రాగమంజరి
Published Saturday, 10 December 2016శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణంతో దక్షిణ భారత కర్ణాటక సంగీత స్వర ధ్వజస్తంభం స్వర్గారోహణం అయింది.
అటువంటి గంధర్వ గాయకుడిని తయారుచేసి మరల భూమి మీద ప్రతిష్ఠించటానికి ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాల సమయం అవసరం అవుతుంది. నేటి నుంచి ఇంధ్రసభలో స్వర సంగీత సమ్మేళనం అవిరళంగా స్రవిస్తుంది.
శ్రీ మురళీకృష్ణ సంగీత వైభవాన్ని గురించి ఎంత వ్రాసినా, ఎంత పలికినా తనివి తీరదు. సంగీత ప్రక్రియలు అన్నిటిలోనూ అతను దిట్ట. లలిత, సుగమ, శాస్ర్తియ సంగీతాలలో అతను సాధించని ప్రక్రియలు లేవు. ప్రభుత్వ కళాశాలల ప్రధాన అధ్యాపకుడుగా, ఆకాశవాణి రేడియో కేంద్రాల సంగీత ప్రయోక్తగా ఎనె్నన్నో వైవిధ్యాలను ప్రదర్శించాడు. శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యులలో ప్రథమ పంక్తిని నిలచి, మరెందరో శిష్య ప్రశిష్యులకు మార్గదర్శకుడు, నిర్ణయకర్త అయినాడు. 72 మేళ రాగాలలో కీర్తనలు చేయడంతో వాగ్గేయకారుల జాబితాలో తప్పనిసరిగా చేరాడు. ఎన్నో సుగమ సంగీత కీర్తనలకు బాణీలు కట్టి రసోత్పత్తి చేశాడు. గానకచేరీలకు, రేడియో/ టివి ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కాకుండా దృశ్య సినిమా రంగంలోనూ అనేక భూమికలు వహించి సంగీత సరస్వతికి ఎన్నో నదీనదాలు సృష్టించాడు.
తనపై ఒక బాణిని యేర్పరచుకుని ఆ దారిలో నిరవధికంగా పరుగులు తీశాడు, పల్లవించాడు.
ఆ ‘నగుమోము’ను ఇప్పుడు మనం చూడలేక పోవచ్చును గాని, ఆ సంగీత మంజరిని - యాంత్రిక నిర్వహణల ప్రగతి ధర్మమా అని - ఎన్ని తరాలకయినా వినిపించగలము.
సంగీత వెల్లువలో అతను సముద్రమంత లోతయినవాడు. అంతరంగ ధ్వని సంచారంలో తరగని గని. అలాంటి మహా కారణజన్మునికి ఎన్ని మాటలతో మనం నివాళులు అర్పించగలం? ఎంత చేసి, ఋణం తీర్చుకోగలం? అలా తీర్చుకోవాలనుకోవడమే అపరాధం. ఆ దారిలో నడిచి, దానిని మరింత పటిష్టం, ఆదరణీయం, అనుసరణీయం చేయడానికే సంగీత వర్తమాన కళాకారులందరూ శ్రమించి కృషి చేయవలసి వుంది.
సంగీత సరస్వతిని జనసామాన్యుల ఇంటి ముంగిటకు సరాసరి తీసుకురావలసిన అవసరం ఉంది.
వర్తమాన సంగీత మూర్తులందరికీ అతడు ఆదర్శమూర్తి. నిరంతర ఆరాధ్య దైవం.