తెలంగాణ

చత్తీస్‌గఢ్‌లో మావోల విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 6: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యంలో ఈ నెల 2న చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ వేడి ఇంకా చల్లారలేదు. మావోయిస్టులు ఏవైపు నుంచి దాడులు చేస్తారోనని ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరిబిగబట్టిన నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లో మంగళవారం మావోలు రెచ్చిపోయారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా డోర్నపాల్ పరిధిలోని పరిధిలోని కుడ్తి గ్రామం వద్ద తెలంగాణ- జగ్దల్‌పూర్ మార్గంలో తిరుగుతున్న ఏపీ 29జెడ్3500 నెంబర్ గల ఆర్టీసీ బస్సును మావోయిస్టులు అటకాయించి నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉండగా వారిని కిందకు దిగమని హెచ్చరించిన మావోయిస్టులు అనంతరం బస్సును దగ్ధం చేశారు. ప్రయాణికుల ఎదుటే ఒకరిని దారుణంగా హతమర్చారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సస్పెండైన కానిస్టేబుల్‌గా తెలియవచ్చింది. కాగా ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు తెలంగాణలో అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని చెప్పిన 48 గంటల్లోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సును దగ్ధం చేసి హెచ్చరికలు పంపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు పరుగులు తీసి సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై అధికారులకు వివరించారు. కాగా ఇదే ప్రాంతంలో మరొక ప్రైవేట్ బస్సును, టిప్పర్‌ను, ట్రాక్టర్‌ను కూడా మావోయిస్టులు దగ్ధం చేశారు. పూజారికాంకేర్ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు అక్కడ వదిలిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 9న తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోలు పేర్కొన్నారు. ఈ సంఘటనతో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ డిపోకు చెందిన బస్సును మావోలు దగ్ధం చేయడంతో చత్తీస్‌గఢ్‌కు వెళ్లే బస్సులను ఆర్టీసీ నిలిపివేసింది. మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు రాత్రి వేళ వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నారు.
chitram....
మావోయస్టులు తగులబెట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు

ఎవరి అజెండా వారిదే!

అదుపు తప్పిన ఉభయ సభలు

నిస్సహాయ స్థితిలో స్పీకర్, రాజ్యసభ చైర్మన్
పార్లమెంట్ పరువు దిగజారుస్తున్నారంటూ ఆవేదన

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 6: బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, శివసేన, అన్నా డీఎంకేతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ గొడవ చేయటంతో మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు పూర్తిగా అదుపు తప్పాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు ఇద్దరూ కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. పోడియం వద్ద నిలబడిన సభ్యులు సుమిత్రా మహాజన్, వెంకయ్య నాయుడుకు ప్లకార్డుల అడ్డంపెట్టి వారు మాట్లాడేది టీవీల్లో రాకుండా అడ్డుపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలుగుదేశం, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్‌ఎస్, కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, మరాఠీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ శివసేన, బ్యాంకులను కొల్లగొట్టిన చోటా మోదీ- నీరవ్ మోదీ ఎక్కడ అంటూ కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలిస్తూ ఉభయ సభల్లోనూ గొడవ చేశారు. లోక్‌సభ మంగళవారం కేవలం పదిహను నిమిషాలు సాగితే.. రాజ్యసభ ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగలేకపోయింది. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజారుస్తున్నారంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు, ఉపాధ్యక్షుడు పీజే కురియన్ పలుమార్లు హెచ్చరించినా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో గొడవ చేస్తున్న సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. తెలుగుదేశం సభ్యుడు ఎన్.శివప్రపాద్ ఎన్‌టీఆర్ వేషధారణలో సభకు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మాగంటి బాబు నిన్నటి మాదిరిగానే మూడు మతాల పవిత్ర గ్రంథాలపై శ్రీ వేంకటేశ్వరస్వామి చిన్న విగ్రహం పెట్టుకుని సభకు వచ్చారు.
లోక్‌సభ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలతోపాటు టీడీపీ, టీఆర్‌ఎస్, శివసేన, అన్నాడీఎంకే తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలివ్వడం ప్రారంభించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకుని విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీపై చర్చ జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. చర్చకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు పారిపోతోందని ప్రశ్నించారు. ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే బదులిస్తూ తాము కూడా చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. అయితే పోడియంను చుట్టుముట్టిన సభ్యుల నినాదాల మూలంగా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటంతో సభను బుధవారం నాటికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ అదే సీన్..
రాజ్యసభలోనూ అదే సీన్ కొనసాగింది. సభ సమావేశం కాగానే తెలుగుదేశం, అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలివ్వడం ప్రారంభించారు. నీరవ్ మోదీ ఎక్కడున్నాడు? చోటా మోదీని స్వదేశాని తీసుకురావాలంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నినాదాలిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు నినాదాలిచ్చారు. కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. వీరి నినాదాల మూలంగా సభ స్తంభించిపోయింది. సభ్యులను శాంతింపజేసేందుకు వెంకయ్య నాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. సభ్యులిలా వ్యవహరించటం మంచిది కాదు.. మీరు రాజ్యసభ పరువు, ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మనం వ్యవహరిస్తున్న తీరును దేశం మొత్తం చూస్తోందనేది విస్మరించరాదని హెచ్చరించారు.
అయినా ఫలితం లేకపోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైనప్పుడు ఉపాధ్యక్షుడు కురియన్ సభను అదుపులోకి తెచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సభ్యుల గొడవ మూలంగా సభ పూర్తిగా అదుపు తప్పడంతో చేసేదిలేక కురియన్ బుధవారానికి వాయిదా వేయకతప్పలేదు.

మంగళవారం లోక్‌సభలో పోడియంను చుట్టుముట్టి గొడవ చేస్తున్న సభ్యులు