క్రీడాభూమి
కోహ్లీతో పోటీ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ధర్మశాల, డిసెంబర్ 9: అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోటీపడే సత్తా ఎవరికైనా ఉందా? భారత క్రికెటర్లలో ఎవరైనా అతని సమీపానికైనా రాగలుగుతారా? ఈ ప్రశ్నలకు సమాధానంగా కొంత మంది రోహిత్ శర్మ పేరును పేర్కొంటున్నారు. కోహ్లీతో పోటీపడగల సత్తా అతనికి ఉందని వారి నమ్మకం. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ల సిరీస్ నుంచి కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో, అతని స్థానంలో జట్టుకు నాయకత్వం వహించనున్న రోహిత్ను కోహ్లీతో పోల్చడంలో తప్పేమీ లేదని గణాంకాలను విశే్లషిస్తే స్పష్టమవుతుంది. కాలికి గాయమైనప్పుడు అతనిది నడవలేని పరిస్థితి. మళ్లీ క్రికెట్ ఆడగలడా అన్న అనుమానాలు అప్పట్లో తలెత్తాయి. కానీ, ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతను జూన్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో మళ్లీ అంతర్జాతీయ వేదికపైకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 18 వనే్డలు ఆడి, 1,076 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ వనే్డల్లో చేసిన పరుగులు 1,031కాగా, సాధించిన సెంచరీలు నాలుగే. ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో 300లకు పైగా పరుగులు చేసిన ఇద్దరు బ్యాట్స్మెన్లో రోహిత్ ఒకడు. మరొక బ్యాట్స్మన్ కోహ్లీ అననుకుంటే పొరపాటే. రోహిత్తో కలిసి ఆ ఫీట్ను అందుకున్న మరో ఆటగాడు శిఖర్ ధావన్. కాగా, జూన్-జూలై మాసాల్లో వెస్టిండీస్లో జరిగిన వనే్డల నుంచి రోహిత్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఆ సరీస్లో కోహ్లీ ఆడాడు. అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు రోహిత్ కంటే కోహ్లీ ఐదు మ్యాచ్లు అదనంగా ఆడాడు. 1,275 పరుగులు చేశాడు.
ప్లేయింగ్ ఎలెవెన్లో స్థిరమైన స్థానం లేకపోయినప్పటికీ, రోహిత్కు పగ్గాలు అప్పచెప్పడం అతని సామర్థ్యాన్ని చెప్పకనే చెప్తున్నది. ప్రతి ఫార్మాట్లోనూ స్పెషలిస్టులు అవసరమని జాతీయ సెలక్టర్లు బలంగా నమ్ముతున్నారన్నది వాస్తవం. ఇది స్పిన్నర్లు లేదా పేసర్లు, ఓపెనర్లు లేదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు మాత్రమే పరిమితం కాలేదు. స్టాండ్బై కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరనే విషయంపైనా సెలక్టర్లు దృష్టి కేంద్రీకరించారు. అందుకే, రోహిత్కు నాయకత్వ బాధ్యతలను అప్పచెప్పారు. గాయం కారణంగా కోహ్లీ అందుబాటులో లేనప్పుడు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టుకు అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పుడు వనే్డ సిరీస్లో కోహ్లీ లేకపోవడంతో, ఆ బాధ్యతలను రహానేకు కాకుండా రోహిత్కు అప్పగించడం సెలక్టర్ల ఆలోచనా సరళికి అద్దం పడుతుంది. బ్యాట్స్మన్గానేకాదు.. కెప్టెన్గానూ రోహిత్ రాణిస్తాడన్నది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పష్టమైంది. 2013లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న అతను జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఈ ఏడాది చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్పై ముంబయి ఇండియన్స్ ఒక పరుగు తేడాతో గెలిచి, టైటిల్ను అందుకోవడం వెనుక రోహిత్ కెప్టెన్సీ ప్రతిభ దాగుందనేది వాస్తవం. టీమిండియాకు అతను స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందింస్తాడనడంలో సందేహం లేదు. కోహ్లీతో పోటీపడుతూ, దూకుడుగా వ్యవహరించే రోహిత్ కెప్టెన్సీకి అన్నివిధాలా అర్హుడే.
ప్రపంచ ర్యాంకింగ్స్ అంశం కూడా వనే్డ సిరీస్కు నాయకత్వం వహిస్తున్న రోహిత్కు సవాలు విసురుతున్నది. మూడు మ్యాచ్ల వనే్డ సిరీస్లో శ్రీలంకను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తేనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ను టీమిండియా నిలబెట్టుకుంటుంది. ఏ ఒక్క మ్యాచ్ని చేజార్చుకున్నా, దక్షిణాఫ్రికాతో పంచుకుంటున్న అగ్రస్థానానికి గండిపడుతుంది. కెప్టెన్గా తన తొలి సిరీస్లోనే టీమిండియా ర్యాంక్ చేజారిపోకుండా చూసేందుకు రోహిత్ సర్వశక్తులు ఒడ్డాలి. కాగా, లంకతో ఆదివారం ప్రారంభమయ్యే వనే్డ సిరీస్తోపాటు ఆతర్వాత జరిగే టి-20 సిరీస్కు కూడా రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ రెండు సిరీస్లతో, ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా మ్యాచ్లకు తెరపడుతుంది. వచ్చే ఏడాది ఎక్కువ భాగం సిరీస్లు విదేశాల్లోనే ఉన్నాయి కాబట్టి, అందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిన అవసరం జట్టుపై ఉంది. ఆ దిశగా ఆటగాళ్లను నడిపించాల్సిన బాధ్యత కూడా రోహిత్దే.
చిత్రం..రోహిత్ శర్మ