గుమ్మిర్యాల ఎత్తిపోతలకు స్థల పరిశీలన
Published Friday, 13 May 2016మోర్తాడ్, మే 13: మోర్తాడ్ మండలంలోని గుమ్మిర్యాల రైతుల కలలు ఎట్టకేలకు సాకారం కానున్నాయ. శుక్రవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని గోదావరి నదిలో పంప్హౌస్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. టిఎస్ ఐడిసి ఇఇ సౌరాజ్ నేతృత్వంలోని అధికారుల బృందం గుమ్మిర్యాలను ఆనుకుని ప్రవహించే గోదావరి నదిలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు. ఎక్కడైతే నీటి సౌకర్యం ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాలను చూశారు. ఎత్తిపోతల మ్యాప్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం గోదారిపై వారధిని నిర్మించిన స్థలం వద్దే ఎత్తిపోతలు చేపడితే బాగుంటందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేయడంతో ఆ మేరకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మోర్తాడ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపిపి కల్లెడ చిన్నయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాపూర్ణానందం, మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా మాట్లాడుతూ, గత పాలకులు సాధ్యం కాదని చెప్పిన గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకానికి తమ నేత, వాటర్గ్రిడ్ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి సిఎంను ఒప్పించి నిధులను మంజూరు చేయించారని అన్నారు. రెండు మాసాల క్రితమే ఈ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం 11కోట్ల 40లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని అన్నారు. దాదాపు గుమ్మిర్యాల రైతులు దశాబ్దంన్నర కాలంగా పాలకులను ఈ ఎత్తిపోతల కోసం కోరుతున్నారని తెలిపారు. సాగునీటి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న రైతులను చూసి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుండి నిధుల మంజూరుకు కృషి చేశారన్నారు. ఈ పథకం పూర్తయితే గ్రామంలోని 1453హెక్టార్ల భూమికి పూర్తిస్థాయిలో సాగునీరు లభిస్తుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పథకాన్ని పూర్తి చేయడానికి నిశ్చయించిన ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఈ రోజున గోదావరిలో పంప్హౌస్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించామని అన్నారు.