తెలంగాణ

‘సామాజిక’ సమరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఎన్నికలు వస్తే చాలు. గోడలన్నీ రాజకీయ నినాదాలతో నిండిపోయేవి. ఎన్నికలకు ముందుగానే గోడలు రిజర్వ్ చేసుకునే వారు. గోడలమీద నినాదాలు రాయొద్దని పార్టీలకు చెప్పలేక ఇంటి యజమానులు తల్లడిల్లేవారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా టిఎన్ శేషన్ దెబ్బకు గోడలపై నినాదాలు మాయమయ్యాయి. అయితే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ గోడపై చూసినా ఎన్నికల నినాదాలే కనిపిస్తున్నాయి. అయితే అవి ఇంటి గోడలు కాదు. సామాజిక మీడియా గోడలు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సామాజిక మాద్యమాల్లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆయా పార్టీల నేతలు సొంత ఖాతా, పార్టీ ఖాతా, అభిమానుల ఖాతాల్లో పార్టీల నినాదాలు దర్శనమిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయపక్షాలు హైటెక్ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచార ఉధృతిని పెంచాయి. హెటెక్ పార్టీగా పేరొందిన తెదేపా గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో మాత్రం వెనుకబడింది. సామాజిక మాధ్యమాల్లో తెరాస ముందుంటే, తెదేపా మిగిలిన పార్టీలకంటే వెనుకే ఉంది. 18నెలల పాలనా కాలంలో తామేంచేశామో చెబుతూ సామాజిక మాధ్యమాల్లో తెరాస ప్రచారం సాగిస్తోంది. స్లైడ్లద్వారా జనంలోకి వెళ్లేలా సంక్షిప్తంగా తెరాస ప్రచారం నిర్వహిస్తుంది. 24 గంటల నిరంతర విద్యుత్, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధికి లక్ష్యాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం, ఇంటింటికి తాగునీటి వంటి పథకానికి ఒక్కో స్లైడ్‌ను రూపొందించి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ప్రచారం చేస్తున్నారు. వీటితోపాటు వాట్సప్ గ్రూపుల్లో సైతం ప్రచారం సాగేలా చూస్తున్నారు. ఫేస్‌బుక్‌లో తెరాస ఆఫీషియల్ పేజీతోపాటు పార్టీ వెబ్‌సైట్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఒకవైపు పార్టీ ప్రచారం సాగిస్తుంటే, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తెలంగాణవాదులు సైతం ఇంటి పార్టీని గెలిపించాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి దిగుతున్నారు.
పావలా శ్యామలకు సిఎం సహాయం చేయడం కావచ్చు, కెటిఆర్ ఎన్నికల ప్రసంగం.. ఏదైనా కావచ్చు క్షణాల్లో ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవుతోంది. తెరాస ప్రచారం ప్రధానంగా అధికారపక్షంగా తాము చేసిన పనుల ప్రచారనికే ప్రాధాన్యతనిస్తోంది. ఇక భాజపా ప్రచారం మొత్తంలో హైదరాబాద్‌లోని ఆంధ్రప్రాంతం వారిపై దృష్టిపెట్టింది. ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని కెసిఆర్ తీవ్రంగా విమర్శించారని, ఇప్పుడు వారి ఓట్ల మద్దతుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో ప్రచారం సాగిస్తోంది. కేంద్రంలో అధికారంలోవున్న బిజెపి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తోందని ప్రచారంలో తెలిపారు. ఇక హైదరాబాద్‌లో తెరాస అధికారంలోకి వచ్చాక నీటి సమస్య తలెత్తిందని, రోడ్లు అధ్వాన్నంగా మారాయని స్లైడ్లద్వారా సామాజిక మాధ్యమాల్లో బిజెపి ప్రచారం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ ప్రచారం పేలవంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పేరిట పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రూపొందించిన ప్రచార నినాదాలు కనిపిస్తున్నాయి. పని చేసింది కాంగ్రెస్ అయితే ప్రచారం చేసుకుంటుంది తెరాస అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది. తెలంగాణలో మైనారిటీలకు 26 పథకాలను అమలు చేయడం ఎంఐఎం సాధించిన విజయంగా ఎంఐఎం ప్రచారం చేస్తోంది. సామాజిక మాధ్యమాలను ఎంఐఎం విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎన్నికల ప్రచార వీడియోలను ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. తెదేపా ప్రధానంగా ఆంధ్రపైనే దృష్టి సారించడం, ఆంధ్రలోనే తెదేపా అధికారంలో ఉండటంతో గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో ఆ పార్టీ వెనకబడింది. పార్టీ ఆధ్వర్యంలో అధికారిక ఫేస్‌బుక్‌లో ఆంధ్ర గురించే పేర్కొన్నారు. తెలంగాణ కోసం, జిహెచ్‌ఎంసి కోసం కొందరు తెదేపా నేతలు ఫేస్‌బుక్ ఖాతాలు ప్రారంభించినా అందులో పోస్టులు, ప్రచారం పెద్దగా లేదు. ఇక పోటీలో లోక్‌సత్తా అంతంత మాత్రంగానే ఉన్నా సామాజిక మాధ్యమాల్లో మాత్రం బాగా ప్రచారం చేస్తోంది. తెరాసది కుటుంబ పాలన అంటూ కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీశ్‌రావు ఫోటోలతో లోక్‌సత్తా ప్రచారం చేస్తోంది.