క్రీడాభూమి
మరో టైటిల్ వేటలో ‘తెలుగు తేజం’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కౌలూన్, నవంబర్ 21: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో తొలిసారి టైటిల్ కైవసం చేసుకుని మంచి ఊపుమీద ఉన్న తెలుగు తేజం, ఒలింపిక్ రజత పతక విజేత పివి.సింధు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో మరోసారి సత్తా చాటుకుని వచ్చే నెల దుబాయ్లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించాలని ఎదురు చూస్తోంది. ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల బ్రెజిల్లో జరిగిన రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత బాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సింధు తాజాగా ఆదివారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో తొలిసారి టైటిల్ విజేతగా నిలిచి తన ప్రతిభను నిరూపించుకుంది. సింధు గత ఏడాది చైనా ఓపెన్ నుంచి రెండో రౌండ్లోనూ, హాంకాంగ్ ఓపెన్ నుంచి తొలి రౌండ్లోనూ నిష్క్రమించిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచిన క్రీడాకారిణికి 11,000 రేటింగ్ పాయింట్లు లభిస్తాయి. కనుక ఈ టోర్నీలోనూ సింధు చక్కగా రాణించి టైటిల్ను గెలుచుకోగలిగితే దుబాయ్లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో ఆమెకు టాప్-8లో చోటు లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 27,490 పాయింట్లతో ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో కొనసాగుతున్న సింధు హాంకాంగ్ ఓపెన్లో విజేతగా నిలిస్తే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ (35,420 పాయింట్లు)ను కిందికి నెట్టి ర్యాంకింగ్స్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది.
దీంతో హాంకాంగ్ ఓపెన్లో కూడా చక్కగా రాణించి సత్తా చాటుకునేందుకు ఎదురు చూస్తున్నానని సింధు పిటిఐ వార్తా సంస్థకు తెలిపింది. ర్యాంకింగ్ పాయింట్ల గురించి తనకు పెద్దగా తెలియదని, హాంకాంగ్ ఓపెన్పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నానని, ఈ టోర్నీలో చక్కగా రాణించగలనని ఆశిస్తున్నానని ఆమె స్పష్టం చేసింది. హాంకాంగ్ ఓపెన్లో సింధు ఇండోనేషియాకు చెందిన లిండావేణి ఫనేత్రీతో పోరాటాన్ని ఆరంభించనుండగా, మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకున్న సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో థాయిలాండ్ క్రీడాకారిణి పోర్న్టిప్తో తలపడనుంది. పోర్న్టిప్ గత వారం చైనా ఓపెన్ తొలి రౌండ్లో సైనాను ఓడించిన విషయం తెలిసిందే. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత సైనా నెహ్వాల్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే.
ఇదిలావుంటే, హాంకాంగ్ ఓపెన్లో సింధు, సైనాతో పాటు భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ విజేత హెచ్ఎస్.ప్రణయ్, అజయ్ జయరామ్, పురుషుల డబుల్స్ విభాగంలో మను అత్రి, బి.సుమిత్ రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ చైనాకు చెందిన క్వియావో బిన్తోనూ, అజయ్ జయరామ్ చైనాకు చెందిన రెండో సీడ్ ఆటగాడు చెన్ లాంగ్తోనూ తలపడనుండగా, డబుల్స్ తొలి రౌండ్లో మను అత్రి, సుమిత్ రెడ్డి కొరియాకు చెందిన సోల్గియు చోయ్, కో సంగ్ హ్యున్ జోడీతో పోరాడనున్నారు.
చిత్రం.. చైనా ఓపెన్ టైటిల్తో సింధు