తెలంగాణ

ప్రధాని సభను బహిష్కరించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 5: మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పర్యటించడానికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభకు వెళ్లకుండా సాంఘిక బహిష్కరణ చేసేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా జాతీయ రహదారి దిగ్బంధం చేసేందుకు వెళ్లిన నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంత్రి హరీష్‌రావు కల్పించుకుని ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, సింగారం గ్రామాల ప్రజలను ఒప్పించారు. ఒక్క వేముల్‌గట్ ప్రజలు మాత్రం ససేమిరా అంటూ భీష్మించి కూర్చున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటుకానున్న నిమ్జ్ కోసం నిర్వహించిన భూ సేకరణ బాధితులు హైకోర్టులో దావా వేయగా బుధవారం 123, 124 జివోలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పుతో కథ మళ్లీ అడ్డం తిరిగింది. భూములు ఇచ్చేందుకు అంగీకరించిన ప్రజలే సంతకాలు చేయకుండా 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ వద్ద ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ఆదివారం రానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు చర్చనీయాంశం కాగా లాఠీచార్జి మరింత చర్చకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో బాధితులు సభలో ఎక్కడ గలాటా సృష్టిస్తారోనని పోలీసులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న పరిణామాలపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, మఫ్టీ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అందుకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టడంలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, వేములగట్ ప్రజలు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రధాని సభకు వెళ్లకుండా గ్రామంలోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్ని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే లాఠీచార్జితో వీపులు చిట్లిన తాము మరోమారు అలాంటి దుస్సంఘటనకు తావీయకుండా ప్రధాని సభను సాంఘిక బహిష్కరణ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం ఎర్రవల్లి గ్రామస్థులు రెవెన్యూ అధికారులతో 2013 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తేనే తాము సంతకాలు పెడతామని లేదంటే వెళ్లిపోవాలని సూచించడంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగిపోయారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి, పల్లెపహాడ్, సింగారం, ఏటిగడ్డ కిష్టాపూర్ తదితర గ్రామాల ప్రజలు ఏ మేరకు స్పందిస్తారోనన్న ఆందోళనతో పాటు సభకు రాకుండా ఉంటే అదే సంతోషంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రిని కలిసి భూ బాధితుల సమస్యలు విన్నవించడానికి అనుమతించాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది కార్యకర్తలను కూడగట్టుకొని ప్రధాని బహిరంగ సభను ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తామంటూ హెచ్చరించారు. మొత్తంమీద ప్రధాన మంత్రి సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టడం ఖాయం. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు, కానిస్టేబుళ్లతో పాటుగా పొరుగు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. కోమటిబండతో పాటు బహిరంగ సభ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని అణువణువునా శోధిస్తున్నారు. మొదటిసారిగా వస్తున్న ప్రధానికి తమ సత్తా ఏమిటో చాటుకోవాలని అధికార టిఆర్‌ఎస్ పార్టీ జన సమీకరణలో నిమగ్నమైంది. ప్రతి గ్రామం నుండి ఒక బస్సు చొప్పున సుమారు 2 లక్షల మందిని సభకు తరలించి విజయవంతం చేసేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్కంఠ భరింతంగా సాగే ప్రధాని సభ సజావుగా సాగుతుందా లేక ఇబ్బందికరంగా మారుతుందా? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది.