Others
ప్రణబ్ దాదా ప్రకంపనలు..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కరడుగట్టిన కాంగ్రెస్వాది, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 7న నాగపూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జరిగే తృతీయ వర్ష శిక్షావర్గ ముగింపు సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొనడానికి అంగీకరించడం రాజకీయ సంచలనం సృష్టిస్తున్నది. వివిధ సామజిక రంగాలకు చెందిన ప్రముఖులను తమ కార్యక్రమాలకు ఆహ్వానించి, వారికి ఆర్ ఎస్ఎస్ పట్ల గల దురభిప్రాయాలు తొలగించడానికి ప్రయత్నిస్తుండటం చాలాకాలంగా చేస్తూనే ఉన్నారు. గతంలో మహాత్మా గాంధీ, రాష్టప్రతిగా చేసిన డా. రాధాకృష్ణన్ వంటి నేతలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్టప్రతి కాకముందు అబ్దుల్ కలాం హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ పట్ల పండిట్ నెహ్రూ సహితం చైనా యుద్ధం తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. 1963లో రిపబ్లిక్ దినోత్సవ పరేడ్కు ఆర్ఎస్ఎస్ ను ఆయన ఆహ్వానించారు. ప్రధాని లాల్ బహదుర్ శాస్ర్తి పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను ఆర్ఎస్ఎస్ కు అప్పచెప్పారు. ఇందిరాగాంధీ సైతం పలు కీలక సమయాలలో ఆర్ఎస్ఎస్ నుండి వ్యూహాత్మక మద్దతు పొందారు.
ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైతే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్న సమయంలో రాజకీయ ప్రాధాన్యతను సంతరింప చేసుకోవడం సాధారణమే కాగలదు. ఒక కరడుగట్టిన రాజకీయ వేత్త, రాష్టప్రతి భవన్ లో అడుగుపెట్టే వరకూ ఏనాడు ఆర్ ఎస్ ఎస్ పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించని వ్యక్తి అకస్మాత్తుగా ఈ విధంగా హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరోవంక ప్రధాని మోదీ వచ్చే ఎన్నికలలో మెజారిటీని కూడదీసుకోలేని పక్షంలో ప్రత్యామ్న్యాయం గురించి ఆలోచిస్తున్న ఆరెస్సెస్ వ్యూహాత్మకంగానే ప్రణబ్ను ఆహ్వానించినట్లు భావించవలసి వస్తుంది.
డిసెంబర్, 2010లో ఢిల్లీకి సమీపంలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో కేంద్ర ఆర్దికమంత్రిగా ఉన్న ప్రణబ్ ప్రతిపాదించిన రాజకీయ తీర్మానంలో ఆరెస్సెస్కు, దాని అనుబంధ సంస్థలకు ఉగ్రవాదులతో గల సంబంధాల గురించి యుపిఎ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాష్టప్రతి భవన్ లోకి అడుగు పెట్టిన తర్వాతనే ఆర్ ఎస్ ఎస్ పట్ల తన ధోరణిని ఆయన మార్చుకున్నట్లు కనబడుతున్నది. రెండు, మూడు సార్లు ప్రధాన మంత్రి పదవి ఆశించి భంగపడిన ప్రణబ్ సోనియా గాంధీ కుటుంబం పట్ల తీవ్ర అసంతృప్తి పెంచుకున్నారు. యుపిఎ ప్రభుత్వాలలో ఆయన సేవలను ఉపయోగించుకొన్నా, ఆయనను సోనియా ఎప్పుడు పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇందిరా గాంధీ మృతి చెందగానే ప్రధాని మంత్రి పదవి చేపట్టడానికి సీనియర్ ఎవరని రాహుల్ గాంధీ అడిగితే తానే అంటూ అమాయకంగా బయటపడి కొంతకాలం పదవులకు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ప్రణబ్ ఉండవలసి వచ్చింది. రాజీవ్ గాంధీ తిరిగి ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నా ఎన్నడూ విశ్వాసంలోకి తీసుకోలేదు.
2004లో యుపిఎ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సహజంగా తానే ప్రధానమంత్రి కాగలనని ప్రణబ్ భావించారు. తాను ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో రిజర్వుబ్యాంక్ గవర్నర్ గా నియమించిన మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేయడం, ఆయన మంత్రివర్గంలో తాను ఉండవలసి రావడంతో ఎంతగా ప్రణబ్ కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకోవడం కష్టం కాబోదు. మన్మోహన్ను రాష్టప్రతిగా పంపి, తనను ప్రధానిగా చేస్తారని అనుకున్నానని ఆయన తన గ్రంథంలో స్వయంగా వ్రాసుకోవడం తెలిసిందే. 2013లో గత్యంతరం లేకనే ఆయనను రాష్టప్రతి అభ్యర్థిగా సోనియాగాంధి అంగీకరించారని ఈ సందర్భంగా గమనించాలి. వాస్తవానికి ఆమె ఉపరాష్టప్రతి అహ్మద్ అన్సారీ ని రాష్టప్రతిగా చేయగలని అనుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతోనే రెండుసారి ఉపరాష్టప్రతిగా చేశారు. రిలయన్స్ అధినేత అంబానీ ద్వారా తన అభ్యర్థిత్వం కోసం ప్రణబ్ వత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు మాజీ లోక్ సభ స్పీకర్ సంగ్మా పోటీకి సిద్ధపడ్డారు. ఆయనకు బిజెపి మద్దతు ఇస్తే, ప్రణబ్ వంటి వారు కాంగ్రెస్ లో కొంత చీలిక తీసుకు రాగలరని, అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం కష్టం కాగలదనే భయంతోనే ప్రణబ్ అభ్యర్థిత్వం ఖరారు అయింది.
ప్రణబ్కు అంబానీలతో గల అనుబంధం ఇప్పటిది కాదు. పారిశ్రామిక వేత్తలే ప్రభుత్వ విధానాలను రూపొందించే స్థాయికి ఎదిగే విధంగా రిలయన్స్ అంబానీతో ప్రారంభమైనది. కేంద్ర మంత్రిగా తొలి రోజులలో అంబానీకి ప్రభుత్వంలో అండగా ఉన్నది ప్రణబ్ కావడం గమనార్హం. యుపిఎ-1 హయాంలో ఆర్ధిక మంత్రిగా ఒక బడ్జెట్ లో కేవలం అంబానీ కంపెనీలకు మాత్రమే వర్తించే విధంగా రూ 20 వేల కోట్లమేరకు పన్ను రాయితీలు కల్పించడం ఆయనకున్న అనుబంధానికి నిదర్శనం. ఇప్పుడు కూడా ప్రాంతీయ పక్షాల సహకారంలో ప్రధాని కావడం కోసం కూడా ఆ అనుబంధం కూడా అక్కరకు వచ్చే అవకాశం లేకపోలేదు.
2014 ఎన్నికలలో యుపిఎ తిరిగి మెజారిటీ సాధించుకోలేదని ముందే అందరికి అర్ధమయింది. అయితే అనూహ్యంగా బిజెపికి నరేంద్ర మోదీ మెజారిటీ తీసుకువస్తారని ఎవ్వరు ఊహించనే లేదు. ఏ కూటమికి మెజారిటీ రాని పక్షంలో అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రధానమంత్రి పదవి చేపట్టడం కోసం అప్పుడు కూడా ప్రణబ్ మంత్రాంగం జరిపారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అందుకోసం ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలతో పాటు, పలు ప్రాంతీయ పార్టీలతో సహితం మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం బీజేపీ తగు మద్దతు కూడదీసుకోలేని పక్షంలో మమతా బనెర్జీ, మాయావతి, రాహుల్ గాంధీ వంటి వారికన్నా ప్రణబ్ ముఖర్జీ వైపు మొగ్గే అవకాశం లేకపోలేదు. అందుకోసమే ప్రణబ్ వ్యూహాత్మకంగా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. రాష్టప్రతిగా ఉండగా, ఆ తర్వాత కూడా మోదీంతో ప్రణబ్ మంచి సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పలు సందర్భాలలో ఆయన గురించి ప్రసంశలు కురిపిస్తూనే ఉన్నారు. రాష్టప్రతిగా పదవి విరమణ చేసిన తర్వాత తాను విశ్రాంతి తీసుకొంటూ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటానని చెప్పారు. అయితే ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ గాని, మరే నాయకుడు గాని ఏ విషయంలో కూడా ఆయనను సంప్రదించిన దాఖలాలు లేవు. దేశంలో ప్రస్తుతం నేరుగా ఆరెస్సెస్ పై రాజకీయ పోరాటానికి తలపడుతున్నది వామపక్షాలతో పాటు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ మాత్రమే కావడం గమనార్హం. అందుకనే ప్రణబ్ వంటి కరుడుకట్టిన కాంగ్రెస్ వాదులు తమకు అవసరమైనప్పుడు ఆసరాకు రాగలరని ఆరెస్సెస్ కూడా భావిస్తూ ఉండడంలో పొరపాటు ఉండబోదు.
బిజెపి, ఆరెస్సెస్లను ఫాసిస్ట్ లుగా అభివర్ణిస్తూ తాను వీటిపై సైద్ధాంతిక పోరాటం జరుపుతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొంటున్నారు. పైగా నేరుగా మోహన్ భాగవత్ పై దళిత వ్యతిరేకిఅంటూ కొన్ని సందర్భాలలో ఆరోపణలు గుప్పించారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉన్నదని విమర్శలు చేసి పరువునష్టం దావాను రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్నారు. రాహుల్ ఎత్తుగడలకు విరుగుడుగా ప్రణబ్ అస్త్రాన్ని ఇప్పుడు సంధించే ప్రయత్నం చేస్తున్నారా ? రాబోయే కాలమే సమాధానం చెప్పగలదు.
ప్రణబ్ ముఖేర్జీ పరిపాలనలో, రాజకీయ అంశాలలో ఆరితేరిన నేత అయినా దాదాపు ఒంటరివారు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ నాయకత్వంపై అసమ్మతితో కుంగిపోయారే గానే ఎప్పుడూ బలప్రదర్శన చేసే ప్రయత్నం చేయలేదు. అందుకనే సొంతంగా ప్రధాని పదవిని సాకారం చేసుకోవాలంటే ప్రాంతీయ పార్టీలను ఏ మేరకు సమీకరించ గలరో చెప్పలేము. అందుకు బలమైన సంస్థలు, పార్టీల అండ అవసరం కాగలదు. ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పుడు సాధారణ రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు గాని చెప్పుకోదగిన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే, అటువంటి మార్పు కోసం ప్రయత్నించిన ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటి ప్రధానులు ప్రణబ్కు అండగా వ్యవహరించారు. 2019లో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ప్రభుత్వం ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర కావడం కోసం ప్రణబ్ పావులు కదపడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం కచ్చితంగా ఒక చెప్పుకోదగిన మజిలీ కాగలదనడంలో సందేహం లేదు.