Others

గ్రంథాలయ పితామహుడు అయ్యంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అయ్యంకి వెంకట రమణయ్య వర్ధంతి
*
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు విస్తరించిన కారణంగా పుస్తకాలు చదివేవారు తక్కువయ్యారు. పెద్ద గ్రంథాలయాలు కొన్ని బాగా నడుస్తున్నప్పటికీ, మరికొన్ని గ్రంథాలయాలు సరైన సంరక్షణ, పర్యవేక్షణ లేక మూతపడుతున్నాయి. ఇంకా కొన్ని పేరుకు మాత్రమే గ్రంథాలయాలుగా నడుస్తున్నాయి. వీటిలో ఒక పుస్తకం కావాలంటే అది ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉందో చెప్పలేని పరిస్థితి ఉంటోంది. గ్రంథాలయ ప్రాముఖ్యతే తెలియనివారు కొందరు. ఈ సందర్భంలో కొన్ని దశాబ్దాలకి పూర్వం ఈ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రముఖ గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకులు అయ్యంకి వెంకట రమణయ్య ఎంత కృషిచేశారో తెలుసుకోవలసిన అవసరం చాలా వుంది.
అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు, పత్రికా సంపాదకుడు, ‘గ్రంథాలయ సర్వస్వము’ అనే పత్రికను నిర్వహించారు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచారు.
రమణయ్య జాతీయ, రాష్టస్థ్రాయిలో వందలాది సమావేశాలు నిర్వహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, పి.సి.రాయ్, చిత్తరంజన్‌దాస్ వంటి మహామహులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వెంకటరమణయ్య నిర్వహించిన వివిధ అఖిల భారత ప్రజాగ్రంథాలయ సమావేశాలకు రిసెప్షన్ కమిటీ అధ్యక్షులు, అధ్యక్షులుగా ఉన్నారు. వెంకటరమణయ్యగారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారంతో అనుబంధం పెంచుకొని, ఆ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యారు.
అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరుగడించారు. తన 19వ ఏటనే బిపిన్ చంద్రపాల్‌గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగువేశారు. 1910లో బందరులో ‘ఆంధ్ర సాహిత్య పత్రిక’ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారు. 1914లో ప్రథమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. భారతదేశంలో తొలిసారిగా అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1915లో సంఘ పక్షాన ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919 నవంబర్ 14న చెన్నైలో తొలి ‘అఖిల భారత పౌర గ్రంథాలయం’ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఈ సంఘాన్ని స్థాపించిన రోజును నేషనల్ లైబ్రరీ డేగా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము (నేషనల్ లైబ్రరీ వీక్)ను నిర్వహిస్తున్నది. 1924లో ఆ సంఘపక్షాన ‘ఇండియన్ లైబ్రరీ జర్నల్’అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, ‘‘ప్రజాగ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం’’ అని చాటి చెప్పారు.
1934-48 మధ్య, కోస్తాఆంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటుచేశారు. గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కార్యదర్శులు నిర్వహించారు. వీరి మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్ర దేశంలోని ప్రతి గ్రామం పర్యటించారు.
1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. గ్రంథాలయ విశారద, గ్రంథాలయ పితామహ, గ్రంథాలయోద్ధారక, సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య వీరు పొందిన గౌరవాలు. భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ గౌరవాన్నిచ్చింది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు గ్రంథాలయ శాస్తప్రరీక్షలో ఉత్తమ విద్యార్థికి వీరి పేరుతో స్వర్ణపతకం ఇస్తుంది. 1979లో అయ్యంకి లైబ్రరీ కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రంథాలయ కార్యకర్తను సత్కరిస్తోంది.
అయ్యంకి వెంకట రమణయ్యగారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలంలో ఉన్న కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ. వీరు టెయిలర్ హైస్కూలులో విద్యాభ్యాసం చేశారు. వీరి తండ్రి వెంకటరత్నంగారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు.
వెంకటరమణయ్యగారు 1979, మార్చి 7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మనుమడు ఆచార్య డా.వెంకట మురళీకృష్ణ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో ‘అయ్యంకి’ పేరిట ఒక గ్రంథాలయం నెలకొల్పాలని స్థానికుల అభిలాష.

- దామరాజు నాగలక్ష్మి, 9912940182