క్రీడాభూమి
గాయాలతో ఉక్కిరిబిక్కిరి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఏప్రిల్ 5: పదో ఐపిఎల్ను పలువురు క్రికెటర్ల గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. కొంత మంది ఆటగాళ్లు పూర్తిగా టోర్నీకి దూరంకాగా, మరి కొంత మంది కనీసం కొన్ని మ్యాచ్ల్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్నారు. స్టార్ అట్రాక్షన్గా నిలిచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో రాంచీ టెస్టు ఆడుతున్నప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ, బంతిని ఆపేందుకు కోహ్లీ డైవ్ చేశాడు. భుజం నేలకు బలంగా తగలడంతో గాయపడ్డాడు. దీనితో అతను అత్యంత కీలకమైన చివరి, నాలుగో టెస్టులో ఆడలేకపోయాడు. ఐపిఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించాల్సిన అతను ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. ఈనెల రెండో వారంలో అతను ఐపిఎల్లో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామని బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద భుజం గాయం కోహ్లీని ఐపిఎల్కు దూరం చేసే పరిస్థితుల్లోకి నెట్టింది.
టెస్టు స్పెషలిస్టుగా ముద్ర వేయించుకున్నప్పటికీ, నిరుడు ఐపిఎల్లో 14 మ్యాచ్లు ఆడిన లోకేష్ రాహుల్ 397 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లోనే గాయపడిన అతను ఈసారి ఐపిఎల్లో ఆడడం లేదు. త్వరలోనే రాహుల్కు లండన్లో శస్త్ర చికిత్స జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఈ పరిణామం బలమైన ఎదురుదెబ్బ.
దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ ఈసారి ఐపిఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడాలి. అయితే, ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆడుతున్నప్పుడు గాయపడిన అతను పూర్తిగా కోలుకోలేదు. దీనితో ఈసారి ఐపిఎల్కు అతను దూరమయ్యాడు. స్పెషలిస్టు వికెట్కీపర్గా, మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించగల బ్యాట్స్మన్గా పేరు సంపాదించిన డికాక్ లేకపోవడం డేర్ డెవిల్స్ను సమస్యల్లో నెట్టడం ఖాయం.
భారత టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ కూడా పదో ఐపిఎల్ నుంచి దూరమైన వారి జాబితాలో ఉన్నాడు. ఇంగ్లాండ్తో చెన్నైలో టెస్టు ఆడుతున్నప్పుడు గాయపడిన అతను, ఇంకా కోలుకోలేదు. భుజానికి, చేతి మణికట్టుకు బలమైన దెబ్బలు తగిలినందున, సాధ్యమైనం త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోవాలని మురళీ విజయ్కి బిసిసిఐ సూచించింది. మొత్తం మీద అతను ఈ ఐపిఎల్లో పాల్గొనడం అనుమానంగానే ఉంది. పూర్తిగా టోర్నీ నుంచి వైదొలగకపోయినా, కనీసం కొన్ని మ్యాచ్లకు అతను దూరంగా ఉండక తప్పదు.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. లోకేష్ రాహుల్ మాదిరిగానే అశ్విన్ కూడా ఈసారి ఐపిఎల్లో ఆడడం లేదు. రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ తరఫున ఆడాల్సిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ భారత్టో టెస్టు సిరీస్ ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు. అతనికి తొమ్మిది నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. దీనితో అతను ఐపిఎల్కు దూరమయ్యాడు. ఇలావుంటే, పూర్తిగా కాకపోయినా, కనీసం మొదటి లెగ్ పోటీలకు దూరమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వారిలో మార్టిన్ గుప్టిల్ (కోల్కతా నైట్ రైడర్స్), డ్వెయిన్ బ్రేవో (గుజరాత్ లయన్స్), రవీంద్ర జడేజా (గుజరాత్ లయన్స్), ఉమేష్ యాదవ్ (కోల్కతా నైట్ రైడర్స్), టిమ్ సౌథీ (ముంబయి ఇండియన్స్) తదితరులు ఉన్నారు. ఇక ఈ టోర్నీలో ముగిసేలోగా ఇంకెంత మంది గాయాల బారిన పడతారోనన్న భయం వివిధ దేశాల క్రికెట్ బోర్డులను వేధిస్తున్నది.