జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. వైద్య శాఖకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్‌రెడ్డి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులు, స్వచ్చంద సేవా సంస్థలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. *
కృంగిన ఆర్థిక వ్యవస్థ
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడంతో మార్కెట్లు, స్టాక్ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం పడ్డది. కరోనా అంతర్జాతీయ సమస్యగా మారినప్పటినుండి స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఒకే ఒక రోజు ఏడు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఈ పరిస్థితి నుండి ఏ విధంగా బయటపడాలన్న అంశంపై అన్ని దేశాలు కూడా దృష్టి కేంద్రీకరించాయి. చమురుమార్కెట్లపై కూడా ఈ ప్రభావం చూపింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరను తగ్గించడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది.
ఇలా ఉండగా రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సూపర్‌మార్కెట్లలో అమ్మకాలు భారీగా పడిపోయాయి. బిగ్‌బజార్, స్పెన్సర్స్, రెలియన్స్ ఫ్రెష్, త్రివేణి, వాల్‌మార్ట్, డీ-మార్ట్, హెరిటేజ్, మోర్ తదితర చైన్ సూపర్‌మార్కెట్లలో అమ్మకాలు తగ్గాయి. సూపర్ మార్కెట్లలోకి వివిధ రకాలైన వ్యక్తులు వస్తుంటారని, ఎవరు, ఏ వ్యాధితో బాధపడుతుంటారో, వారి వల్ల తాము అనారోగ్యానికి గురికావలసి వస్తుందని ప్రజల్లో భయం, ఆందోళన కలగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాధారణ మార్కెట్లు, పూలమార్కెట్లు, పళ్ల మార్కెట్లపై కూడా కరోనా ప్రభావం కనిపిస్తోంది. మార్కెట్లోని ఇతర రకాల దుకాణాల్లో కూడా అమ్మకాలు భారీగా తగ్గిపోయినట్టు వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది.
భారత్‌లోకి వచ్చే చైనా ఉత్పత్తులన్నీ నిలిచిపోయాయి. చైనా నుండి భారత్‌కు ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీలు, మొబైల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు తదితర విలువైన వస్తువులు భారీగా వచ్చేవి. అలాగే ఇళ్లలో ఉపయోగించే విద్యుత్, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చైనా నుండి దిగుమతి అయ్యేవి. పిల్లలు ఆడుకునే బొమ్మలు, బ్యాటరీతో నడిచే రకరకాల బొమ్మల దిగుమతి కూడా ఆగిపోయింది. మన దేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతయ్యే రకరకాల వస్తువులపై కూడా కరోనా ప్రభావం చూపించింది.

పి.వి. రమణారావు 98499 98093