S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మా ఊరు

........................................................
ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు.
......................................................
పేర్లు పెట్టడం అనేది ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే - ఎడ్వర్డ్ ఆబి
* * *
ఎప్పుడో ఒకసారి చెప్పడానికి ఏముంది అని ఓ కవిత రాశాను. ‘అందరితో కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను’ అన్నాను. కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు మారినట్టుంది, చెప్పడానికి చాలానే ఉంది అని కూడా అన్నాను. చెప్పదలచుకుంటే ఎంతయినా చెప్పవచ్చు. మూడు సంవత్సరాల నుంచి లోకాభిరామం పేరుతో చాలా సంగతులు చెపుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ మధ్యన ఒకచోటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన చాలామందిలో నాకు పరిచయమున్న వాళ్లు నలుగురే. ఆ నలుగురితోనే నాలుగు మాటలు మాట్లాడి, మరో నలుగురితో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటి దారి పట్టే సందర్భంలో కళకళలాడుతున్న ఒక అమ్మవారు దగ్గరగా వచ్చారు. బాగా పరిచయమున్నట్టే పలకరింపులు కూడా లేకుండా ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండీ’ అన్నారు. ‘ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణం భాష ఎందుకని వస్తుంది?’ అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు మా ఊరు మళ్లీ గుర్తుకు వచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా అలవాటుగా చిన్ననాటి నుంచి, నేటి వరకు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను. ఆవిడ నవ్వేసి వెళ్లిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వాళ్లందరూ క్రమం తప్పకుండా చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్లారు. నాకు ఆనందమయిందా? ఏమో? అయ్యే ఉంటుంది!
మా ఊరు పేరు ఏనుగొండ. ఇంగ్లీషులో మాత్రం ‘వై’తో మొదలుపెట్టి రాస్తారు. మరిదాన్ని యేనుగొండ అనాలి కదా! కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను ఇప్పటికీ మా వాండ్లందరు ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్లున్నాయి. రాంపూర్ అనే ఊళ్లు మన దేశంలో 84 ఉన్నాయట. ఇది తపాలా శాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్లగుద్ది, మరి దేన్నయినా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవుగానీ, ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ అని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పేర్లు రానురాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ ఊళ్ల నుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న సంగతులేగానీ ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంతదూరంలో ఉన్న ఒకానొక గుట్టకు ఊరగుట్ట అని పేరు. దాని మీద ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. మామిడికాయ ఆకారంలో ఉండే ఆ రాయి, ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు ఒక పెద్దరాతి మీద కొంతమాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం పడలేదు. హైదరాబాద్ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్లు మా రాతిని, మామిడికాయ రాతిని చూచింది, లేనిది తెలియదు.
ఏనుగొండ అనే మా ఊరు మొదట్లో ఆ గుట్ట కింద ఉండేదట. గుట్ట కింద అంటే గుట్ట ఉన్నచోట కాదు. దాని పక్కన అని అర్థం. అక్కడి నుంచి ఊరు రెండు అంచెలలో ప్రస్తుతం ఉన్నచోటికి వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో, మధ్యలో ఉండే పొలాలలో తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలిన మన్ను, కుండముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను గమనించాను. అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు దొరికాడు అని ఊళ్లో కలకలం మొదలయింది. అందరమూ కలిసి వెళ్లాము. గణేశుని విగ్రహాన్ని తవ్వి బండికి ఎత్తించి ఊళ్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు, పునస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండే రెండు. అందులో మాది ఒకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి అట. అట్లా చేసిన విగ్రహం ఏదో ఒక రకంగా మళ్లీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకూ నిజమే అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే, ఆ విగ్రహం ఏమయింది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తొంగి చూసింది. నేను ఈ మధ్యన మా ఊరికి వెళ్లడానికి కారణం కనిపించడం లేదు. ఈసారి వెళ్లి గణపతిని వెతకాలి.
ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్ద మనిషి వచ్చి ఊళ్లో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఆయన ఏమయినా గుడిని పట్టించుకుంటున్నాడేమో తెలియదు.
కార్తీకమాసం వస్తే ఊళ్లో వాళ్లు రోజుకు ఒకరు చొప్పున కార్తీక పూజ అనే ఆకుపూజ చేయించేవారు. నాకే నమ్మకం కలగదు గానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత నా తల మీద పడింది. తెలిసిన కుటుంబాల వారు పొద్దునే్న సరంజామాతో వచ్చి ‘ఇవాళ కార్తీకం చెయ్యాలె! అన్మాండ్లకు చెండూరం పెట్టు, సాయంత్రం పూజ కూడ చేయించు’ అని అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు. కనుక నేను కాదనలేక పోయేవాడిని. సరంజామాలో సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున దేవుని నైవేద్యానికి, నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దాని పేరు సాహిత్యం. సాహిత్యం అన్న మాటకు సరయిన అర్థమేమిటో ఇప్పటికయినా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి, గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో తెలియలేదు. తెలిసిన తరువాత ఎవరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటేగదా!
ఝలక్: ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా అనుకోకుండా మరునాడు మహబూబ్‌నగర్ అనే పాలమూరుకు వెళ్లాను. అదేదో జక్కడు జాతరకు పొయ్యొచ్చినట్టు, పాతి ముట్టిచ్చుకోని (అంటే ఏమో ఎవరికన్న తెలుసునా పోవలసిన చోటికి పొయ్యి, వంటల పొయ్యి కాదు, వెళ్లి, చేరి లాంటిదన్నమాట, దాన్ని తా వెనిక్కి వస్తే అది పాతి ముట్టిచ్చుకోవుడు) తిరిగి వచ్చిన నాకిప్పుడు ఏనుగొండలోకి పొయ్యే మనసు లేదు, సమయము అంతకన్నా లేదు. పోయేటప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి నాకొక చిత్రం అర్థమయింది. ఈ చిత్రము విచిత్రము గావచ్చును లేదా బొమ్మ గావచ్చును. పంచాయతి సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు, పట్నమయిన పాలమూరు అను మహబూబ్‌నగర్‌లోని ఒక వార్డు మాత్రమే.
ఊరి గుర్తింపు గంగలో పోయింది. అయినా సరే, మా ఊరి గురించి చెప్పుకోవలసిన సంగతులు నా మనసులో మాత్రం కావలసినన్ని ఉన్నయి.

కె.బి. గోపాలం